తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కేంద్ర దర్యాప్తు సంస్థకు రాజకీయ గ్రహణం

పలు రాష్ట్రాలు తమ పరగణాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థకు బేషరతు దర్యాప్తు అవకాశాన్ని నిరాకరించడం వల్ల అవినీతిపై దర్యాప్తు జరపడం కష్టతరంగా మారిందని ఇటీవల సీబీఐ పార్లమెంటరీ కమిటీకి వివరించింది. ఆ దురవస్థకు విరుగుడుగా ప్రస్తుత చట్టాన్ని సవరించడం, లేదా సీబీఐ పనిపోకడల్ని స్పష్టంగా నిర్వచిస్తూ కొత్త చట్టం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ తాజాగా సూచించింది.

By

Published : Mar 22, 2021, 7:37 AM IST

editorial
కేదసకు రాజకీయ గ్రహణం

'ఎవరి ఒత్తిళ్లకూ లోనుకాకుండా, స్వతంత్ర సంస్థగా కార్యనిర్వాహక స్వయంప్రతిపత్తితో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పనిచేసేలా ఓ చట్టాన్ని కేంద్రం తీసుకువస్తుందా?'- సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర సర్కారుకు ఆ ప్రశ్న సంధించి ఎనిమిదేళ్లు కావస్తోంది. కేంద్రంలోని పాలకపక్షం చేతిలో రాజకీయ పనిముట్టులా అంతకంతకూ భ్రష్టుపట్టిపోతున్న సీబీఐ- విధి నిర్వహణలో తాను ఎదుర్కొంటున్న అవరోధాల్ని పార్లమెంటరీ కమిటీ ఎదుట ఇటీవల ఏకరువు పెట్టింది. పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ, పంజాబ్‌ వంటి ఎనిమిది రాష్ట్రాలు తమ పరగణాల్లో కేదసకు బేషరతు దర్యాప్తు అవకాశాన్ని నిరాకరించాయంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు, పీఎస్‌యూల్లోని పెద్దల ఆర్థిక అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు జరపడం కష్టతరంగా మారిందని వాపోయింది. ఆ దురవస్థకు విరుగుడుగా ప్రస్తుత చట్టాన్ని సవరించడం, లేదా కేదస పనిపోకడల్ని స్పష్టంగా నిర్వచిస్తూ కొత్త చట్టం చేసి మరిన్ని అధికారాలు దఖలు పరచే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని పార్లమెంటరీ కమిటీ తాజాగా సూచించింది.

సంస్కరణలు అవసరం

కేదసకు మాతృక అయిన 1946 నాటి డీఎస్‌పీఈ చట్టంలోని ఆరో విభాగం- కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప తక్కినచోట్ల కేదస దర్యాప్తునకు ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని నిర్దేశిస్తోంది. సమాఖ్య స్ఫూర్తి భావనకు, కేంద్రం రాష్ట్రాల మధ్య అధికార వికేంద్రీకరణకు గొడుగుపట్టే ఆ నిబంధనను నీరుగార్చేలా సీబీఐ కోసం ప్రత్యేక చట్టాన్ని చేసే అధికారం కేంద్రానికి లేదని అటార్నీ జనరల్‌గా పనిచేసిన న్యాయకోవిదులు సీకే దఫ్తరి, నిరేన్‌ దె అయిదు దశాబ్దాల క్రితమే స్పష్టీకరించారు. కేదస దర్యాప్తులకు రాష్ట్రాల సమ్మతి తప్పనిసరి అని నిరుడు నవంబరులో సుప్రీంకోర్టూ రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి పట్టం కట్టింది. విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపులే లక్ష్యంగా కేదస పనితీరు దిగజారబట్టే దాని విశ్వసనీయత కొడిగట్టిపోయింది. దాని ప్రతిష్ఠ ఇనుమడించాలంటే ప్రత్యేక చట్టం కాదు, పాలక పార్టీ పంజరం నుంచి విముక్తం చేసే గట్టి సంస్కరణలు పట్టాలకెక్కాలి!

దారి తప్పిన కేదస

పరిశ్రమ, నిష్పక్షపాతం, నిజాయతీలే దారిదీపాలుగా సాగుతామన్న కేదస దశాబ్దాల క్రితమే దారితప్పింది. అవినీతిపై పాశుపతం కావాల్సిన సంస్థకు పట్టిన రాజకీయ చెదను వదిలించేలా 1997లోనే సుప్రీంకోర్టు 45 ఆదేశాలతో స్పష్టమైన మార్గదర్శనం చేసినా నాటి తీర్పును సారహీనం చేసేలా దుర్రాజకీయం మళ్ళీ గజ్జెకట్టింది. బ్రిటన్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ తరహాలో సమర్థ నిష్పాక్షిక వ్యవస్థను నెలకొల్పి, కేదస ఈడీలు చేసే విచారణల పర్యవేక్షణ బాధ్యత దానికి అప్పగించాలని, నిందితుల విడుదలలో ప్రాసిక్యూషన్‌ వైఫల్యం ప్రస్ఫుటమైతే, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధిత అధికారిని జవాబుదారీ చెయ్యాలనీ ఆనాడు సుప్రీంకోర్టు గిరిగీసింది. అలాంటి స్వతంత్ర, నిష్పక్షపాత యంత్రాంగాలేవీ లేకపోబట్టే- రాజకీయ దర్యాప్తుల్ని అడ్డుకొనేందుకు రాష్ట్రాలు రాజ్యాంగ రక్షణల్ని ఆశ్రయిస్తున్నాయి.

కేదసకు స్వేచ్ఛ ప్రసాదించడంపై మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వం 2013లో కొంత సందడి చేసినా- నాటి మంత్రివర్గ బృందం సూచనలు కొరగానివని భాజపా ఘాటు విమర్శలు రువ్వింది. కేదసలో దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ విభాగాలు వేర్వేరుగా ఉండాలని, వాటి డైరెక్టర్లను ప్రధాని, లోక్‌సభలో విపక్షనేత, లోక్‌పాల్‌ ఛైర్మన్‌ నియమించాలని, కేదస కేసులు వాదించే లాయర్లకూ ప్రభుత్వంతో సంబంధం ఉండరాదని నాడు భాజపా ఘనతర సూచనలు చేసింది. కేదస సంచాలకులే పరస్పర అవినీతి ఆరోపణలతో వీధినపడి పరువు మాసిన నేపథ్యంలో పటిష్ఠ సంస్కరణలు తక్షణావసరం. ప్రధాని, విపక్షనేత, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన సమర్థుడినే కేదస సారథిగా నియమించి, సంకుచిత రాజకీయ శృంఖలాల నుంచి ఆ వ్యవస్థను విముక్తం చేయడం- సమాఖ్య స్ఫూర్తికి మేలు చేయగల పరిణామం!

ఇదీ చదవండి :'కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు- జాగ్రత్తగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details