ప్రపంచంలో అందరికన్నా ముందే ఇజ్రాయెల్ కొవిడ్ బూస్టర్ టీకాల పంపిణీని ప్రారంభించింది. మొత్తం 92 దేశాలు మూడో మోతాదు (బూస్టర్) టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించింది. ఇంతవరకు అమెరికా, టర్కీ, చిలీలు ఎక్కువ సంఖ్యలో బూస్టర్ డోసులు ఇచ్చాయి. ఇజ్రాయెల్ తన జనాభాలో 44 శాతానికి మూడో మోతాదు టీకాలు అందించి అగ్రగామిగా నిలిచింది. ఇకపై 5-11 ఏళ్ల పిల్లలకూ వ్యాక్సిన్లు వేయడానికి ఆ దేశ నిపుణుల బృందం ఆమోద ముద్ర వేసింది. మరోవైపు పూర్తిగా రెండు మోతాదులు తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా ఉన్న దేశాల్లోనే కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీనికి డెల్టా వేరియంటే ప్రధాన కారణం. రెండు డోసులూ తీసుకున్నవారు ఈ వేసవిలో తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారి తరవాత ఒక్క మోతాదూ తీసుకోనివారూ ఆస్పత్రి పాలయ్యారు.
60శాతంకన్నా ఎక్కువ జనాభాకు రెండు డోసులు వేసిన ఇజ్రాయెల్తోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలలోనూ జులై, ఆగస్టుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దేశాలన్నీ బూస్టర్ డోసులు మొదలుపెట్టాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
ఇప్పటిదాకా భారత జనాభాలో దాదాపు 38.50 కోట్ల మందికే రెండు డోసుల టీకాలు అందాయి. మిగిలిన అందరికీ వాటిని చేరువ చేశాకే బూస్టర్ డోసు గురించి ఆలోచించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద వయసు వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, రెండు మోతాదులు తీసుకున్న ఆరు నెలలకు వారిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాల పరిశోధనల్లో తేలింది. అలాంటి వారికి అక్కడ బూస్టర్ డోసులు ప్రారంభించారు.
కరోనా వైరస్ రూపాంతరం చెందినప్పుడూ బూస్టర్ డోసు అవసరమవుతుందని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల చెబుతున్నారు. ముక్కు ద్వారా టీకాను బూస్టర్ డోసుగా ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశం తన మొత్తం జనాభాకు రెండు డోసుల టీకా రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు అల్పాదాయ దేశాలు కనీసం ఒక్క మోతాదుకూ నోచుకోకుంటే సంపన్న దేశాలు మూడో డోసుకు పరుగులు తీయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుపడుతోంది. అల్పాదాయ దేశాల జనాభాలో కేవలం 4.5శాతానికే ఒక్క మోతాదు టీకా అందగా; సంపన్న, మధ్యాదాయ దేశాలు 60శాతానికిపైగా ప్రజలకు రెండు డోసులూ ఇచ్చి, మూడో విడత ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికాలో 65 ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బూస్టర్ డోసు వేశారు.