కరోనా మహమ్మారి కర్కశ ముష్టిఘాతాలకు సొమ్మసిల్లిన దేశ ఆర్థిక సామాజిక ఆరోగ్య రంగాలకు ఉపశమనం ప్రసాదించడమే లక్ష్యమంటూ కేంద్రప్రభుత్వం తాజాగా మరో భారీ ప్యాకేజీ ఆవిష్కరించింది. పాత కొత్త పథకాల కదంబమైన సరికొత్త ఉద్దీపన చర్యల విలువ విత్తమంత్రి వివరణలో రూ.6.28 లక్షల కోట్లుగా లెక్కతేలింది. పదిహేను విభాగాల్ని సాంత్వనపరచే పేరిట తలపెట్టిన కసరత్తులో 90 శాతానికి పైగా- రెండు కీలక పద్దులదే. మొదటిది, ప్రభుత్వ గ్యారంటీలుగా ఇవ్వజూపిన రూ.2,67,500కోట్లు. చతికిలపడిన విద్యుత్ పంపిణీ రంగాన సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల మేర ప్రతిపాదించిన సంస్కరణల ఖాతా రెండోది. అయిదేళ్ల కాలావధిలో పట్టాలకు ఎక్కిస్తామంటున్న విద్యుత్ సంస్కరణల ద్వారా- కొవిడ్ సంక్షోభంతో చితికిపోయిన కీలక రంగాలు, కోట్లాది శ్రమజీవుల బతుకులు ఎలా తెప్పరిల్లేదీ అమాత్యులు వివరించలేదు!
కేంద్ర ప్రభుత్వ నూతన ప్యాకేజీ చూపులకు ఏపుగా ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం పొడుగునా సర్కారీ అదనపు వ్యయం రూ.60వేలకోట్లకు మించే అవకాశం లేనేలేదన్నది నిపుణుల విశ్లేషణ. వెరసి, ఈ ప్యాకేజీ నికర ప్రయోజనం జీడీపీలో కేవలం 0.3శాతానికి పరిమితం కానుండగా- సింహభాగం రుణ హామీలదేనంటే, ఉద్దీపన అరకొరేనన్నమాట! నిరుడు మే నెల రెండోవారంలో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన యోజన రూపేణా అంతిమంగా కలిగిన ప్రయోజనం అంతంతమాత్రమేనని పలు అధ్యయనాలు, విశ్లేషణలు నిగ్గుతేల్చాయి. పోయిన ఏడాదితో పోలిస్తే బ్యాంకు రుణాల్లో పెరుగుదల కేవలం 5.7 శాతమేనని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. అటువంటిదిప్పుడు అత్యవసర రుణహామీ పథకం కింద నిరుటి మూడు లక్షల కోట్లరూపాయల పరిమితిని ఇంకో లక్షన్నర కోట్ల రూపాయల మేర విస్తరించినా- బ్యాంకుల రుణ వితరణ మెరుగుపడనిదే కరోనా బాధిత వర్గాలు గట్టేక్కేదెలా? అసంఖ్యాక సంక్షుభిత జీవితాలు అంకెల గిమ్మిక్కులతో అమాంతం బాగుపడిపోవు!
నిరాశపరచిన గరీబ్ కల్యాణ్..