తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేర నిబంధనలకు చెల్లు- చట్టాల్లో భారీ సంస్కరణలు!

పలు చట్టాల్లో నేరంగా పరిగణించే నిబంధనలను తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. అనేక ఇతర మార్పుల మాదిరిగానే కొవిడ్‌ను కూడా ఇందుకు ఒక కారణంగా చెబుతోంది. ఇందుకోసం ఇప్పటికే సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరింది. అసలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి?

By

Published : Jun 23, 2020, 9:43 AM IST

Govt mulling to make changes in regulations of criminal laws
నేర నిబంధనల్లో భారీ మార్పులకు కేంద్రం యోచన!

కొన్ని చట్టాల్లో క్రిమినల్‌ నేరంగా పరిగణించే నిబంధనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 19చట్టాల్లో మార్పులు చేపట్టాలనే ప్రతిపాదనలపై ఇటీవలే ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరింది. సాధారణంగా నేరాలు రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌, బీమా, సఫ్రేసి, పింఛన్లు, చెల్లింపులు, నాబార్డ్‌, జాతీయ హౌసింగ్‌ బోర్డు, చెక్కు బౌన్సు కేసులు, చిట్‌ఫండ్స్‌, పిరమిడ్‌ స్కీములు, అక్రమంగా డిపాజిట్ల సేకరణ తదితర కార్యకలాపాలకు సంబంధించిన చట్టాల్లోని క్రిమినల్‌ నిబంధనలు తొలగింపు ప్రతిపాదనల్లో ఉన్నాయి. అనేక ఇతర మార్పుల మాదిరిగానే కొవిడ్‌ను కూడా ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇలాంటి క్రిమినల్‌ నిబంధనలు న్యాయస్థానాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయని, పెట్టుబడులను దెబ్బ తీస్తున్నాయని, ఫలితంగా సులభతర వాణిజ్య ప్రక్రియపై ప్రభావం పడుతోందనేవి ప్రభుత్వం చెబుతున్న కారణాలు. అయితే, ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను మరింతగా ఇబ్బందులపాలు చేస్తాయి.

పెట్టుబడిదారుల్లో ఆందోళన

భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సమస్య- ఒప్పందాలను గౌరవించకపోవడం. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వాలు సైతం తాము సంతకాలు చేసిన ఒప్పందాలపై మళ్లీ వెనుకంజ వేస్తుండటమూ సమస్యగా మారింది. ఒప్పందాలకు కట్టుబడి ఉండకున్నా, ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్నా పెట్టుబడిదారులు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. సుమారు 19 చట్టాల్లో ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌, పింఛన్లు, సఫ్రేసి, చెక్కు బౌన్స్‌, పిరమిడ్‌ పథకాలు, అక్రమంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చోటుచేసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. కొన్ని క్రిమినల్‌ నిబంధనలను చాలా ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నకొద్దీ చెడు ప్రవర్తనల్ని నియంత్రించడం అసాధ్యంగా మారే అవకాశం ఉండటం, వాటిని అరికట్టేందుకు కొద్దిపాటి నిబంధనలే ఉండటం వంటి కారణాలతో వీటిని ప్రవేశపెట్టారు. విచ్చలవిడి మోసాలు, నిబంధనల ఉల్లంఘనలు పెట్టుబడిదారులను నిరాశపరుస్తాయి. డిపాజిటర్లు, చిన్నస్థాయి పెట్టుబడిదారులపై ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెక్కులు సహా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు సంబంధించిన క్రిమినల్‌ నిబంధనల్ని తొలుత 1989లో ప్రవేశపెట్టారు. 1991లో ఆర్థిక సరళీకరణతోపాటే భారీస్థాయిలో మోసాలు పెరిగాయి. ఫలితంగా ఆర్థిక, ఇతర అక్రమ డిపాజిట్ల సేకరణ పథకాలు పుట్టగొడుగుల్లా పెరిగాయి.

అందరూ విస్మరించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కట్టుదిట్టమైన నిబంధనలు ఉండటం, వాటికి న్యాయపరమైన తోడ్పాటు బలంగా ఉండటం, బలమైన విశ్వాసాన్ని పాదుకొల్పడం వల్లే భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం ప్రారంభమైంది. ముఖ్యంగా చెక్కులు చెల్లకపోతే నిర్దిష్టమైన శిక్షలు ఉండటం వంటివి బాగా ప్రభావం చూపాయి. వస్తువులు, సేవల కొనుగోలు, అమ్మకాలే వాణిజ్య కార్యకలాపాల ప్రాథమిక లక్షణం. వాటి అమ్మకాలు ఎక్కువగా చెక్కులపైనే ఆధారపడతాయి. చెక్కుల చెల్లుబాటుపైనే అనుమానాలు తలెత్తితే, వ్యాపారాలన్నీ ఇతరత్రా మార్గాలపై ఆధారపడాల్సిందే.

వ్యవస్థపై ప్రతికూల ప్రభావం

గత దశాబ్ద కాలంలో అన్ని రకాల కేసులూ పెరిగాయి. 2008లో న్యాయకమిషన్‌ నివేదిక ప్రకారం... దేశవ్యాప్తంగా 1.8 కోట్ల అపరిష్కృత కేసుల్లో 38 లక్షలు చెక్కుబౌన్సులకు సంబంధించినవే ఉన్నట్లు తేలింది. 2011 ఏప్రిల్‌లో నెలకు సుమారు 1.2 కోట్ల చెక్కులను బ్యాంకులు క్లియర్‌ చేయగా, 2020 మే నెలకు ఆ సంఖ్య 7.1 కోట్లకు పెరిగింది. నేరాలకు క్రిమినల్‌ కేసులు లేకుండా చేయడం వల్ల ఆర్థిక సరఫరా గొలుసు వ్యవస్థలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, తదితర సంస్థలకు ఇబ్బందులు పెరిగే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా, వ్యవస్థ పనితీరుపైనే ప్రభావం పడుతుంది. జైలుశిక్ష పడుతుందనే భయం లేకపోతే, రుణదాతలకు అప్పులు చెల్లించేందుకు ఎవరైనా ముందుకు వస్తారా, ఆర్‌బీఐ వంటి సంస్థల నియమాలకు కట్టుబడతారా వంటి ప్రశ్నలూ తలెత్తుతాయి. అంతేకాదు, 1990ల్లో జరిగిన రౌడీపంచాయితీల తరహాలో ఆర్థిక సివిల్‌ వివాదాల్ని పరిష్కరించేందుకు నేరముఠాలు మళ్లీ రంగంలోకి దిగే అవకాశం సైతం లేకపోలేదు. ఒప్పందాలకు ప్రస్తుతమున్న రక్షణ వ్యవస్థల్ని తొలగించడానికి బదులుగా వాటిని మరింత పటిష్ఠ పరిచేందుకు... ఆర్థిక నేరాల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడం, వాణిజ్య తదితర కోర్టులకు మౌలిక సదుపాయాలు పెంచడం వంటి అదనపు చర్యలు తీసుకునే అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రస్తుతమున్న విధానాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలైనా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.

- డాక్టర్‌ ఎస్‌.అనంత్‌

ABOUT THE AUTHOR

...view details