తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అవకాశాల సముద్రం.. అందిపుచ్చుకుంటే అందలం - eenadu editorial

సముద్ర రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. వచ్చే పదేళ్లలో ఈ రంగంలో దిగ్గజ శక్తిగా భారత్ ఎదుగుతుందని మారిటైమ్ సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. కేవలం వాణిజ్యం పరంగానే కాక పర్యటకం, మైనింగ్ తదితర విభాగాల్లో ఉన్న ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటే జలసిరులు పండటం ఖాయం.

editorial
అవకాశాల సముద్రం.. అందిపుచ్చుకుంటే అందలం

By

Published : Mar 5, 2021, 8:37 AM IST

వచ్చే పదేళ్లలో నీలి ఆర్థిక దిగ్గజ శక్తిగా భారత్‌ ఎదుగుతుందంటూ మారిటైమ్‌ సదస్సులో ప్రధానమంత్రి మోదీ చేసిన సంకల్ప దీక్షా ప్రకటన- ప్రగతి సాగర మథనంలో గెలుపు తథ్యమన్న అచంచల ఆత్మవిశ్వాసాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. తొలుత వాజ్‌పేయీ జమానాలో తెరపైకి వచ్చి ఆపై యూపీఏ ఏలుబడిలో పూర్తిగా కనుమరుగైన 'సాగరమాల' పథకానికి మోదీ ప్రభుత్వం ఆరేళ్లక్రితం తిరిగి ఊపిరులూదింది. ఉన్న రేవుల్ని నవీకరించి, కొత్తగా ప్రపంచస్థాయి నౌకాశ్రయాలు నిర్మించి, వాటన్నింటినీ అనుసంధానిస్తూ కోస్తా ఆర్థిక మండళ్లు నెలకొల్పాలని అప్పట్లో తలపెట్టారు.

ప్రధాని మోదీ

కరోనా సంక్షోభంతో భిన్నరంగాలు కుప్పకూలి వృద్ధి అంచనాలు తలకిందులైన దృష్ట్యా 'మారిటైమ్‌ విజన్‌ 2030' పేరిట సరికొత్త ముసాయిదా కూర్పువైపు మొగ్గుచూపిన కేంద్రం, అవసరానుగుణ మార్పులకు ఓటేసింది! వేలాది సంవత్సరాలపాటు ముఖ్య వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లిన ఓడరేవులు కలిగిన ఘనచరిత్ర భారతావనిది. ఏడున్నర వేల కిలోమీటర్ల మేర విస్తరించిన సుదీర్ఘ తీరప్రాంతం, పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలు సహా రెండువందల వరకు పోర్టులు కలిగిన దేశంనుంచి ఏటా 140కోట్ల టన్నుల దాకా సరకు రవాణా అవుతోంది. ఈ సహజ బలిమికి నగిషీలద్దుతూ జలమార్గాల అభివృద్ధి, జలవిమాన సేవలు, షిప్‌యార్డులూ లైట్‌హౌస్‌ల వద్ద పర్యాటకాభివృద్ధికి కంకణబద్ధమైనట్లు ప్రధాని చెబుతున్నారు.

కొత్తపుంతలు..

2035 నాటికి నౌకాశ్రయాల పరిపుష్టీకరణ నిమిత్తం ఆరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామంటూ- విదేశీ, స్వదేశీ పెట్టుబడులకూ ఆయన స్వాగతం పలికారు. గతంలో వెల్లడించిన విధంగా పశ్చిమ్‌ బంగ నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ వరకు గుదిగుచ్చిన మాలను తలపిస్తూ తీరప్రాంతాన నౌకాశ్రయాల్ని పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే- అవన్నీ అక్షరాలా జలసిరులకు ఆలవాలమవుతాయి. సముద్ర ఆధారిత పరిశ్రమ అన్నది కేవలం మత్స్యసంపదకే పరిమితం కాదు- విస్తృత జల రవాణా, ద్వీప పర్యాటకం, సాగర గర్భ మైనింగ్‌ తదితరాల మేళవింపుగా అది సాకారమైతే, యావత్‌ తీరప్రాంత అభివృద్ధీ కొత్త పుంతలు తొక్కుతుంది!

ముందే ఉన్న చైనా..

జల రవాణా మార్గాన భిన్న దేశాల మధ్య వర్తక వాణిజ్యాలనగానే వెంటనే స్ఫురించేవి ఓడరేవులు. నేడు ఎన్నో దేశాల స్థిరాభివృద్ధికి సింహద్వారాలుగా చెప్పదగినవి నౌకాశ్రయాలు. ప్రణాళికాబద్ధమైన ఓడరేవుల ఆధారిత ప్రగతికి పెద్ద ఉదాహరణగా పేర్కొనాల్సింది జన చైనానే. పోర్టులకు చేరువలో కర్మాగార సముదాయ ప్రాంతాల్ని సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన చైనా వాణిజ్యవ్యూహం అద్భుత ఫలితాలు సమకూర్చింది. స్థానికంగా వేర్వేరు వ్యవస్థల్నీ తేజరిల్లజేసింది. మౌలిక సదుపాయాల పరికల్పనలో అమెరికా, జపాన్‌ తదితరాల ముందుచూపూ ఆయా దేశాల ప్రగతికి మేలు బాటలు పరచిందన్నది ఆధునిక చరిత్ర చెబుతున్న సత్యం.

వైజాగ్ పోర్ట్

కార్యచరణతో కాసులే..

అంతర్గత జల రవాణా మార్గాలకు ఎన్నో ఐరోపా దేశాలు పెట్టింది పేరు. ద్వీపకల్ప దేశమైన భారత్‌లో 14500 కిలోమీటర్ల నిడివిగల అంతర్గత జల రవాణా మార్గాలున్నప్పటికీ, అందులో జాతీయ జలమార్గాలుగా కేంద్రం గుర్తించినవి అరకొరే. ఉన్నంతలో అంతర్గత జల మార్గాల ద్వారా ఎన్నదగ్గ రాబడి పొందుతున్న రాష్ట్రంగా కేరళ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఒకప్పుడు జలరవాణాకు సుప్రసిద్ధమైన బకింగ్‌హామ్‌ సాధారణ కాలువగా దిగజారిన వైనం ఏపీలో చూస్తున్నాం. వెలుపలికి సరకు రవాణాలో గుజరాత్‌ తరవాత రెండోస్థానాన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17 కోట్ల టన్నుల దాకా వార్షిక కార్గో సేవలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా మత్స్యరంగ ఎగుమతుల్లో భారత్‌ వాటా ఇప్పటికీ ఎనిమిది శాతమే. రహదారులతో పోలిస్తే అయిదోవంతు వ్యయంతోనే రవాణా సేవలు అందించగల జలమార్గాల అభివృద్ధి ఎంత కీలకమో, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పెంపొందించగల రేవుల అభివృద్ధి, వాటికి రైలు రహదారి మార్గాలతో అనుసంధానం వంటివీ అంతే ముఖ్యం. ఈ విస్తృత ప్రణాళిక రచనకు ప్రభుత్వ నిబద్ధతతో దీటైన కార్యాచరణ జతపడితే- సముద్ర ఆధారిత పరిశ్రమ రత్నగర్భే అవుతుంది!

ఇదీ చూడండి:దేశమంతటా 'ఒక జిల్లా- ఒక ఉత్పత్తి' పథకం

ABOUT THE AUTHOR

...view details