దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ప్రైవేటు పాఠశాలల్లో 12 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు బడులపై తల్లిదండ్రుల ఆసక్తి- ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన యువతకు ఉపాధి మార్గమవుతోంది. నిజానికి ఉద్యోగ భద్రత ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని చాలామంది శిక్షణ దశలోని టీచర్లు కోరుకుంటారు. కానీ, పోటీలో అవకాశం రాని వారు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. అయితే, కరోనా సృష్టించిన సంక్షోభంతో ఏడాదిగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. నిరుడు సెప్టెంబర్ అనంతరం కరోనా కొంత తగ్గుముఖం పట్టడం వల్ల ప్రత్యక్ష బోధన ప్రారంభించినప్పటికీ, ఇటీవల రెండో దశ విజృంభణతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. యాజమాన్యాలు కొంతమంది ఉపాధ్యాయులతోనే అన్ని తరగతులకు ఆన్లైన్లో బోధన చేయిస్తుండటం వల్ల మిగిలిన వారి ఉపాధికి గండి పడింది.
తీవ్రమైన పనిఒత్తిడి, అధిక పని గంటలు, అరకొర సెలవులు, వేతనాల్లో కోతలు, కచ్చితంగా ఇంతమంది పిల్లలను చేర్పించాలన్న లక్ష్యాలతో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ ఏమి తేడా వచ్చినా యాజమాన్యాలు వీరిని అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటినుంచి ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి వ్యవస్థాపరమైన రక్షణ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేసే రుసుముల్లో 50శాతం ఉపాధ్యాయుల జీతాలకు, 30శాతం పాఠశాల నిర్వహణ- అభివృద్ధికి, 15శాతం ఉపాధ్యాయుల పదవీ విరమణ ప్రయోజనాలకు వినియోగించాలి. అయిదు శాతం యాజమాన్య లాభంగా పరిగణించాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడంలేదు.
జీతాలు లేక ఇక్కట్లు
గోరుచుట్టుపై రోకలిపోటు మాదిరిగా ఇప్పుడు అసలు వేతనాలే లేకపోవడం వల్ల ప్రైవేటు ఉపాధ్యాయులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కుటుంబ పోషణ కోసం హమాలీలు, కూరగాయల వ్యాపారులు, తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, పెయింటర్లు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ నుంచి వ్యవసాయ కూలీపనుల వరకు అన్నింటికీ వెళ్తున్నారు. అప్పుల భారం అధికమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుర్ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు, ఇటీవల హైదరాబాద్లోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల స్థితిగతులపై స్వచ్ఛంద సంస్థ 'భారత్ దేఖో' ఒక అధ్యయనం చేసింది. నిరుటి లాక్డౌన్తో 85.7శాతం ఉపాధ్యాయులు ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారని నివేదించింది. యాభై శాతం ఉపాధ్యాయులు రుణాల మీద బతుకుబండిని నెట్టుకొస్తున్నారని గుర్తించింది. 64.3శాతం ఉపాధ్యాయులు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వీరిలో 90శాతం అద్దెలు చెల్లించలేకపోతున్నారు. 81శాతానికి ఆరోగ్య బీమా లేదు. బాధిత ఉపాధ్యాయుల్లోని మహిళలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్న విషయమూ వెలుగుచూసింది. ప్రైవేటు కళాశాలల సిబ్బంది సైతం ఇలాంటి దుస్థితిలోనే ఉన్నారు.