కొన్నేళ్లుగా దేశరాజధానిలో వాయు నాణ్యత తగ్గిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే మారుతోంది. గాలి నాణ్యత దెబ్బతినడానికి అనేక కారణాలున్నా- వాహన కాలుష్యం అన్నది సమస్య తీవ్రతను ఇనుమడింపజేస్తున్న అతిపెద్ద సమస్య. భారత్తోపాటు ప్రపంచమంతా ఇప్పుడు ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలా అని మధనపడుతోంది. రకరకాల ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలూ కాలుష్య ఉద్గారాలు వెదజల్లే వాహనాలను నిర్దిష్ట కాలపరిమితికి ముందే నిషేధించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఉదాహరణకు 2030లోగా పెట్రోలు, డీజిలు వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న లక్ష్యంతో జపాన్ ఇటీవల పర్యావణ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
విస్తరణకు అవకాశాలెన్నో...
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆటొమొబైల్ మార్కెట్గా భారత్ సహేతుక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెట్రో ఆధారిత వాహనాలను తగ్గించి విద్యుత్తు వాహనాల (ఈవీ) వైపు మరలాల్సిన ఆవశ్యకత భారత్కు చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం పెట్టుబడిదారులకు అన్ని రకాల దన్నుగా నిలవడం కారణంగా పాటు- వారికి భారీ రాయితీలు ప్రకటించాలి. ప్రస్తుతం దేశంలో ఈవీ రంగంలో చొరవగా పెట్టుబడులు పెట్టేందుకు 170కిపైగా క్రియాశీల పెట్టుబడిదారులు ఉన్నారు. భారత్లోని విద్యుత్తు ద్విచక్ర వాహన విపణిలోకి పాతిక నుంచి 35శాతం మేర పెట్టుబడులు రావచ్చని కేపీఎంజీ, సీఐఐ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే దేశంలో ఈవీ వాటా చాలా తక్కువగా ఉంది. నీతిఆయోగ్పై ఆధారపడి సమాచారాన్ని సేకరించే డాటా ల్యాబ్స్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా ఈవీ ప్రయాణికుల వాటా 0.5శాతం మాత్రమే. ఈ వాటా 2030నాటికి 5.8శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ రంగంలో విస్తరణ అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోని పది రాష్ట్రాలు చురుగ్గా స్పందిస్తున్నాయి. ప్రాణాంతక వాయు కాలుష్యానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా ఈవీ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ సానుకూలంగా ఉన్నాయి. అయితే ప్రజా రవాణా, ఉద్యోగ కల్పన, లక్ష్య నిర్దేశాలు, రాయితీలు వంటి వాటికి సంబంధించి వాటి వైఖరి భిన్నంగా ఉంటోంది. ఈవీలపై ఉత్సాహం మిన్నంటుతున్న మాట నిజమే అయినా- వాహన రంగంలో సాకారం కావాల్సిన విప్లవాత్మక పరివర్తనకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సంబంధించి సరైన అవగాహన అవసరం. భారతీయ సమాజం సంక్లిష్టతలు, అవసరాల దృష్ట్యా ఈవీల ఆగమనానికి సంబంధించిన అనేక అంశాలపై లోతైన చర్చ తప్పనిసరి.
తగ్గనున్న ఖర్చులు...
వాహన రంగంలో ఈవీల ఆగమనం తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులకు భారత్ సన్నద్ధం కావాల్సి ఉంది. పెట్రోలు, డీజిల్ ఆధారంగా నడిచే వాహనానికి రెండు వేల విడిభాగాలు ఉంటాయి. విద్యుత్తు వాహనాలకు కేవలం 20 విడిభాగాలే ఉంటాయి. వాహన నిర్మాణంలోని ఈ మౌలిక తేడా విడిభాగాల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం కనబరుస్తుంది. ఫలితంగా దేశంలోని లక్షలమంది మెకానిక్కుల బతుకు తెరువు ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే వీరిని కొత్త సవాళ్లకు, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. విద్యుత్తు వాహనాలను మరమ్మతు చేయడానికి అవసరమైన శిక్షణను వారికి అందించాలి. ఈవీల్లో బ్యాటరీ సాంకేతికత చాలా ఖరీదైనది. నిజానికి పదేళ్ల కిందటే జపాన్ ఈవీ రంగంలో తనదైన ముద్ర చూపింది. అయినా, ఆ వాహనాలు ఆశించిన స్థాయిలో ప్రాచుర్యం పొందకపోవడానికి కారణం- బ్యాటరీ వ్యయం మరీ ఎక్కువగా ఉండటమే! ఫలితంగా, ఈవీల తయారీ లాభదాయకం కాదన్న భావన స్థిరపడిపోయింది. లిథియం అయాన్ బ్యాటరీ (ఎల్ఐబీ)లతో ఈవీలు పనిచేస్తాయి. ద్విచక్ర వాహనాల ధరలో కేవలం బ్యాటరీ ఖరీదే 70శాతం కాగా, నాలుగు చక్రాల వాహనాల్లో దాని ఖరీదు 50శాతం. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి వాటి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ బ్యాటరీలను తయారు చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభతర పరిష్కారమని కొందరు భావించవచ్చు. దిగుమతులపై ఆధారపడితే మరో పెద్ద సమస్య తలెత్తుతుంది.