వాస్తవాధీన రేఖ వెంట ఇండియా చైనాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. దీనికి తోడు మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ కల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయి. మిజో-అస్సాం గొడవలు, హింసాత్మక ఘటనలు ఇటీవల కొంచెం సద్దుమణిగాయని భావించేలోపే, మణిపుర్లో ముష్కరులు పంజా విసిరారు.
చురాచాంద్పుర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠి కుటుంబంపై జరిగిన పాశవిక దాడి- ఈశాన్య భారతంలో ఉగ్రవాదం పూర్తిగా తొలగిపోలేదని తేటతెల్లం చేసింది. కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఉగ్రబృందాలు ఒక్కసారిగా పేట్రేగిపోవడం భద్రతా దళాలకు విస్మయం కలిగిస్తోంది. చుట్టుపక్కల దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ముష్కర మూకలు భారత్లో దాడులకు తెగబడుతున్నాయి.
ఏడాదిలోనే పుంజుకొని...
ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మణిపుర్లోనే అత్యధిక ఉగ్ర సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. చిన్న రాష్ట్రమే అయినా అక్కడ మెయ్తెయ్, ఇతర ఆదివాసీ తెగల మధ్య తీవ్ర విభేదాలు నెలకొని ఉన్నాయి. ఆధిపత్య మెయ్తెయ్ తెగలో అత్యధికులు సనమహిజం, హిందూ మతాలను అనుసరిస్తారు. స్వల్ప సంఖ్యలో ముస్లిములు(పంగల్), క్రైస్తవులు ఉన్నారు. మణిపుర్ 1949లో భారత్లో విలీనం కావడాన్ని మెయ్తెయ్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే వేర్పాటువాదానికి బీజం వేసింది. 1964లో సమరేంద్ర సింగ్ నేతృత్వంలో 'ది యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్' (యూఎన్ఎల్ఎఫ్) పురుడు పోసుకుంది. 1972లో మణిపుర్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడటంతో తమ గుర్తింపును కోల్పోతామన్న ఆందోళన మెయ్తెయ్ తెగలో అధికమైంది. మరోవైపు రాష్ట్రంలోని 89శాతం భూభాగానికి కేవలం 20 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 11శాతం పర్వత ప్రాంతాలకు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఇతర తెగల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. ఇటువంటి కారణాలతో మణిపుర్లో ఉగ్రసంస్థలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి.
నాగా, కూకీ తెగలతో పాటు పర్వత ప్రాంతాల్లోని ఆదివాసీ వర్గాల బృందాలూ వాటికి తోడయ్యాయి. దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్ లెక్కల ప్రకారం ప్రభుత్వం ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన ప్రజావిముక్తి సైన్యం(పీఎల్ఏ) వంటివి అక్కడ ఏడు ఉన్నాయి. అవి కాకుండా మరో 13 క్రియాశీల సంస్థలు, పెద్దగా కార్యకలాపాలు నిర్వహించని బృందాలు 12 వరకు కనిపిస్తాయి. కర్నల్ విప్లవ్ త్రిపాఠీపై దాడిలో భాగస్వామి అయిన మణిపుర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ ఈ కోవలోదే. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదుల ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అక్కడి ఉగ్ర సంస్థలతో చర్చలు ప్రారంభించడం సానుకూల ఫలితాలను ఇచ్చింది. గత రెండేళ్లలో మణిపుర్లో ఉగ్రదాడులు, ఎదురుకాల్పుల్లో పదకొండు మంది మరణించారు. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 18కి చేరింది. నిరుడు నవంబర్లో భారత్, మయన్మార్ దళాలు సంయుక్తంగా పీఎల్ఏ, అరాకన్ ఆర్మీ స్థావరాలపై దాడులు జరిపాయి. సంవత్సరంలోనే పీఎల్ఏ పుంజుకొని అస్సాం రైఫిల్స్పై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలు ఊపందుకోవడానికి- చైనా పాత్ర, మయన్మార్లో అస్థిరతలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈశాన్య భారతంలో ఉగ్రవాదాన్ని ఎగదోసిన చరిత్ర చైనాకు ఉంది. నాగా, మిజో వేర్పాటువాదులకు తొలినాళ్లలో చైనాలోని యునాన్ ప్రావిన్స్, లాసాలో శిక్షణ లభించినట్లు అమెరికా సీఐఏ నివేదికలు చెబుతున్నాయి. ఆ తరవాత భారత్లో చిచ్చుపెట్టడానికి మయన్మార్ను చైనా చాలాకాలం వేదిక చేసుకుంది. పేరుమోసిన ఉగ్రవాదులు నలుగురు నిరుడు యునాన్ ప్రావిన్స్లోని కున్మింగ్లో శిక్షణ, ఆశ్రయం పొందినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉల్ఫా-ఐ నేత పరేశ్ బారువా ఇప్పటికీ చైనాలోనే ఉన్నాడు. మరోవైపు మయన్మార్లోని రాజకీయ అస్థిరతను డ్రాగన్ ఉపయోగించుకుంటోంది. ఆ దేశం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందుతున్నాయి.