స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని స్థాయిలో భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఏడాది క్షీణముఖం పట్టనుంది. చివరకు ప్రభుత్వం సైతం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటులో 7.7శాతం తరుగుదల కనిపిస్తుందని అంగీకరించింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలో పరుగులు తీయించడానికి 'ఆత్మ నిర్భర్' ప్యాకేజీ ఏమాత్రం సరిపోదు. కొవిడ్ వల్ల దెబ్బతిన్న జన జీవితాలను గాడిన పెట్టడానికి ఇతర దేశాలు పెద్దయెత్తున డబ్బు ఖర్చు పెట్టాయి. ఆత్మ నిర్భర్ పథకం కింద రాబోయే ఏడాది కాలంలో ప్రజలకు, పరిశ్రమలకు నేరుగా నగదు రూపేణా సహాయం చేయాల్సింది పోయి, ప్రభుత్వం వచ్చే 3-5 ఏళ్లకు రుణ గ్యారంటీల బాటను ఎంచుకుంది. ప్రధాన దేశాలు తమ జీడీపీలో మూడు శాతం నుంచి ఏడు శాతాన్ని ఉద్దీపన కింద ఖర్చుపెట్టగా, భారత ప్రభుత్వ ఉద్దీపన వ్యయం జీడీపీలో రెండు శాతానికి మించబోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కుటుంబాల వినియోగ వ్యయం 9.5శాతం మేర కోసుకుపోనున్నది. ఆర్థిక వ్యవస్థలో 65శాతానికి వ్యక్తిగత వినియోగ వ్యయమే ఆలంబన అయిన భారతదేశానికి ఇది పెద్ద దుర్వార్త.
ప్రభుత్వాల చొరవ కీలకం
బ్రిటిష్ వలస పాలనలో లూటీ అయిన భారతదేశం, స్వాతంత్య్రం వచ్చిన తరవాత పెట్టుబడుల కొరతతో సతమతమైంది. అప్పుడు ప్రభుత్వమే పొదుపును ప్రోత్సహించి పెట్టుబడుల సమీకరణకు తోడ్పడింది. 1950-51 నుంచి 1979-80 వరకు ప్రభుత్వ రంగ సగటు పొదుపు 2.8శాతం; ప్రైవేటు రంగ పొదుపు 1.45 శాతమని రిజర్వు బ్యాంకు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ 30ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సగటు పొదుపు 4.3శాతం. గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ పొదుపు రేటు తరిగిపోగా, ప్రభుత్వ రంగ సంస్థల పొదుపు రేటు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. బ్యాంకుల జాతీయీకరణ పొదుపునకు గొప్ప ఊతమిచ్చింది. 1991 తరవాత సైతం పొదుపు రేట్లు పెరిగాయి. గడచిన పదేళ్లలో కుటుంబాల పొదుపు రేట్లు రెట్టింపు అయ్యాయి. 2009-10లో కుటుంబాల పొదుపు రూ.9.89 లక్షల కోట్లు; 2019లో అది రూ.19.96 లక్షల కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ, ఇతర బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లలో, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజలు డబ్బు దాచుకోవడమే దీనికి కారణం. అంతకుముందు ప్రధానంగా బ్యాంకు డిపాజిట్లపై వారు ఆధారపడేవారు. 1981 మార్చిలో రూ.8,244 కోట్లుగా ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, 2020 మార్చికల్లా రూ.9,18,459 కోట్లకు పెరిగాయి. 1989లో ఎల్ఐసీ పెట్టుబడులు రూ.17,343 కోట్లు; 2020 మార్చికి అవి రూ.29,57,163 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో పొదుపు డిపాజిట్లు రూ.12,995 కోట్ల నుంచి రూ.43,50,746 కోట్లకు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ నిధులు రూ.52 కోట్ల నుంచి రూ.22,26,203 కోట్లకు హెచ్చాయి.
అయితే ఫైనాన్స్ రంగంలో నికరమైన పొదుపు సాధనాల కొరత వల్ల, ఆర్థిక మోసాలు పెరగడం వల్ల ప్రజలు బంగారం, వెండి మినహా భూములు, భవనాలు, యంత్రాలు, పరికరాల వంటి భౌతిక ఆస్తులలో పొదుపు చేస్తున్నారు. ఆర్థిక మోసాలపై నియంత్రణ సంస్థలు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు భౌతిక ఆస్తులకు మరలుతున్నారు. 1999లో మొత్తం పొదుపు రూ.3.25 లక్షల కోట్లలో భౌతిక ఆస్తుల వాటా రూ.1.33 లక్షల కోట్లు; 2018-19లో కుటుంబాల మొత్తం పొదుపు రూ.34.47లక్షల కోట్లలో భౌతిక ఆస్తుల వాటా రూ.21.80లక్షల కోట్లని ఎన్ఎస్ఓ సర్వేలో తేలింది. మొత్తం పొదుపులో భౌతిక ఆస్తుల వాటా 40శాతం నుంచి 63 శాతానికి పెరిగిందన్న మాట.
దేశీయ మూలధనం పెరగాలి