సరిగ్గా మూడున్నర దశాబ్దాల క్రితం- 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్లో సంభవించిన అణు ప్రమాదం మానవ చరిత్రలో ఒక విషమ ఘట్టం. అది మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదమే తప్ప అనుకోకుండా సంభవించినది కాదు. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగో రియాక్టర్లో సాంకేతిక నిపుణులు చేసిన ఒక ప్రయోగం వికటించి పెను విస్ఫోటానికి దారితీసింది. జపాన్లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణు బాంబులకన్నా ఎన్నో రెట్ల ఎక్కువ రేడియోధార్మికతను చెర్నోబిల్ అణు కేంద్రం విరజిమ్మింది. చెర్నోబిల్ ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్నా, అది పూర్వ సోవియట్ యూనియన్లో అంతర్భాగం. చెర్నోబిల్కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసులకు సైతం అణు దుర్ఘటన గురించి తెలియలేదంటే, అప్పటి సోవియట్ ప్రభుత్వం ఎంత గుంభనంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.
నిషిద్ధ మండలంలో సందర్శకులు
చెర్నోబిల్ విపత్తు గురించి సోవియట్ అధికారులు బయటి ప్రపంచానికి చెప్పకపోయినా, ప్రమాదకరమైన రేడియో ధార్మికత ఆనవాళ్లు ఎక్కడో ఉత్తరాన ఉన్న స్వీడన్తోపాటు పొరుగు దేశాల్లోనూ కనిపించడంతో విషయం బయటపడింది. పేలిన రియాక్టర్లో రేడియేషన్ దుష్ప్రభావం వల్ల దాదాపు 50 మంది ప్లాంట్ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న 3,50,000 మంది ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వారిలో దాదాపు 6,500 మంది తదుపరి సంవత్సరాల్లో థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చెర్నోబిల్ వాసుల సంతానానికి రేడియో ధార్మికత విష ప్రభావం సంక్రమించలేదని పరిశోధకులు తేల్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోని ప్రిప్యాత్ పట్టణంలోని 30,000 జనాభాను వెంటనే ఖాళీ చేయించడంతో, గడచిన మూడున్నర దశాబ్దాల నుంచి అది నిర్మానుష్యంగా మిగిలింది.
చెర్నోబిల్ చుట్టుపక్కల మొత్తం 2,600 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషిద్ధ మండలంగా ప్రకటించడంతో ఇప్పుడక్కడ ఎలుగు బంట్లు, తోడేళ్లు, అడవి గుర్రాలు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మానవ సంచారం మటుమాయమైనప్పుడు జంతుజాలం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి దీన్ని మహదవకాశంగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మానవులకన్నా జంతువులకు రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఎక్కువ. ఈ అంశాన్నీ శాస్త్రజ్ఞులు శోధిస్తున్నారు. చెర్నోబిల్ అణు కేంద్రంపై కాంక్రీటు గోరీ కట్టే పని 2019లో పూర్తయింది. గోరీ లోపల అణు కర్మాగార శిథిలాలను తొలగించే పనిని రోబోలు చేస్తున్నాయి. చెర్నోబిల్ ప్లాంట్ నుంచి ఇప్పటికీ రేడియో ధార్మికత వెలువడుతున్నా, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది. శాస్త్రజ్ఞులు పరిశోధనలు కొనసాగించడానికి, పర్యాటకులు వచ్చిపోవడానికి అదేమీ అడ్డుకాదు.