సువిశాల భారతదేశంలో ఉన్న సుమారు అరవై కోట్ల మంది యువతీయువకులకు దేశ రాజకీయాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ- ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా 21 సంవత్సరాల వయసులో ఎన్నికైన ఆర్య రాజేంద్రన్ పేరు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. దేశంలోనే అతి పిన్నవయసులో మేయర్గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్రకెక్కారు. గతంలో 23 ఏళ్ల వయసులో కేరళలోని కొల్లాం మేయర్గా ఎన్నికైన సబితా బీగం రికార్డును ఆర్య తిరగరాశారు. 1997లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ 27 సంవత్సరాల వయసులోనే నాగ్పుర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికయ్యారు. ఇలాంటి ఉదంతాలు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మరింత స్ఫూర్తినిస్తాయి.
చట్టసభల్లో అంతంతమాత్రంగా...
భారత రాజ్యాంగంలోని 112వ సవరణ బిల్లు 2009లో లోక్సభలో ఆమోదం పొందడం ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం దక్కింది. దాని ఫలితంగా రాజకీయాల్లో యువ మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పలు రాష్ట్రాల్లో ఆ రిజర్వేషన్లు అమలు కావడంలేదు. యువత చట్టసభలకు పోటీ చేసే అవకాశాలు కల్పించడం లేదని భారత ఎన్నికల సంఘం గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. డేటా ఇంటెలిజన్స్ యూనిట్ 2019 నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుత లోక్సభకు జరిగిన ఎన్నికల్లో చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పోటీచేసిన చాలామంది అభ్యర్థులు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారే కావడం గమనార్హం. ప్రధానంగా దాద్రా నగర్ హవేలిలో 64శాతం, సిక్కింలో 55 శాతం, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్లలో 50 శాతం చొప్పున యువకులు పోటీచేశారు. పెద్ద రాష్ట్రాల్లో పరిశీలిస్తే- తెలంగాణలో 45శాతం ఝార్ఖండ్లో 39శాతం, హరియాణాలో 36శాతం, గుజరాత్, తమిళనాడులలో 38శాతం చొప్పున యువ అభ్యర్థులు రంగంలోకి దిగారు. 40ఏళ్ల లోపువారిలో ఎక్కువశాతం స్వతంత్ర అభ్యర్థులే. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసినవారిలో యువతరం సంఖ్య తక్కువగా ఉండటం నిరాశ కలిగించే అంశం. ప్రస్తుత లోక్సభకు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసినవారిలో 60ఏళ్లకు పైబడిన అభ్యర్థులు 52శాతం. జేడీ(యు) నుంచి 42శాతం, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 39శాతం, కాంగ్రెస్ నుంచి 38శాతం భాజపా నుంచి 32శాతం చొప్పున అభ్యర్థులు ఉన్నారు. భాజపా, కాంగ్రెస్ల నుంచి 2014 కంటే 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీచేసిన యువ అభ్యర్థుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువ కావడం కాస్త ఊరట కలిగించే అంశం.