తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2021, 8:52 AM IST

ETV Bharat / opinion

న్యాయాధీశులతోనే.. న్యాయంగా హేతుబద్ధీకరణ!

సుప్రీంకోర్టు సహా హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టుల్లో అయిదువేల మంది వరకు జడ్జీల కొరత పీడిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తాజా చొరవతో తెలంగాణ హైకోర్టును పతాక శీర్షికల్లో నిలబెట్టింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో 24కు పరిమితమైన జడ్జీల సంఖ్య 42కు పెరగనుండటం విశేష పరిణామం. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న మిగతా కోర్టుల్లోనూ న్యాయాధీశుల కొలువుల్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే పెండింగ్​ కేసుల్లో న్యాయప్రధాన ప్రక్రియ అంతగా తేటపడుతుంది.

judges in court
జడ్జీల కొరత

న్యాయస్థానాల్లో సత్వర న్యాయం ఎండమావిగా మారిన దుస్థితి అసంఖ్యాక కక్షిదారుల్ని, ఆలోచనాపరుల్ని ఎన్నాళ్లుగానో కలచివేస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తాజా చొరవ, తెలంగాణ హైకోర్టును పతాక శీర్షికల్లో నిలబెట్టింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో 24కు పరిమితమైన జడ్జీల సంఖ్యను సహేతుక స్థాయికి పెంపొందించాలన్నది చిరకాల డిమాండు. ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా 42కు పెరగనుండటం విశేష పరిణామం. ఈ హైకోర్టు పరిధిలో రమారమి రెండున్నర లక్షలకు ఎగబాకిన సివిల్‌, క్రిమినల్‌ పెండింగ్‌ కేసులను పరిష్కరించే క్రమంలో ఇది ఎన్నదగ్గ ఘట్టం!

దిగువస్థాయి కోర్టుల్లోనూ..

వాస్తవానికి దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1080 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైనా, మే నెల ఒకటో తేదీ నాటికి విధులు నిర్వర్తిస్తున్నవారు 660మందే. ఇంతకుముందు తెలంగాణకు మంజూరైన 24 జడ్జీ పోస్టుల్లో పది ఖాళీగా ఉన్నాయి. సరికొత్తగా 42కు పెంచిన న్యాయాధీశుల కొలువుల్ని ఎంత త్వరగా భర్తీ చేస్తే రాష్ట్రంలో న్యాయప్రదాన ప్రక్రియ అంతగా తేటపడుతుంది. ఒక్క సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టుల్లోనే కాదు- దిగువ స్థాయి కోర్టుల్లోనూ అయిదువేల మంది వరకు జడ్జీల కొరత పీడిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, మంజూరైన న్యాయాధీశ పదవుల్లో మూడోవంతుకు పైగా భర్తీకాని 12 హైకోర్టుల జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.

అక్కడ మరింత దీనావస్థ..

ఏపీ హైకోర్టు(46శాతం ఖాళీలు)ను మించిన దీనావస్థ- పట్నా, రాజస్థాన్‌, కలకత్తా, గుజరాత్‌, దిల్లీలది. పట్నాలో 56శాతానికి పైగా ఖాళీలు భర్తీ కావాల్సి ఉండగా, గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ దేశంలోని ఏ హైకోర్టులోనూ పూర్తిస్థాయి నియామకాలన్నవి ఎరుగమన్న జస్టిస్‌ మదన్‌ లోకుర్‌ విశ్లేషణ- ఏ స్థాయిలో మరమ్మతు ఆవశ్యకమో సూచిస్తోంది. చీఫ్‌ జస్టిస్‌గా బాబ్డే హయాములో ఒక్క న్యాయమూర్తి నియామకమైనా జరగలేదు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుతో ఆరంభమైన హేతుబద్ధీకరణ తక్కినవాటికీ విస్తరిస్తేనే- దేశీయంగా అపరిష్కృత వ్యాజ్యాల పరిష్కరణ ప్రక్రియ ఊపందుకోగల వీలుంటుంది!

పెండింగ్‌ కేసులు కొండ..

కోర్టులను ఆశ్రయిస్తే వ్యాజ్యాలు ఒక కొలిక్కి రావడానికి తరాల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని కక్షిదారులు ఆక్రందించే దురవస్థ దేశంపై దట్టమైన మేఘంలా ఆవరించింది. నేషనల్‌ జుడీషియల్‌ డేటా గ్రిడ్‌ క్రోడీకరించిన సమాచారం ప్రకారం, దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో 57.5 లక్షల దాకా పెండింగ్‌ కేసులు కొండల్లా పేరుకుపోయాయి. జిల్లా కోర్టుల్లో పోగుపడినవి మూడు కోట్ల 81 లక్షలకు పైమాటే. ఆ రెండంచెల్లో 10-20 ఏళ్లుగా మోక్షానికి నోచని వ్యాజ్యాలు 37 లక్షలకు మించిపోయాయి. 20-30 సంవత్సరాలుగా పెండింగ్‌లో కూరుకుపోయినవి సుమారు ఆరున్నర లక్షలు. లక్షా 95వేలకుపైగా కేసులు మూడు దశాబ్దాలకు మించి అపరిష్కృతంగా పడి ఉన్నాయి.

మౌలిక వసతులపైనా దృష్టిపెట్టాలి..

అత్యవసర ప్రాతిపదికన ఖాళీల భర్తీతోనే పెండింగ్‌ కేసుల కొండలు కరిగిపోతాయనుకునే వీల్లేదు. న్యాయమూర్తుల సంఖ్యలో పెంపుదలతోపాటు కోర్టు గదుల్లో మౌలిక సదుపాయాలు, జడ్జీల వసతి ఏర్పాట్లపైనా దృష్టిపెట్టాలి. సీజేఐ రమణ మానసపుత్రిక 'నేషనల్‌ జుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌' క్రియాశీలకమై చురుగ్గా వేళ్లూనుకోవాల్సి ఉంది. వాయిదాలపై వాయిదాలు మంజూరు చేసే ధోరణులు, కాలం చెల్లిన విచారణ పద్ధతులు, అంచెలవారీగా రికార్డుల కంప్యూటరీకరణలో విపరీత జాప్యం, ఎగువ కోర్టులూ దిగువ న్యాయస్థానాల మధ్య డిజిటల్‌ అగాధం.. తదితర అంశాల్నీ ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదు. కేసులో జాప్య నివారణకు పోలీసులు, సాక్షులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు సహా సంబంధీకులందర్నీ జవాబుదారీ చేస్తేనే- వ్యాజ్యాల పరిష్కరణ వేగం పుంజుకొంటుంది!

ఇదీ చూడండి:'హైకోర్టు న్యాయమూర్తులుగా వారిని పరిగణించండి'

ఇదీ చూడండి:'లీగల్‌ క్లినిక్‌'లతో న్యాయసేవలకు నవ్యపథం

ABOUT THE AUTHOR

...view details