కొవిడ్ మహమ్మారి కట్టడికి విస్తృత పరీక్షలొక్కటే మార్గమని డబ్ల్యూహెచ్ఓ ఉద్బోధించి సరిగ్గా మూడునెలలైంది. దరిమిలా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో ఇండియా ప్రామాణిక టెస్ట్ కిట్ల సేకరణ, అభివృద్ధిపై దృష్టి సారించినా- ఇప్పటికీ రోజుకు లక్షన్నర రోగ నిర్ధారణ పరీక్షలే చెయ్యగలుగుతోంది. కొవిడ్ రోగులు కోలుకొంటున్న రేటు 52.47 శాతానికి చేరడం ఊరట కలిగిస్తున్నా- రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల నడినెత్తిన ఎత్తిన కత్తిలా కరోనా ఉరుముతున్న నేపథ్యంలో వారికి పరీక్షలు జరపకపోవడం నిర్వేదం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రోగాలతో బాధపడుతున్న 170 కోట్ల మంది (20శాతానికిపైగా) కొవిడ్నుంచి పెనుముప్పు ఎదుర్కొంటున్నట్లు 'లాన్సెట్' అధ్యయనం ఎలుగెత్తుతున్న తరుణంలో ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ డైరెక్టర్ సూచనలు ఎంతో విలువైనవి.
యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు అవసరం
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో విస్తృత పరీక్షల ద్వారానే కరోనా అదుపులోకి వచ్చిందంటూ ఇండియా రోజుకు పదిలక్షల పరీక్షలు జరపాల్సిన అవసరాన్ని సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా ప్రస్తావించారు. ప్రస్తుతం కొవిడ్ నిర్ధారణకు ఉపయోగిస్తున్న ఖరీదైన ఆర్టీ- పీసీఆర్ యంత్రాలు పరిమిత సంఖ్యలో ఉండటం, పరీక్షలకు ఉపయోగించే ప్రోబ్స్ను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని, దానికి చౌకైన ప్రత్యామ్నాయంగా సీసీఎంబీ- నెస్టెడ్ పీసీఆర్ యంత్రాల్ని అభివృద్ధి చేసినా ఐసీఎంఆర్ వాటిని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందనీ చెబుతున్నారు. మరోవంక నిమ్స్, ఈఎస్ఐ, టాటా శాస్త్రవేత్తలు ఆర్టీ-ల్యాంప్ పేరిట అరగంటలోనే ఫలితాన్ని తేల్చే మరో ప్రామాణిక ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. దక్షిణ కొరియా సంస్థ సారథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే న్యూ యాంటిజెన్ టెస్టింగ్ కిట్కు ఐసీఎంఆర్ తాజాగా ఆమోదం తెలిపింది. కొవిడ్పై పోరు గెలవాలంటే మేలిమి స్థానిక పరీక్షా విధానాల్ని విస్తృతంగా వినియోగించి యుద్ధ ప్రాతిపదికన కదలడం తప్పనిసరి!
ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేలా..