తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2021, 7:06 AM IST

ETV Bharat / opinion

సురక్షిత ఆహారం వృద్ధికి ఊతం!

2020-21కి సంబంధించి సురక్షిత ఆహార పరామితుల ఆధారంగా రూపొందించిన సూచీపై రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాంకుల్లో గుజరాత్‌, కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో నిలిచాయి. మానవ వనరులు, సంస్థాగతమైన గణాంకాలు, పరీక్షల సౌకర్యాలు, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

healthy food
సురక్షిత ఆహారం

ఏ దేశానికైనా సురక్షిత ఆహారం- ముఖ్యమైన సామాజిక, ఆరోగ్య ప్రాధాన్యాంశం. ఆర్థిక వృద్ధికి ఆరోగ్యంతోపాటు, సురక్షితాహారం కీలకం. సురక్షిత ఆహార సాధనకు కల్తీ మహమ్మారి పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే పోషకాహార లోపంతో సతమతమవుతున్న దేశానికి కల్తీ కూడా తోడైతే మరింత నష్టం తప్పదు. 2020-21కి సంబంధించి సురక్షిత ఆహార పరామితుల ఆధారంగా రూపొందించిన సూచీపై రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాంకుల్లో గుజరాత్‌, కేరళ, తమిళనాడు అగ్రస్థానంలో నిలిచాయి. మానవ వనరులు, సంస్థాగతమైన గణాంకాలు, పరీక్షల సౌకర్యాలు, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత వంటి అంశాల ఆధారంగా రూపొందించిన సూచీపై ర్యాంకులు కేటాయించారు. ఇది 'భారత సురక్షిత ఆహార, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)' ఆహార పరిరక్షణపై రూపొందించిన మూడో సూచీ. ఈ సూచీలో పెద్ద రాష్ట్రాల్లో ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌ సుస్థిర వృద్ధిని కనబరచాయి. బిహార్‌ అన్నింటికన్నా చివరి స్థానంలో నిలిచింది.

సౌకర్యాల కల్పనలో వెనకంజ

నిర్దేశిత ప్రమాణాల్ని సాధించేందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరులు తదితర సౌకర్యాల కల్పనలో వెనకబాటు పలు రాష్ట్రాలకు సమస్యగా మారింది. సురక్షిత ఆహార సూచీలో చివరిస్థానంలో ఉన్న బిహార్‌ విషయాన్నే తీసుకుంటే, ఆ రాష్ట్రంలో ఆహార భద్రత సంస్థలో తీవ్రమైన మానవ వనరుల కొరత వేధిస్తోంది. బిహార్‌లో కేవలం 14 మంది ఆహార భద్రత అధికారులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరికి ఆహార నాణ్యత తనిఖీల కోసం కనీసం రెండు జిల్లాలు కేటాయించారు. కొంతమంది ఒకేసారి నాలుగు జిల్లాలకుపైగా బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలాంటి కారణాలన్నీ సూచీలో వెనకంజకు దారితీసింది. ఆహార భద్రత సూచీపై పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పది, ఏపీ 19వ స్థానంలో నిలిచాయి. నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఆహార పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారిని నియమించాల్సి ఉండగా, తెలంగాణకు సంబంధించి ఏడేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శే ఆ పోస్టులో ఉన్నారు. జిల్లాకొక ఆహార పరిరక్షణాధికారి ఉండాలనే నిబంధన ఉన్నా, అమలు జరగడం లేదు. 32 జిల్లాల్లో 51 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులకు 37 ఖాళీలు ఉన్నాయి. మానవ వనరుల కొరత కారణంగా ఆహార నమూనాల సేకరణ, పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించే ప్రక్రియ కూడా తూతూమంత్రంగా సాగుతోంది.

ప్రమాణాల పరిరక్షణకు ప్రతి రాష్ట్రానికీ ఆహార పరిరక్షణ కమిషనర్‌ ఉండాలి. ఆహార పరిరక్షణ అధికారులు, నమూనాల విశ్లేషకులు, వ్యాపార అనుమతుల మంజూరు తదితర విధులు నిర్వహించేందుకు జిల్లాకొక సంబంధిత అధికారి అవసరం. ఆహార పరీక్షలు, విశ్లేషణకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదిత ప్రయోగశాలలు ఏర్పాటుచేయాలి. ఇలాంటి వ్యవస్థ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పని చేసినప్పుడే ప్రజలకు సురక్షిత ఆహారం అందుతుంది. చట్టపరంగా విధివిధానాల కట్టుబాట్లు పకడ్బందీగానే ఉన్నా ప్రమాణాలు, నిబంధనలను సమర్థంగా అమలు చేయడంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. చైనా, అమెరికాలతో పోలిస్తే- ప్రతి పది లక్షల మందికి ఉండాల్సిన ప్రయోగశాలలు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ప్రయోగశాలల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచుకోవడం తక్షణావసరం. చాలా రాష్ట్రాల్లో ఆహార, ఔషధ నియంత్రణ సంస్థల పనితీరు నాసిరకంగా ఉంటోంది. పలుచోట్ల ఆహార విశ్లేషకుల కొరతతో ప్రయోగశాలలు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రయోగశాలల ఏర్పాటు, సౌకర్యాల కల్పన, ఆధునికీకరణ వంటి చర్యలపై సమన్వయంతో కృషి చేయాలి.

ప్రమాణాల సాధనలో కృషి

నాసిరకం ఆహారం అందించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో చేయాల్సింది మరెంతో ఉందంటూ ఇటీవల సూచీ విడుదల సందర్భంగా పేర్కొన్న కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ- 19 సంచార ఆహార పరీక్ష వాహనాలనూ ప్రారంభించారు. దీంతో వీటిసంఖ్య 109కి చేరింది. వీటితో మారుమూల ప్రాంతాల్లో సైతం ఆహార కల్తీపై నిఘా కార్యకలాపాలు పెరగడంతోపాటు, పరీక్షల సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి అంశాల్లో పౌరులకు సరైన శిక్షణ, అవగాహన కల్పించినప్పుడే అవి ఉపయోగపడతాయి. ఆహార నాణ్యత ప్రమాణాల సాధనలో ప్రభుత్వ కృషితోపాటు పరిశ్రమ, వినియోగదారుల పాత్ర కూడా కీలకమే. నాసిరకం ఆహార పదార్థాలపై వినియోగదారులూ అప్రమత్తంగా ఉండాలి. అవగాహన పెంపొందించుకోవాలి. చిన్నారులు, యువతలో జంక్‌ఫుడ్‌ వినియోగాన్ని తగ్గించాలి. పోషకాలతో కూడిన సమృద్ధ ఆహారాన్ని ప్రోత్సహించడం ద్వారా పోషక లోపాన్ని నివారించవచ్చు. ప్యాకేజీ ఆహారం తీసుకోవడం ద్వారా యువత, చిన్నారుల్లో అధిక బరువు, ఊబకాయం పెరగడం వంటి సమస్యలకూ పరిష్కారాలు వెదకాలి. ఆహార శుద్ధి పరిశ్రమలో సురక్షిత ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు చేపడితే వ్యవసాయ రంగానికీ ఇతోధికంగా తోడ్పడే అవకాశం ఉంటుంది.

- శ్రీనివాస్‌ దరెగోని

ABOUT THE AUTHOR

...view details