తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 7:09 AM IST

ETV Bharat / opinion

సాంక్రామిక వ్యాధులు స్వయంకృతం

కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా పుట్టుకొస్తున్న సాంక్రామిక వ్యాధులు ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తున్నాయి. వీటితో మానవాళికి భవిష్యత్తులో మరింత ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపై సాంక్రామిక వ్యాధులు పుట్టుకురావడానికి కారణమవుతున్న వైఫల్యాలను విశ్లేషించుకుని, అటువంటి రోగాలు ఆవిర్భవించకుండా చేపట్టాల్సిన చర్యలను ప్రపంచదేశాలు సమష్టిగా వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Many new infections may trouble mankind
సాంక్రామిక వ్యాధులు స్వయంకృతం

అభివృద్ధి పేరిట మానవాళి సాగిస్తున్న విధ్వంసం ప్రకృతి వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. సున్నితమైన అటవీ, భూగర్భ, తీర వనరుల విధ్వంసంవల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. తుపానులు, వరదలు, సునామీలు, భూకంపాల వంటి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. వీటికి సమాంతరంగా మానవాళి తన అవసరాల కోసం ఆహార ఉత్పత్తులు, వినియోగంలో అనుసరిస్తున్న విధానాలు- వన్యప్రాణులు, పశు సంపదపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో పుట్టుకొస్తున్న అంతుపట్టని కొత్త రకాల సాంక్రామిక వ్యాధుల కారణంగా మానవాళికి భవిష్యత్తులో మరింత ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.

పొంచిఉన్న కొత్త సవాళ్లు

కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా పుట్టుకొస్తున్న సాంక్రామిక వ్యాధులు ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తున్నాయి. భవిష్యత్తులో సాంక్రామిక వ్యాధులు పెచ్చరిల్లడాన్ని నిరోధించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ), అంతర్జాతీయ పశు పరిశోధన సంస్థ (ఐఎల్‌ఆర్‌ఐ) సంయుక్తంగా గత వారం విడుదల చేసిన అధ్యయన నివేదిక అనేక సవాళ్లను ప్రపంచం ముందు ఆవిష్కరించింది. మానవ జనాభాకు సోకుతున్న అంటువ్యాధుల్లో వాటి కారకాలను గుర్తించిన వ్యాధులు 60 శాతమే. వాటిలో 75 శాతం అంటువ్యాధులు పశుపక్ష్యాదులు, వన్యప్రాణుల ద్వారా ప్రజలకు సోకుతున్న సాంక్రామిక వ్యాధులుగా గుర్తించారంటే ఈ తరహా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్ఛు ప్రపంచ దేశాలను వణికిస్తూ మానవ జనాభాపై అధిక నష్ట ప్రభావం చూపిన హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌, ఎబోలా, లైమ్‌ డిసీజ్‌, మలేరియా, రాబిస్‌, వెస్ట్‌ నైలు జ్వరంతో సహా ప్రస్తుత కొవిడ్‌ వరకూ ఇలాంటి సాంక్రామిక వ్యాధులే కావడం గమనార్హం. సాంక్రామిక వ్యాధులు జంతువులవల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్ష సంబంధాల ద్వారా బ్యాక్టీరియా, వైరల్‌ లేదా పరాన్నజీవుల వంటివాటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విస్తృతమైన విజ్ఞానం, సాంకేతిక సదుపాయాలు పెరిగిన నేటి కాలంలో అంటువ్యాధి వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సిన్‌ కనుగొనడం వంటి విషయాల్లో ప్రపంచదేశాల ముందు కొవిడ్‌ ఒక పెద్ద సవాలుగా నిలిచింది. నిరుడు నవంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 6.30 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1.54 కోట్లకు పైగా ప్రజలు వైరస్‌ బారినపడ్డారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమై కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. ప్రపంచ ప్రజల ఆహార, జీవన భద్రత ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో సాంక్రామిక వ్యాధుల వ్యాప్తికిగల ప్రధాన కారణాలు, భవిష్యత్తులో వాటి స్వరూప స్వభావాల వల్ల ఏర్పడే సవాళ్లను ఐరాస తాజా నివేదిక చర్చకు పెట్టింది. ప్రకృతి పరంగా కొనసాగుతున్న విధ్వంసంతో పాటు పశు, వన్యప్రాణుల పట్ల మానవాళి వ్యవహరిస్తున్న తీరు సాంక్రామిక వ్యాధులను చేజేతులా కొనితెచ్చుకోవడానికి కారణమవుతోంది. ప్రకృతి వనరుల విధ్వంసంతో అడవులు క్షీణించడం మూలంగా జంతువులు, వన్యప్రాణులకు ఆహార కొరత ఏర్పడే దుస్థితి నెలకొంది. మానవ అవసరాల కోసం వ్యవసాయం విస్తృతమై ఎరువులు, క్రిమి సంహారకాల వినియోగం మితిమీరింది. ఇది జంతు సంపదపై దుష్ప్రభావం చూపుతోంది. మానవాళి ప్రొటీన్ల కోసం ఆహార వనరుల్లో ముఖ్యంగా జంతు సంపదపై ఆధారపడటం అధికమైంది. దీంతో పశుపక్ష్యాదులు ఆధారంగా లభ్యమయ్యే మాంసం, పాల ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగింది. 1961లో ప్రపంచవ్యాప్తంగా మాంసం ఉత్పత్తి ఏటా రెండు కోట్ల టన్నులు. ఇప్పుడది ఎనిమిది కోట్ల టన్నులకు చేరింది. గిరాకీకి తగ్గట్లుగా అధిక ఉత్పాదకత, వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న జంతు జాతుల పెంపకం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. తక్కువ స్థలంలో ఎక్కువ పశు పక్షు జాతుల పెంపకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. వ్యాధినిరోధక మందుల అతి వినియోగం కారణంగానూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు కొత్త వ్యాధుల నియంత్రణకు ఔషధాలు కనుగొనడం కష్టతరంగా మారుతోంది. ఒకవైపు సాధారణ వ్యవసాయ అవసరాల కోసం, మరోవైపు పామాయిల్‌, సోయా పంటల కోసం అడవులను విపరీతంగా నరికివేస్తున్నారు. సోయా ఉత్పత్తులను అధికంగా పశువులకు ఆహారంగా వాడుతున్నారు.

ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం- విశ్వవ్యాప్తంగా ఏటా కోటి హెక్టార్ల అటవీ వనాలను వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి పనుల కోసం బదలాయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్ఛు వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వన్యప్రాణులను వధించడం, సహజ వనరుల విచ్చలవిడి వినియోగం, ఆహార సరఫరా గొలుసులో చోటుచేసుకున్న విపరీత పరిణామాలు, వలసలు, ప్రయాణాలు పెరిగిపోవడం, ప్రకృతి వనరుల విధ్వంసంతో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు సాంక్రామిక వ్యాధుల విస్తరణకు కారణమవుతున్నాయి. పట్టణీకరణలో సహజవనరుల వినియోగం, భూ వినియోగ విధానంలో మార్పులు, పారిశ్రామికీకరణ వంటి చర్యలు జీవవైవిధ్య వినాశనానికి దారితీస్తున్నాయి. ఈ ధోరణులు వన్యప్రాణులకు, మానవ ఆవాసాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో అంతుపట్టని సాంక్రామిక వ్యాధులు వన్యప్రాణుల ద్వారా సులువుగా మానవ జనాభాలోకి ప్రవేశిస్తున్నాయని ఐరాస హెచ్చరిస్తోంది.

దీటైన కార్యాచరణతో అడ్డుకట్ట

మానవాళి జీవన భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు సాంక్రామిక వ్యాధుల కారణంగా ఎంతటి వినాశకరమైన ప్రమాదం పొంచి ఉందో కరోనా వల్ల తేటతెల్లమైంది. ఇది ప్రపంచ దేశాల్లోని నిరుపేదలు, అభివృద్ధికి దూరంగా ఉన్న తెగల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది. ఇకపై సాంక్రామిక వ్యాధులు పుట్టుకురావడానికి కారణమవుతున్న వైఫల్యాలను విశ్లేషించుకుని, అటువంటి రోగాలు ఆవిర్భవించకుండా చేపట్టాల్సిన చర్యలను ప్రపంచదేశాలు సమష్టిగా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. సాంక్రామిక వ్యాధుల సవాళ్లను ఎదుర్కోవడానికి ఐరాస, ప్రపంచ పశు పరిశోధన సంస్థలు, ప్రపంచ ఆహార సంస్థతో కలిసి ‘ఒకే ఆరోగ్యం’ (ఒన్‌ హెల్త్‌) నినాదంతో సూచించిన వ్యూహాత్మక విధానాన్ని ప్రపంచ దేశాలు తమ అభివృద్ధి ప్రణాళికలకు అన్వయించుకోవాలి. సాంక్రామిక వ్యాధుల పుట్టుక, నష్ట ప్రభావాలపై విస్తృతంగా అవగాహన పెంచే చర్యలను ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యవస్థలు వేగవంతం చేసుకోవాలి. సాంక్రామిక వ్యాధులతో పర్యావరణ వ్యవస్థలకు ఉన్న సంబంధాలు, వాటి సవాళ్లను మానవ సమాజం అధిగమించేందుకు ప్రపంచదేశాలు పరిశోధనలకోసం నిధుల కేటాయింపులను పెంచుకోవాలి. ఆహార ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు తమ వాణిజ్య లావాదేవీలు, పశుపక్ష్యాదుల పెంపకంలో అనుసరించే ప్రక్రియల్లో నైతిక బాధ్యతతో మసలుకోవాలి. ప్రకృతి, జీవవైవిధ్య వ్యవస్థల విధ్వంసాన్ని నియంత్రించే రీతిన ప్రత్యామ్నాయ ఆహార, జీవన భద్రత వనరులను సమకూర్చుకునేందుకు కృషి చేయాలి. పరిపాలన వ్యవస్థలు మానవాళి ఆరోగ్యం, వైద్య అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించుకుని చిత్తశుద్ధితో కార్యాచరణకు ఉపక్రమించాలి. పౌరసమాజమూ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థల కార్యక్రమాల అమలులో భాగస్వాములై భవిష్యత్‌ ప్రమాదాలను ముందస్తుగా అడ్డుకోవడానికి కంకణబద్ధం కావాలి!

(రచయిత- గంజివరపు శ్రీనివాస్​ ,అటవీ పర్యావరణ రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details