దశాబ్దాల తరబడి విద్యార్థులను వేధిస్తున్న సమస్య- పుస్తకాల సంచి బరువు. దీన్ని తగ్గించాలంటూ ఎన్నో కమిటీలు బేషరతుగా చెప్పాయి. న్యాయస్థానాలు సైతం పలుమార్లు తీర్పులిచ్చాయి. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. విద్యారంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరగడం, కార్పొరేట్ సంస్కృతి విస్తరించిన నేపథ్యంలో- విద్యార్థుల పుస్తకాల సంఖ్య పెరుగుతూ బడి సంచి మోత పెనుభారమవుతోంది. ఇది విద్యార్థులపై శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతోంది. ఈ సమస్యలకు చరమగీతం పాడేందుకు కేంద్ర విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని 'స్కూల్ బ్యాగ్ పాలసీ-2020' వెలువరించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలనూ విడుదల చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది.
10 శాతం మించకూడదు..
అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో బడి సంచుల బరువుపై నియంత్రణ ఎప్పటినుంచో అమలవుతోంది. 'అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్, అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్' విస్తృతమైన పరిశోధనలు చేసి విద్యార్థి బరువులో పుస్తకాల బరువు పది శాతం మించకూడదని తేల్చిచెప్పాయి. దేశీయంగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల సంఖ్య అధికం. విద్యార్థి వికాసమే ధ్యేయంగా బోధన జరిగితే ఇన్ని పుస్తకాల అవసరం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. బోధన పూర్తిగా పుస్తకాలపై ఆధారపడి ఉండటంవల్లే వాటి సంఖ్య పెరుగుతోందంటున్నారు. ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం లేకపోవడంతో విద్యార్థుల సంచిలో లంచ్ బాక్స్, నీళ్ల సీసా తప్పనిసరి అవుతున్నాయి. ఇది అదనపు భారంగా మారుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో 'నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ)' విద్యావిధానం అమలవుతోంది. 'విద్యాహక్కు చట్టం-2009' ప్రకారం పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని సీసీఈ సైతం స్పష్టంగా చెబుతోంది. అందుకే సీసీఈ పాఠ్యపుస్తకాల్లో సిలబస్ తక్కువగా ఉంటుంది.
పుస్తకాల సంచి లేకుండానే...
ఇప్పటివరకు ప్రతిపాదించిన మూడు జాతీయ విద్యావిధానాలు, 1964లో కొఠారీ కమిషన్ బడి సంచుల బరువు తగ్గించాల్సిన అవసరాన్ని తెలియజెప్పాయి. ఆ తరవాత వచ్చిన యశ్పాల్ కమిటీ సైతం సంచుల బరువు తగ్గించాల్సిందేనని నొక్కి చెప్పింది. మద్రాసు హైకోర్టు తీర్పు; ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ తదితర సంస్థల నిపుణుల సూచనల మేరకు ఎట్టకేలకు కేంద్రం ఈ అంశంపై నిర్మాణాత్మకమైన విధానాన్ని తీసుకొచ్చింది. పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో పది శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. నెలలో కనీసం పది రోజులు అసలు పుస్తకాల సంచి లేకుండానే బడికి వచ్చే విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఏ తరగతికి ఎన్ని పుస్తకాలు ఉండాలో, వాటి బరువు ఎంత ఉండాలో కూడా చెప్పింది. ఈ మార్గదర్శకాల ప్రకారం... ప్రిప్రైమరీకి అసలు పుస్తకాలు ఉండకూడదు.