అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా ఫలితాలు వేర్వేరుగా వచ్చి ఉండవచ్చు. కానీ, వీటిలో పార్టీలన్నింటికీ గంపగుత్తగా వర్తించే ఒక గుణపాఠం ఉంది. అదే సమర్థ, స్థానిక నాయకత్వ ఆవశ్యకత! మారుతున్న భారతీయ ఓటరు అభిమతం దృష్ట్యా అధికారం నిలబెట్టుకోవాలన్నా, కొత్తగా సాధించాలన్నా ఈ రెండూ ఎంత అవసరమో తాజా ఎన్నికలు చాటిచెప్పాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని పాలించేవారెవరో, వారి సత్తా ఏమిటో పరిగణనలోకి తీసుకుంటున్నారు ప్రజలు! స్థానికంగా బలమైన నాయకత్వాలను సమర్థ పాలన అందించే వారిని తయారు చేసుకోకుండా దిల్లీ నేతలనో, వారసత్వాన్నో, పార్టీనో, సిద్ధాంతాన్నో చూసి ఓట్లు వేయమంటే ఫలితాలు తిరగబడుతున్నాయి. పశ్చిమ్ బంగలో మమత, కేరళలో విజయన్, అసోమ్లో భాజపా నాయకులకు (సోనోవాల్, హిమంత) ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం మిగిలిన పార్టీల్లో ఓటర్లకు కనిపించలేదు. అందుకే వారినే ఎన్నుకున్నారు. తమిళనాట సైతం స్టాలిన్కు ఓసారి అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు.
ఇదీ చదవండి:దీదీ అడ్డా పదిలం- భాజపా వ్యూహం విఫలం!
ఇదీ చదవండి:'మోదీ-షా అజేయులు కారని సుస్పష్టం'
'కాంగ్రెస్ ముక్త్ భారత్'!
'మీ దృష్టిలో కాంగ్రెస్ ముక్త్ అంటే.. దేశంలో అసలు కాంగ్రెసే ఉండొద్దనా?' అని ప్రధానమంత్రి మోదీని ఓసారి అడిగితే- 'కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాలని కాదు. దిల్లీ నాయకత్వాన్ని రుద్దే కాంగ్రెస్ సంస్కృతి పోవాలన్నది నా ఉద్దేశం' అంటూ వివరించారు. యాదృచ్ఛికమో మరేమిటోగాని ఇప్పుడు భాజపా సైతం అదే బాటలో పయనిస్తోంది. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఆ పార్టీ నేతల నోట ఒకటే మంత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ! ఆయన పేరుబలంతో పార్లమెంటు ఎన్నికల్లో భారీగా వస్తున్న ఓట్లను చూసి శాసనసభల ఎన్నికలకూ ఇదే మంత్రం పఠిస్తున్నారు కమలనాథులు. దీన్ని గమనిస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికీ ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పేరిట ఓట్లడిగిన సంగతి ఎవరికైనా గుర్తుకొస్తే తప్పేమీ లేదు! ఆ కాలపు ఓటర్ల ఆలోచనలకు, ఈనాటి ప్రజల ఆకాంక్షలకు ఓ మౌలిక భేదం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ఒకరకంగా, అసెంబ్లీ ఎన్నికలకు మరోరకంగా ఓటర్లు స్పందిస్తున్నారు. బంగాల్ పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు గణనీయమైన సంఖ్యలో సీట్లిచ్చిన వాళ్లే, అసెంబ్లీకొచ్చేసరికి అంత ఉత్సాహంగా ఆ పార్టీకి మద్దతు పలకలేదు. దిల్లీలోనూ ఇదే జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభతో పాటు ఒడిశా శాసనసభకు ఎన్నికలు జరిగితే, కేంద్రంలో భాజపాను బలపరచిన ఓటర్లు రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ను గెలిపించారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ విజ్ఞతను రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయా అన్నది ఆసక్తికరం!
ఇవీ చదవండి:ప్రజల తీర్పును స్వాగతిస్తాం: కాంగ్రెస్
ఇదీ చదవండి:కాంగ్రెస్కు మళ్లీ నిరాశే- ఇలా ఇంకెంత కాలం?
రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం లేకపోతే ఏమవుతుందో బిహార్ ఎన్నికలే చాటిచెప్పాయి. ఆ రాష్ట్ర శాసనసభలో భాజపాకు అత్యధిక సీట్లున్నప్పటికీ సమర్థుడైన సారథి లేడు! ఫలితంగా ముఖ్యమంత్రి పీఠం చేతిలో ఉన్నా, అధిరోహించలేని అశక్తత! కూటమి ధర్మం పేరిట దాన్ని నీతీశ్కుమార్కు అప్పగించాల్సి వచ్చింది. స్థానికంగా సమర్థ నాయకత్వాలను తయారు చేసుకోలేకపోవడం భాజపా బలహీనత. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినదించి, ఆ లక్ష్యాన్ని దాదాపుగా సాధించి, రెండు సీట్ల నుంచి అద్వితీయ స్థితికి చేరిన ఆ పార్టీ మునుముందు ఇంకా బలంగా నిలవాలంటే మోదీ మంత్రాన్ని మించి ఎదగాల్సి ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ సంస్కృతికి కొనసాగింపుగా మారే ప్రమాదముంది! బంగాల్ ఎన్నిక నేర్పుతున్న పాఠం ఇదే.