'మానవ హక్కులు, గౌరవ మర్యాదలను పరిరక్షించడమే చట్టబద్ధమైన పాలన అంతస్సూత్రం. అది పూర్తిగా అమలులోకి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ జీవితాంతం ఆ లక్ష్యసాధన కోసమే పరిశ్రమించారు సొలీ జహంగీర్ సొరాబ్జీ. తొమ్మిది పదుల వయసులో కొవిడ్తో పోరాడి అలసి ఆఖరి శ్వాస విడిచిన ఈ 'పద్మవిభూషణుడు'.. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భారతీయ దిగ్గజ న్యాయవాదుల్లో ఒకరు. 'తమకు తెలిసిందే సత్యమని, తామే జ్ఞానకోవిదులమని ప్రతి ఒక్కరూ భావిస్తారు. తమ అభిప్రాయాలతో విభేదించిన వారి గొంతులను నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యానికి ఇది శ్రేయస్కరం కాదు' అని హెచ్చరించారాయన. రాజ్యాంగ స్ఫూర్తికి గొడుగుపడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఎన్నో విశిష్ట తీర్పుల వెనక ఈ వరిష్ఠ న్యాయకోవిదుడి దీక్షాసంకల్పం ద్యోతకమవుతుంది.
బొంబాయి నుంచి హేగ్ వరకు
పరపీడనను నిరసిస్తూ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహానికి సంసిద్ధమవుతున్న వేళ.. 1930 మార్చి 9న బొంబాయిలో ఓ పార్శీ కుటుంబంలో జన్మించారు సొలీ సొరాబ్జీ. ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను పూర్తిచేసి, 1953లో వృత్తిజీవితం ప్రారంభించారు. కళాశాల విద్యార్థిగా 'కిన్లాక్ ఫోర్బ్స్' స్వర్ణ పతకాన్ని అందుకున్న ఆయన.. న్యాయవాదిగానూ అదే ప్రతిభ కనబరచారు. 1971లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన సొరాబ్జీ.. 1977-80 మధ్య భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పదవిలోకి రావడానికి నాలుగేళ్ల ముందే కేశవానంద భారతి కేసు ద్వారా ఆయన పేరు దేశమంతటి మార్మోగింది.
అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ..
'రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించగలదు కానీ, దాని మౌలిక స్వరూపాన్ని మార్చజాలదు' అన్న చరిత్రాత్మక తీర్పు వెలువడటానికి కారణమైన ఈ కేసులో అప్పటి న్యాయవాద దిగ్గజాలు నానీఫాల్కీవాలా, ఫాలీ నారిమన్లతో కలిసి సొరాబ్జీ వాదనలు వినిపించారు. 1989-90, 1998-2004 మధ్యకాలంలో భారత అటార్నీ జనరల్గా వ్యవహరించిన ఆయన.. అంతర్జాతీయ న్యాయస్థానంలో(ఐసీజే) పాకిస్థాన్ వాదనలను ఖండించి భారత్ను గెలిపించారు. నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిని పరిశీలించడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా వెళ్ళడం నుంచి మానవ హక్కుల సంరక్షణపై ఐరాస ఏర్పరచిన ఉపసంఘానికి అధ్యక్షత వహించడం, హేగ్లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానం సభ్యుడిగా ఆరేళ్ల పాటు కొనసాగడం వరకు అంతర్జాతీయంగా సొరాబ్జీ అందించిన సేవలు- దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశాయి.
'ప్రజల భావ వ్యక్తీకరణ హక్కును పరిరక్షించడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం. భారత రాజ్యాంగం పౌరులకు ఆ భరోసానిస్తోంది.'
- సొలీ జహంగీర్ సొరాబ్జీ