కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది విద్యార్థుల్లో తొమ్మిదిమంది విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతిన్నదని యునెస్కో ప్రకటించింది. విద్యాసంస్థలు మూతపడటంవల్ల అంతర్జాతీయంగా 154 కోట్లమంది చదువు అటకెక్కింది. భారత్లో బాధిత విద్యార్థుల సంఖ్య 32 కోట్లకుపైనే. వైరస్వల్ల అర్ధాంతరంగా చదువు నిలిపేయవలసి వచ్చిన విద్యార్థుల్లో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువ. విద్యావిఘాతం వల్ల మున్ముందు ఆర్థిక, సామాజిక విపరిణామాలెన్నో సంభవించనున్నాయి. ఈ గడ్డు కాలంలో ఆన్లైన్ లేదా రిమోట్ విద్య అండగా నిలుస్తోంది. దీన్ని ఈ-లెర్నింగ్గానూ వ్యవహరిస్తున్నారు. పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అన్ని సంస్థలూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్ పద్ధతిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఏఐసీటీఈ, సీబీఎస్ఇ, యూజీసీలు అందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. అయితే కొత్త ఆన్లైన్ విద్యావిధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పౌరులు సరిగ్గా ఇమడగలరా అనే సందేహం బలంగానే వ్యక్తమవుతోంది.
సాంకేతికతను అందిపుచ్చుకొంటేనే...
తక్కువ ఖర్చులో సుదూరంలోని విద్యార్థులకూ వేగంగా సులువుగా చదువు చెప్పే సౌలభ్యం ఆన్లైన్ విద్యకు ఉన్నమాట నిజం. ఏక కాలంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్ఛు కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించిన తొలినాళ్లలో ఆన్లైన్ విద్యను ఆశ్రయించక తప్పలేదు. ఇది తాత్కాలికమేనని, వైరస్ బెడద తొలగిపోయిన తరవాత మళ్లీ విద్యాసంస్థలు తెరచుకుంటాయని అందరూ భావించారు. కానీ, వాస్తవంలో ఆన్లైన్ విద్య లేదా ఈ-లెర్నింగ్ ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థల్లో ‘స్వయం’ పేరిట ప్రవేశించి ఉంది. స్వయం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (మూక్స్)ల కిందకు వస్తుంది. అన్ని స్థాయుల్లో విద్యాభ్యాసానికి వీలు కల్పించే మూక్స్ ప్రపంచంలో అతిపెద్ద ఆన్లైన్ ఉచిత ఈ-లెర్నింగ్ వేదిక. ఈ తరహా విద్యాభ్యాసాన్ని పాఠశాల నుంచి కళాశాల వరకు చేపట్టడం తక్షణమే సాధ్యపడదు. విద్యాసంస్థలు, అధ్యాపకులు కొన్ని సన్నాహాలు చేసుకోవలసి ఉంటుంది. అందుకు కొంత సమయం పడుతుంది. కొత్త సాంకేతికతల వినియోగంలో పాత తరం టీచర్లకన్నా కొత్తవారే ముందుంటారని, కాబట్టి ఈ-లెర్నింగ్ యువ ఉపాధ్యాయులకే అనువైనదనే వాదన ఉంది. కానీ, సాంకేతికత వినియోగాన్ని శాసించే అంశం వయసు ఒక్కటే కాదని, మార్పును స్వాగతించి, దాన్ని అందిపుచ్చుకొనే ధోరణి ఉంటే వయసుమీరిన వారూ యువతరానికి దీటుగా నిలవగలరని పలు పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి.
భారతీయ విద్యావ్యవస్థ విస్తారమైనది. 15 లక్షల పాఠశాలలు, 50,000 ఉన్నత విద్యాసంస్థలతో కూడిన ఈ సువిశాల వ్యవస్థలో ఈ-లెర్నింగ్ ప్రక్రియను ఉన్నపళాన ప్రవేశపెట్టడం సాధ్యంకాదు. మన విద్యార్థులు భిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందినవారు కావడం వల్ల డిజిటల్ అగాధమేర్పడి, అందరూ ఒకే స్థాయిలో ఈ-లెర్నింగ్ కు మారలేని పరిస్థితి ఉంది. విద్యార్థుల మధ్య డిజిటల్ అగాధాతాన్ని అధిగమించి, అందరికీ ఈ-లెర్నింగ్ అవకాశాన్ని కల్పించడం అత్యావశ్యకం. కేంద్రం ప్రకటించిన కొత్త విద్యా విధానం ఇటువంటి సమ్మిళిత విద్యను అందించాలని లక్షిస్తోంది. ప్రస్తుతం ఈ-లెర్నింగ్ అత్యధిక విద్యార్థులకు అందుబాటులో లేదు. ఆర్థిక అంతరాలు, గ్రామీణ-పట్టణ భేదాలు, మారుమూల ప్రాంతాల్లో నివాసాలు, ఆంగ్ల భాషా నైపుణ్యంలో తేడాలు, లింగ భేదాలు, దివ్యాంగ బాలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ మాధ్యమ సాయంతో అందరికీ విద్యను అందించాల్సిన ఆవశ్యకతను కొవిడ్ సంక్షోభం ముందుకుతెచ్చింది. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికిరాదు. విద్యార్థుల స్థాయీభేదాలను పరిగణనలోకి తీసుకుని సముచిత పద్ధతులను అనుసరించాలి. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకొని బోధనాభ్యాసాలు వేగంగా జరిగేలా చూడటానికి తగు సంస్థాగత ఏర్పాట్లను ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు సిద్ధం చేయాలి. తమకు అనువైన వేదికలు, సాధనాలతో విద్యాభ్యాసం చేసే వెసులుబాటు విద్యార్థులకు ఉండాలి.
ఉపాధ్యాయుల్లో రావాల్సిన మార్పు