కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడం వ్యాపార, ఉద్యోగ వర్గాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. 130 కోట్లమంది భారతీయులు కరోనా గుప్పిట చిక్కకుండా చూడటానికి లాక్డౌన్ ప్రకటించడంతో పౌర విమానయాన సంస్థలు, ఆతిథ్య, పర్యాటక, వినోద రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటికి తోడు పారిశ్రామిక ఉత్పత్తి ఆగిపోయింది.
కరోనా కల్లోలానికి ముందు మూడేళ్ల నుంచి మన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు నిరర్థక ఆస్తులతో, పారుబాకీలతో అతలాకుతలమవుతూ వచ్చాయి. వ్యక్తులు, కుటుంబాలతోపాటు కంపెనీలు, ప్రభుత్వం అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. ఇంతలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ వచ్చిపడ్డాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేయగానే ఆర్థిక వ్యవస్థ తారాజువ్వలా పైకి ఎగసే అవకాశాలున్నాయి. అలా కాకుండా లాక్డౌన్ దీర్ఘకాలం కొనసాగితే జరిగే ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. అప్పుడు జరిగే నష్టాలూ దీర్ఘకాలంపాటు ఉంటాయి. వాటి నుంచి తేరుకోవడం చాలా కష్టం. పరిశ్రమలు, సేవారంగం ఎక్కువగా దెబ్బతింటాయి. కరోనా సంక్షోభానికి ముందు జాతీయ నమూనా సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు గత 45 ఏళ్లలో కనీవినీ ఎరుగనంత అధికంగా ఉంది. సంస్థ నివేదికను ప్రభుత్వం సాధికారంగా ఆమోదించలేదు కానీ, కరోనా నుంచి భారత్ సాధ్యమైనంత త్వరగా బయటపడకపోతే పరిణామాలు మరింత దారుణంగా ఉండవచ్చు.
సేవా రంగం కకావికలం...
విమానాలు, వ్యాపారాలు, కర్మాగారాలు, అనేక ఇతర సేవలు దెబ్బతినడమే కాకుండా వస్తుసేవల వినియోగం కుదేలవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. వినియోగం లేదా గిరాకీ ఉంటేనే వస్తుసేవల ఉత్పత్తి పెరుగుతుంది. అవి పెరిగితేనే ఉపాధి అవకాశాలు వృద్ధి అవుతాయి. అలాకాకుండా ఉత్పత్తి, వినియోగం రెండూ దెబ్బతింటే ఉపాధి, వ్యాపారాలు పెరగడం అసాధ్యమవుతుంది. కరోనా సంక్షోభం వల్ల భారతదేశంలో అసంఘటిత రంగం ఎక్కువగా దెబ్బ తింటోంది. ఈ పరిణామం పేద ప్రజానీకాన్ని అష్టకష్టాల పాల్జేస్తుంది. భారతదేశంలో 80 శాతం ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. వీరిలో ఇళ్లలో పనులు చేసే మహిళలు, దినసరి నిర్మాణ కూలీలు, ఇటుక బట్టీ కార్మికులు, పలురకాల చేతివృత్తుల వారు ఎటువంటి ఒప్పందాలూ లేకుండా పనిచేస్తారు. వీరు రోజూ సంపాదించుకునే సొమ్ము నిత్యావసర సరకుల కొనుగోలు రూపంలో తిరిగి మార్కెట్లోకి వస్తుంది.
ఆ సొమ్ముతో చిల్లర వర్తకులు, మరమ్మతులు తదితర సేవలు అందించేవారి కార్యకలాపాలు కొనసాగుతాయి. అందుకే దీన్ని స్వయంఉపాధి వర్గంగా చెప్పవచ్చు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) సైతం లాక్డౌన్తో కకావికలమవుతున్నాయి. ప్రస్తుతం భారత్ జీడీపీలో 54 శాతం వాటా సేవా రంగానిదే. లాక్డౌన్ సమయంలో ఎక్కడికక్కడే కార్యకలాపాలు స్తంభించడంవల్ల దినసరి వేతనాలు రాక, బేరాలు లేక- చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగంవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగ కల్పన రేటు దారుణంగా పడిపోతోంది. లాక్డౌన్ తరవాత పరిస్థితులు కుదుట పడతాయేమోనన్న ఆశతో కార్పొరేట్ రంగం ఇప్పటికిప్పుడు ఉద్యోగాలను కుదించకపోవచ్చు.
అయితే, జీతభత్యాల్లో కోత పెట్టదనే హామీ లేదు. విక్రయాలు పడిపోతే కంపెనీల చేతిలో డబ్బు ఆడదు. నిర్బంధ నిబంధనలు ఎక్కువ కాలం కొనసాగితే కంపెనీల ఆదాయం పడిపోయి, ఉద్యోగుల జీతాలపై దుష్ప్రభావం చూపక మానదు. లాక్డౌన్ తరవాత కూడా అమ్మకాలు, ఆదాయాలు పుంజుకోకపోతే ఉద్యోగులు జీవనాధారం కోల్పోయే ప్రమాదమూ హెచ్చుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి కంపెనీల ఆదాయాలు ఎక్కువ కాలం పడిపోతే, అవి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి దాపురిస్తుంది. పెద్ద కంపెనీల్లా అవి లాక్డౌన్ దుష్ప్రభావాన్ని తట్టుకోలేవు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను, వ్యాపార పరిమాణాన్ని తగ్గించుకొంటే, మరికొన్ని కంపెనీలు దివాలా తీయవచ్చు. అవి బ్యాంకు రుణాలను తీర్చలేక ఎగనామం పెట్టవచ్చు. అది బ్యాంకుల ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తుంది.