తెలంగాణ

telangana

'ప్రజల మదిలో మోదీ'- చెక్కుచెదరని 'హిందుత్వ' పవర్! 2024లో బీజేపీని అడ్డుకునే 'శక్తి' ఉందా?

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 6:16 PM IST

Modi Election Strategy 2023 : మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. ఛత్తీస్​గఢ్​లో పాగా వేసి, మధ్యప్రదేశ్​ను నిలబెట్టుకొని, రాజస్థాన్​ను చేజిక్కించుకొని కాంగ్రెస్​కు గట్టి షాకిచ్చింది. రాష్ట్రాల నాయకత్వంతో సమస్యలు ఉన్నా కాషాయజెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది. మరి అసెంబ్లీ ఫలితాల ప్రభావం '2024'పై ఉంటుందా?

Modi Election Strategy 2023
Modi Election Strategy 2023

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ
  • 'ఇండియా' పేరుతో ఏకమైన ప్రత్యర్థులు
  • 'బలమైన రాష్ట్ర నాయకత్వం ఏది?' అనే ప్రశ్నలు

ఇలాంటి సవాళ్ల మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టింది బీజేపీ. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సంచలన విజయం నమోదు చేసింది. బలమైన సంస్థాగత వ్యవస్థ, పదునైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం, మోదీ ప్రజాకర్షణ పెట్టుబడిగా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్​దే అనుకున్న ఛత్తీస్​గఢ్​లో పాగా వేసి విశ్లేషకులే ముక్కున వేలేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్​ను నిలబెట్టుకొని, రాజస్థాన్​ను చేజిక్కించుకొని ప్రత్యర్థులకు పవర్​ఫుల్ సందేశాన్ని పంపింది. గతంలో తగిలిన ఎదురుదెబ్బ ఎంత గట్టిదైనా- ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా- రాష్ట్ర నాయకత్వంతో సమస్యలు ఉన్నా- ఇవేవీ కాషాయజెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది.

బలం ఉన్నచోటే మరింత బలంగా
Modi Election Strategy 2023 :'నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు' అన్నట్టుగా హిందీ హార్ట్​ల్యాండ్​లో బీజేపీ బలమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ను గుప్పిటపట్టి ఆ ప్రాంతాలపై తన మరింత పట్టు బిగించింది కమలదళం. 2024 ఎన్నికలకు తనకు ఎవరు సాటి అని విపక్షాలకు సవాల్ విసిరేలా వన్​సైడ్ విక్టరీ సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో 65 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 61 స్థానాల్లో గెలుపొందింది. లోక్​సభలో 12 శాతం సీట్లు ఇక్కడి నుంచే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి ఫుల్ జోష్ ఇచ్చేదే.

రాష్ట్ర నాయకత్వం పటిష్ఠంగా లేకున్నా!
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. గెలిచిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రాంతీయ నాయకత్వం ఆశించినంత బలంగా ఏమీ లేదు. మధ్యప్రదేశ్​లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నా- ఆయన్ను దూరం పెడుతున్నట్లు బీజేపీ అధిష్ఠానం నుంచే సంకేతాలు వచ్చాయి. రాజస్థాన్​లో వసుంధర రాజెకు చెక్ పెట్టేందుకు ఎంపీ దియా కుమారి సహా కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఛత్తీస్​గఢ్​లో మాజీ సీఎం రమణ్ సింగ్​ను సైతం పక్కనబెట్టింది.

అంతా మోదీ మహిమే!
రాష్ట్ర నాయకత్వం బలహీనంగా కనిపించినా ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీ సైతం ఈ రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. 'ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ' అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి అజెండాను చూసి కాషాయపార్టీకి ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

'మోదీకి మాత్రమే సాధ్యం'
'స్థానిక నేతలతో సంబంధం లేకుండా ఎన్నికలు గెలిచే సత్తా ఉన్న ప్రధాని ఒక్క మోదీ మాత్రమే. వేరే ఎవ్వరికీ ఈ వెసులుబాటు లేదు. అంతేకాకుండా బీజేపీ రెండు అంశాలపై హామీలను పక్కాగా నెరవేర్చింది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసింది.' అని రాజకీయ విశ్లేషకుడు నినాద్ సేఠ్ బీజేపీ విజయసూత్రాన్ని వివరించారు.

ప్రజల మదిలో మోదీ!
"మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్ ఓటర్ల మదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారనే విషయం స్పష్టమైంది. దేశ ప్రజలందరి హృదయాల్లోనూ మోదీ ఉన్నారు. ఈ ఎన్నికలతో ఇది కూడా స్పష్టంగా తెలిసిపోయింది. బీజేపీ చేసిన అభివృద్ధికే ఓట్లు పడ్డాయి. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవానికి ప్రజలు ఓటేశారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని బీజేపీని గెలిపించారు." అని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ తెలిపారు.

చెక్కుచెదరని బీజేపీ 'హిందుత్వ' పవర్!
బీజేపీ హిందుత్వ వ్యూహాన్ని కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ పదునైన అస్త్రాలే ప్రయోగించింది. సామాజిక సాధికారత పేరుతో కులగణనపై విస్తృతంగా ప్రచారం చేసింది. ఓబీసీలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్​లో అయితే ఏకంగా బీజేపీ దారిలో నడిచింది. జాతీయస్థాయి నేతలు ఓవైపు కులగణన అంటున్నా.. కమల్​నాథ్ వంటి నాయకులు మాత్రం సాఫ్ట్ హిందుత్వ వైఖరిని అవలంబించారు. కానీ ఇవేవీ కాంగ్రెస్​కు ఫలితాన్ని ఇవ్వలేదు. హిందుత్వ మద్దతుదారులంతా బీజేపీకే జై కొట్టారు! దీంతో హిందుత్వ రాజకీయాలపై పేటెంట్ తమదేనని బీజేపీ చాటి చెప్పుకున్నట్లైంది!

అసెంబ్లీ ఫలితాల ప్రభావం '2024'పై ఉంటుందా?
నిజానికి, 2019 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సాగాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల విషయానికే వస్తే.. అధికారంలో ఉన్నప్పటికీ లోక్​సభ సీట్లను గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. జాతీయ స్థాయి నాయకత్వాన్ని చూసే ఓటర్లు సార్వత్రిక ఫలితాలను నిర్దేశిస్తున్నారు. మోదీ హవాతో ఈ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లన్నీ బీజేపీనే గెలుచుకుంది. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేయడం బోనస్ కానుంది. మరోవైపు, అధికారంలో ఉన్నప్పుడే సీట్లను గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్​కు మాత్రం 2024 సార్వత్రికంలో సవాల్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details