తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే- రక్షణ రంగంలో ఆత్మనిర్భరత! - self reliance defence technology

ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులతో భారతావని భద్రత పోనుపోను సంక్లిష్ట భరితమవుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సవాళ్లకు దీటుగా బదులివ్వాలంటే అత్యాధునిక ఆయుధాలతో పరిపుష్టమైన దళాలనే కాదు, స్వయంసమృద్ధమైన దేశీయ రక్షణ పరిశ్రమనూ తీర్చిదిద్దుకోవాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు.

india self reliance in defence technology
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత

By

Published : Aug 24, 2021, 8:16 AM IST

రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధించలేమా?- నాలుగేళ్ల క్రితం ప్రధాని మోదీ సంధించిన ప్రశ్న ఇది. ఆ స్వప్నం సాకారమయ్యే శుభదినం కోసమే దేశం ఏడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది! ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులతో భారతావని భద్రత పోనుపోను సంక్లిష్ట భరితమవుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవల ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సవాళ్లకు దీటుగా బదులివ్వాలంటే అత్యాధునిక ఆయుధాలతో పరిపుష్టమైన దళాలనే కాదు, స్వయంసమృద్ధమైన దేశీయ రక్షణ పరిశ్రమనూ తీర్చిదిద్దుకోవాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. తాలిబన్ల పరమైన అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా భారత్‌పై చైనా, పాకిస్థాన్‌ పన్నాగాలు ముమ్మరిస్తున్న తరుణంలో అమాత్యుల ఆకాంక్ష- అవశ్యం ఆచరణ రూపం దాల్చాల్సిందే! ఆయుధాలు, సైనిక సామగ్రి కొనుగోళ్ల కోసం గడచిన పదిహేనేళ్లలో ఇండియా అయిదు లక్షల 90 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. అందులో నాలుగో వంతు నిధులను ఒక్క అమెరికాకే ధారపోసింది.

24వ స్థానంతో

భారత్‌కు ఎగుమతుల ద్వారా రష్యా, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ సైతం భారీగా ఆర్జిస్తున్నాయి. ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకొనే ద్వితీయ దేశంగా కొనసాగుతున్న ఇండియా- ఎగుమతుల్లో మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకుంటోంది! 2011-15తో పోలిస్తే 2016-20 మధ్య భారత ఆయుధ దిగుమతులు 33 శాతం మేరకు దిగివచ్చినా సైనిక అవసరాల కోసం నేటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. డెబ్భై వేల ఏకే-203 అసాల్ట్‌ రైఫిళ్ల కోసం రష్యాతో కుదుర్చుకొన్న ఒప్పందమే దీనికి తాజా ఉదాహరణ! బలగాల ఆధునికీకరణ కోసం రాబోయే దశాబ్ద కాలంలో ఇండియా 16 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు అంచనా. 209 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించిన కేంద్రం- భవిష్యత్తులో అధికశాతం ఆర్డర్లను స్వదేశీ సంస్థలకే ఇవ్వాలని తలపోస్తోంది. పరిశోధన, అభివృద్ధిపై దృష్టిసారిస్తూ; మేలిమి ఆయుధాలు, ఉపకరణాలను రూపొందించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తేనే- రక్షణ రంగంలో ఆత్మనిర్భరత ఆవిష్కృతమవుతుంది.

జీడీపీలో 1.63శాతానికి..

తమ అమ్ములపొదిలోని ఆయుధాల్లో 68శాతం కాలం చెల్లినవేనని సైన్యం లోగడే కుండ బద్దలుకొట్టింది. దేశీయంగా తయారైన ఇన్సాస్‌ రైఫిళ్లలోని నాణ్యతా లోపాలు- అత్యవసర సందర్భాల్లో సైనికుల చేతులు కట్టేస్తున్న దుస్థితి ఏనాడో బట్టబయలైంది. నిధుల కటకటతో త్రివిధ దళాల నవీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సరిహద్దుల్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణకు జీడీపీలో మూడు శాతాన్ని ప్రత్యేకించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్భిన్నంగా రక్షణ రంగానికి కేటాయింపులు ఏటేటా కోసుకుపోతున్నాయి. ఈ సంవత్సరంలో అవి జీడీపీలో 1.63శాతానికి పరిమితమయ్యాయి. జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు పోను వాటిలోంచి బలగాల ఆధునికీకరణ, ఆయుధ సంపత్తి సమీకరణలకు ముప్పై శాతం లోపు నిధులే మిగులుతున్నాయి. రక్షణ శాఖామాత్యులు ఆకాంక్షించినట్లు భారత బలగాలు శక్తిమంతం కావాలంటే- కేటాయింపులు జోరందుకోవాలి.

వెన్నుదన్నుగా..

స్వావలంబన సాధ్యపడాలంటే- ఉత్పాదనల్లో క్రియాశీల పాత్ర పోషించగలిగిన ప్రైవేటు సంస్థలకు ఇతోధికంగా చేయూతనందించాలి. నవ్యావిష్కరణల దిశగా అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, ఔత్సాహికులను ప్రోత్సహించడానికి రూ.499 కోట్లు కేటాయించినట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. పరిశోధనలపై ఎంతగా వెచ్చిస్తే అంత వినూత్న ఉత్పత్తులతో దేశీయ పరిశ్రమ వెలుగులీనుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలోనే వైజ్ఞానిక శోధనలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న విదేశాలు అత్యుత్తమ ఫలితాలను ఒడిసిపడుతున్నాయి. ఇండియాలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి.

దేశీయంగా తయారీని ద్విగుణీకృతం చేస్తూనే ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొంటూ భారతావని పురోగమించాలి. అలాగైతేనే రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి సరైన బాటలు పడతాయి!

ABOUT THE AUTHOR

...view details