Cyber frauds in india: గతేడాది నుంచి భారత్ కరోనా వైరస్తో పాటు అనూహ్యంగా పెరిగిపోయిన సైబర్ మోసాలతోనూ తీవ్రంగా పోరాడుతోంది. మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి వర్గాలపై సైబర్ నేరాలు గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించాయి. కరోనా కాలంలో ఇండియాలో సైబర్ నేరాలు ఎన్నో రెట్లు పెరిగినట్లు పలు అధ్యయనాలు చాటుతున్నాయి. అయిదారేళ్లుగా పెరుగుతున్న ఫోన్ల వినియోగం, చెల్లింపులను సులభతరం చేయడానికి అందుబాటులోకి వచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం వంటివి అందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి దారితీశాయి. దాంతోపాటే సైబర్ భద్రత సైతం ప్రమాదంలో పడింది. కరోనా తరవాత భారత్లో సైబర్ నేరాలు ఎన్నోరెట్లు పెరిగాయని ఇటీవల కేరళలో జరిగిన వార్షిక సైబర్ భద్రతా సదస్సులో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు.
తీవ్ర ఆందోళన
Cyber fruads by links: 'మీ బ్యాంకు ఖాతాను నిలిపివేస్తున్నాం. మీ గూగుల్పే, ఫోన్పేలను వాడుకోలేరు. వెంటనే మీ వివరాలను నిర్ధారించుకోండి' వంటి సందేశాలు వస్తే ఆదరాబదరా అందులో ఉండే లింకులను తెరచి సమస్యలను కొనితెచ్చుకొనేవారే అధికంగా ఉంటున్నారు. వినియోగదారుల భయమే సైబర్ నేరస్తులకు పెట్టుబడి. ఇటువంటి వాటిని సాంకేతిక పరిభాషలో 'సోషల్ ఇంజినీరింగ్ నేరాలు' అని వ్యవహరిస్తారు. మనిషి సహజసిద్ధ భావోద్వేగాలను ప్రేరేపించేలా ఏదో ఒక కట్టుకథ అల్లి, ఆ గందరగోళంలో ఉన్న వ్యక్తి ఖాతాను ఖాళీ చెయ్యడం సైబరాసురుల వ్యూహం. దేశంలో లాక్డౌన్ అమలైన తరవాత ఐటీతో పాటు కొన్ని ఇతర రంగాల సంస్థలు తమ ఉద్యోగులు ఇళ్లనుంచి పనిచేసే వెసులుబాటును కల్పించాయి. సైబర్ నేరాలకు అదే మరింత ఊతం ఇచ్చింది. ఒక ఉద్యోగి తన ఇంటి నుంచి లోపభూయిష్ఠమైన నెట్వర్క్ ద్వారా తాను పనిచేసే కంపెనీ సర్వర్కి పంపించే సమాచారాన్ని సైతం సైబర్ నేరగాళ్లు తస్కరించిన దాఖలాలు ఉన్నాయి.
బడా సంస్థలకు సైతం ఇబ్బందికరంగా
Big companies cyber attack: సమాచార బదిలీలో వివిధ ప్రొటోకాల్స్కు మధ్య ఉండే సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకొనే మాయగాళ్లూ ఉన్నారు. అలా జరుగుతున్న సమాచార తస్కరణ మామూలు వ్యక్తులకే కాదు, బడా సంస్థలకు సైతం ఇబ్బందికరంగా మారుతోంది. కరోనా తరవాత దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, శాఖలు, సంస్థల కార్యకలాపాలన్నీ ఆన్లైన్లో కొనసాగడం అధికమైంది. దాంతో ప్రభుత్వ అధికారులు ఇచ్చిపుచ్చుకొనే కీలకమైన సమాచారం సైతం సైబర్ నేరస్తులకు లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని సైబర్ భద్రత సదస్సులో జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. గతేడాది దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్లు), నౌకాశ్రయాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థల నెట్వర్క్లలోకి చైనా హ్యాకర్ మూకలు మాల్వేర్ను చొప్పించిన విషయం వెలుగులోకి రావడం ఆందోళన కలిగించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్ బాట పడుతున్నాయి. బ్యాంకులు, బీమా, ఆస్పత్రులు వంటి అన్ని కీలక రంగాల సమాచారం డిజిటల్ రూపంలోకి మారుతోంది. అందువల్ల సైబర్ భద్రత పరంగా అన్ని స్థాయుల్లో పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
స్పష్టత లేదు..
Awareness cyber security: సైబర్ నేరగాళ్ల బారిన పడి బ్యాంకు ఖాతా ఖాళీ అయితే ఎవరిని సంప్రదించాలన్నదానిపై సామాన్యులకు కనీసం అవగాహన లేదు. ఒకవేళ ఫిర్యాదుచేస్తే సమస్యకు ఎన్నిరోజుల్లో పరిష్కారం లభిస్తుందన్నదానిపై స్పష్టత కొరవడింది. నెట్వర్క్ సరిగ్గా లేక నగదు చెల్లింపు స్తంభించి, ఆ ధనం కొన్ని రోజుల వరకూ తిరిగి అకౌంట్లలోకి రాక ఎంతోమంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సైబర్ మోసాల విషయంలో బ్యాంకులు సరిగ్గా స్పందించడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు రాన్సమ్వేర్ దాడులవల్ల తమ కంప్యూటర్, సర్వర్లలో కీలకమైన సమాచారాన్ని పోగొట్టుకుంటున్న వారెందరో ఉంటున్నారు. హ్యాకర్లు కోరినంత డబ్బు చెల్లిస్తే తప్ప ఆ సమాచారాన్ని తిరిగి పొందడం సాధ్యం కావడంలేదు. అంత పెద్దమొత్తాన్ని చెల్లించలేక డేటాపై ఆశలు వదిలేసుకుంటున్న వారూ కోకొల్లలు.