తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2021, 8:32 AM IST

ETV Bharat / opinion

అంతరించిపోతున్న పాముల జాతులు!

భూమిపై ఏ జాతి ఉనికి కోల్పోయినా మానవ మనుగడకు భంగం కలుగుతుంది. అలాగే రైతు నేస్తంగా పిలిచే.. పర్యావరణానికి ఎంతో మేలుచేసే పాముల జాతులు శరవేగంగా అంతరించిపోతున్నాయి. ఈ జాతులు క్షీణిస్తే ఎదురయ్యే అనర్థాలు పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. మరోవైపు పాముల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఇవి రెండూ మానవ మనుగడకు ముప్పు తెచ్చేవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

endangered snake species
అంతరించిపోతున్న పాముల జాతులు

జీవచట్రంలో పర్యావరణానికి ఎంతో మేలుచేసే పాముల జాతులు శరవేగంగా అంతరించిపోతున్నాయి. ఈ జాతులు క్షీణిస్తే ఎదురయ్యే అనర్థాలు పర్యావరణవేత్తలను కలవరపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. మరోవైపు పాముల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఇవి రెండూ మానవ మనుగడకు ముప్పు తెచ్చేవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. వేగంగా అడవులు తరిగిపోవడం, పంటపొలాల్లో విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడటం ప్రధానంగా పాముల మనుగడకు అవరోధాలవుతున్నాయి. సర్పాల పట్ల అవగాహన కల్పించేందుకు ఏటా జులై 16న ప్రపంచవ్యాప్తంగా పాముల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1967లో టెక్సాస్‌లో ఏర్పాటు చేసిన స్నేక్‌ ఫామ్‌, ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య మండలి(యూఎన్‌సీబీడీ)-1993 సూచనలు ప్రపంచ పాముల దినోత్సవానికి నాంది పలికాయి. ప్రపంచంలో బ్రెజిల్‌లో ఎక్కువ రకాల పాములున్నాయి. ద్వీప దేశమైన ఐర్లాండ్‌లో అసలు పాములే లేవు.

పొంచి ఉన్న ముప్పు

ధరణిపై ఏ జాతి ఉనికి కోల్పోయినా మానవ మనుగడకు భంగం కలుగుతుంది. పాములు ఎలుకల్ని, కప్పల్ని వేటాడి తింటాయి. ఎలుక పొలాల్లో పంటలను, గృహాల్లో ఆహార పదార్థాలను నాశనం చేస్తుంది. అంతేకాదు.. కనిపించిన ప్రతి వస్తువును కొరికి పాడుచేయడం ఎలుకకు అలవాటు. తాను తినే ఆహారానికి 30 రెట్లు పనికిరాకుండా ముక్కలుగా చేసేస్తుంది. ఎలుక దంతాలు రోజూ 0.3 మి.మీ. చొప్పున పెరుగుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అరగదీయడం ఎలుకకు అవసరం. లేకపోతే దంతాలు కపాలంలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతుంది. ఆడ ఎలుక ఆరువారాలకోసారి పిల్లల్ని పెడుతుంది. ఒక్కోసారి ఆరు నుంచి 12 పిల్లలు పుడతాయి. ఆడ, మగ ఎలుకల్ని ఓ చోట ఉంచితే ఏడాదిలో వాటి సంఖ్య వేలల్లోకి చేరుతుంది. ఒకవేళ పాములు లేకపోతే కేవలం అయిదేళ్లలో ఈ భూమి ఎలుకలతో నిండిపోతుంది. అదే జరిగితే మనం తినడానికి ఆహార ధాన్యాలు మిగలవు. ప్లేగు వంటి వ్యాధులూ విలయతాండవం చేస్తాయి. ఒక్కో పాము రోజుకు సగటున అయిదు నుంచి పది ఎలుకల్ని వేటాడి తింటుంది. కొండచిలువ రోజుకు 50 ఎలుకల్ని మింగేస్తుంది. అందుకే పామును 'రైతునేస్తం' అని పిలుస్తారు.

ప్రపంచవ్యాప్తంగా 3,500 జాతుల పాములున్నాయి. వాటిలో కేవలం 600 రకాలు మాత్రమే విషసర్పాలు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 52లక్షల మంది ప్రజలు పాముకాటుకు గురవుతున్నారు. ఇందులో 21 లక్షల మంది విషసర్పాల బారిన పడుతున్నారు. పాము కాటుకు గురైన వారిలో ఏటా రెండులక్షల వరకు మరణాలు సంభవిస్తుండగా, మరో ఎనిమిది లక్షల మంది వైకల్యం బారిన పడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెబుతోంది. ఏటా 60వేల పాముకాటు మరణాలతో భారతదేశం ప్రపంచంలో ముందుంది. ఇండొనేసియా, నైజీరియా తరవాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు గంటల్లోపు సరైన వైద్యం అందితే పాముకాటు వల్ల ప్రాణహాని తప్పుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. పాము కరిచిన తరవాత విష ప్రభావం కన్నా భయంతో గుండెపోటు రావడంవల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. తన ఉనికికి భంగం కలిగినప్పుడు, ఆహార వేటలో మాత్రమే పాములు రౌద్రంగా ఉంటాయి. ఆవాస ప్రాంతాల్లో పాము కనిపిస్తే చంపేసే అలవాటుకు స్వస్తి పలికి వాటిని పట్టి అరణ్యాల్లో వదిలిపెట్టాలి.

పొగపెట్టడం ద్వారా పాముల్ని పరిసరాలనుంచి సాగనంపవచ్చు. అమ్మోనియా సల్పర్‌, నాఫ్తలీన్‌ గోళీలు, ఉల్లి, వెల్లుల్లి, దాల్చినచెక్కల నుంచి వచ్చే ఘాటు వాసనలకూ పాములు దూరంగా పారిపోతాయి. అమెరికాలో పాముల సంఖ్య భారత్‌లోకంటే చాలా ఎక్కువ. కానీ అక్కడి ప్రజలకు పాములపట్ల చక్కని అవగాహన ఉండటం, పాము కాటుకు వెంటనే వైద్యం లభించడం వంటి కారణాలతో మరణాలు ఇక్కడి కంటే అక్కడ చాలా తక్కువ. భారత్‌లో పాము విషానికి విరుగుడైన యాంటీ స్నేక్‌ వీనం, చికిత్స అందుబాటులో లేకే ఎక్కువ మంది చనిపోతున్నారు. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో పాముకాటుకు మందు లేక చాలా మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కార్పొరేట్‌ ఆస్పత్రులు పాముకాటు చికిత్సకు భారీమొత్తాలు వసూలు చేస్తున్నాయి.

కట్టుదిట్టంగా చట్టాల అమలు

డబ్ల్యూహెచ్‌ఓ పాము కాటుపై వ్యూహాత్మక అవగాహనకోసం 2019లో 'స్నేక్‌ బైట్‌ ఎన్వెనోమింగ్‌' వ్యవస్థను స్థాపించింది. 2030 నాటికి విషసర్పాల వల్ల మానవ మరణాలు, వైకల్యం 50శాతం మేర తగ్గించడం దీని లక్ష్యం. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూమి మీద కాంక్రీటు నిర్మాణాల వృద్ధి, సాగు భూములు తగ్గిపోవడం, వాహనాల ఉద్ధృతి, పరిశ్రమల కాలుష్యం, గనుల తవ్వకాల్లో పేలుడు పదార్థాల వినియోగం, పాముల్ని ఆహారంగా పరిగణించడం వంటి కార్యకలాపాలు సర్పజాతిని హరిస్తున్నాయి. పాముల్ని వేటాడి చర్మాన్ని, కోరలను అమ్ముకోవడం, బతుకు తెరువు కోసం వాటిని ఆడించడం వంటి ధోరణులకు స్వస్తి పలకాలి. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 2005 జీవవైవిధ్య చట్టాలు కట్టుదిట్టంగా అమలై- మూగజీవాల పరిరక్షణకు చట్రమై నిలవాలి.

రచయిత- చిలుకూరి శ్రీనివాసరావు

ఇదీ చూడండి:న్యాయార్థులకు ఇంకా అన్యాయమే!

ABOUT THE AUTHOR

...view details