తెలంగాణ

telangana

కొలువులపై కరోనా దెబ్బ- కూలి పనుల్లో యువత

By

Published : Jun 29, 2020, 10:22 AM IST

కరోనా మహమ్మారి మావవాళిని హరించి వేస్తుంది. ఏ ఉద్యోగమూ లేక, చదువుకున్న రంగంలో తీవ్ర పోటీకి తట్టుకోలేక ఏదైనా సర్కారీ కొలువు కోసం ప్రయత్నించే వారికి కరోనా తీవ్ర ఆవేదనను, అయోమయాన్ని మిగిల్చింది. ఇప్పటికే ప్రకటించిన కొలువుల పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు జరుగుతాయే తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది నిరుద్యోగ యువత స్వస్థలాకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు.

Coronavirus attacks jobs in India, hiring disrupted  Corona
ఉద్యోగ భర్తీ ప్రక్రియపై కరోనా ప్రభావం.. నియమకాలు వాయిదా

కరోనా కలకలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోగా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెలవెలబోతున్నాయి. చిరువ్యాపారాలు విలవిలలాడితే, కార్మిక కర్షక లోకం దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతదీ ఎటూపాలుపోని పరిస్థితి. ఏదో ఒక ఉద్యోగం మీద పూర్తిగా దృష్టి పెట్టి నిరంతరం సాధన చేస్తుంటేనే, విజయం సాధించేందుకు కనీసం మూడు నుంచి అయిదేళ్లు పడుతుంది. ప్రభుత్వోద్యోగాలలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వంటివి మినహాయిస్తే తక్కిన ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎక్కువగా జాప్యం నెలకొంటూ ఉంటుంది. ఏ ఉద్యోగమూ లేక, చదువుకున్న రంగంలో తీవ్ర పోటీకి తట్టుకోలేక ఏదైనా సర్కారీ కొలువు కోసం ప్రయత్నించే వారికి కరోనా తీవ్ర ఆవేదనను అయోమయాన్ని, అనిశ్చితిని మిగిల్చింది.

కూలీ పనులకు వెళ్తున్న నిరుద్యోగ యువత

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల శిక్షణ నిమిత్తం నిరుద్యోగ యువత ఏటా భారీ సంఖ్యలో పల్లెటూళ్ల నుంచి నగరాల బాట పడుతుంటారు. మార్చిలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా శిక్షణ కేంద్రాలు, విద్యార్థుల వసతి గృహాలు అన్నింటినీ మూసివేశారు. ఇలాంటి వాళ్లంతా గ్రామాలకు తిరుగుపయనమయ్యారు. అనుకున్న సమయంలో శిక్షణ పూర్తికాలేదు. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు జరుగుతాయో, జరిగినా అన్నీ సజావుగా సాగుతాయో లేదోననే భయం ఉండనే ఉంది. ఇప్పటికే ఉద్యోగ పరీక్షల్లో ఎంపికై ఏళ్లు గడుస్తున్నా నియామక పత్రాలు రాక నిరుద్యోగ యువత కూలి పనులు చేసుకుంటున్న దృశ్యాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి.

నియమకాలు వాయిదా...

రోజురోజుకీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఉద్యోగ నియామక ప్రక్రియలు నిలిచిపోతున్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, ఎల్‌ఐసీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీలతోపాటు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలు గత మూడు నెలల్లో జరగాల్సిన అనేక ఉద్యోగాల నియామకాలను వాయిదా వేసుకున్నాయి. ముందు ప్రకటించిన తేదీలను రద్దు చేసి మళ్ళీ జరిగే తేదీలను ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలతో పాటు సిక్కిం, మధ్యప్రదేశ్‌. ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఇదే మార్గాన్ని అవలంబించాయి. సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన తేదీలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సైతం వాయిదా పడిన గ్రూపు-1, గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీలను ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా కొత్త తేదీలను ఖరాలు చేసి ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు హాజరయ్యే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే ఉద్యోగ పరీక్షలకూ కొత్త తేదీలు వెలువడ్డాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో...

దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌సీ, ఎస్‌బీఐ పీవో, ఐ.బి.పి.ఎస్‌., సి.డి.ఎస్‌. డిఫెన్స్‌, వైజాగ్‌ స్టీల్‌ వంటి సంస్థలు నిర్వహించే ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇవే కాకుండా స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో డీఎస్సీ, గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 లాంటి ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో సన్నద్ధమవుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. యూపీఎస్సీ, గ్రూప్‌ సర్వీసులు, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఉపాధ్యాయ ఉద్యోగాలే కాకుండా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొని వృత్తి విద్యా నైపుణ్యాలు పొందేందుకు వస్తుంటారు. వీరంతా హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో వసతి గృహాల్లో ఉండి శిక్షణ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరి పాలిట కరోనా అశనిపాతంలా మారింది. కొన్ని పరీక్షలు నిరవధికంగా వాయిదా పడటం, కొన్నింటికి కొత్త తేదీలు రావడం, మరికొన్ని ఎప్పుడు జరుగుతాయో నిర్ణయించని తేదీలతో కొట్టుమిట్టాడుతుంటే, వాటికోసం చకోర పక్షుల్లా ఎదురుచూసే యువత ఆవేదన వర్ణనాతీతం. తమ ఆశలూ, ఆశయాలూ తీరతాయో లేదోనన్న భయం కరోనా కంటే వేగంగా వ్యాపిస్తోంది. కష్టాన్నే ఇష్టంగా మార్చుకొని ముందుకుసాగే యువతను ఇప్పుడు అన్నివైపులా కమ్ముకొస్తున్న అనిశ్చితి- కరోనాకంటే ఎక్కువగా భయపెడుతోంది. పాదరసం కంటే చురుగ్గా ఆలోచించే మెదళ్లు మొద్దుబారిపోతున్నాయి. యువత నైరాశ్యంలోకి జారిపోక ముందే ప్రభుత్వాలూ, అధికార యంత్రాంగాలు మేల్కోవాలి. పోటీ పరీక్షార్థుల కోసం తక్షణమే ఉద్యోగ నియామక ప్రక్రియల్ని చేపట్టాలి. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో... పోటీ పరీక్షల నిర్వహణ సమర్థంగా, సురక్షితంగా సాగుతుందన్న భరోసా కలిగించాలి. సమాజంలోని అన్ని వర్గాల్లాగే నిరుద్యోగులపైనా దృష్టిసారించాల్సిన సమయమిది.

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌

ABOUT THE AUTHOR

...view details