తెలంగాణ

telangana

తొలి అణ్వస్త్ర పరీక్ష 'ట్రినిటీ'కి 75 ఏళ్లు

By

Published : Jul 16, 2020, 7:07 AM IST

ఆంగ్లంలో త్రిమూర్తులను ట్రినిటీ అనవచ్ఛు. ప్రపంచంలో తొలిసారి 1945 జులై 16న అమెరికా జరిపిన అణ్వస్త్ర పరీక్షకు ట్రినిటీ అని నామకరణం చేయడం కాకతాళీయం కాదు. అణు పరీక్ష విస్ఫోటన జ్వాలను చూసి ప్రధాన అణ్వస్త్ర సృష్టికర్త రాబర్ట్‌ ఒపెన్‌ హీమర్‌ భగవద్గీత శ్లోకాన్ని పఠించడం దీనికి నిదర్శనం. 1945 ఆగస్టు ఆరున జపాన్‌లోని హిరోషిమా నగరంపైన, ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపైన అమెరికా ప్రయోగించిన అణ్వస్త్రాల విలయ నర్తనంలో లక్షలమంది స్త్రీ, పురుష, బాల, వృద్ధులు హతమారిపోయారు.

75 years for first nuclear weapon test
తొలి అణ్వస్త్ర పరీక్ష 'ట్రినిటీ'కి 75ఏళ్లు

సృష్టి, స్థితి, లయాలు విశ్వప్రవృత్తి అని, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆ గుణాలకు అధిపతులని హిందువులు నమ్ముతారు. ఆంగ్లంలో ఈ త్రిమూర్తులను ట్రినిటీ అనవచ్ఛు ప్రపంచంలో తొలిసారి 1945 జులై 16న అమెరికా జరిపిన అణ్వస్త్ర పరీక్షకు ట్రినిటీ అని నామకరణం చేయడం కాకతాళీయం కాదు. అణు పరీక్ష విస్ఫోటన జ్వాలను చూసి ప్రధాన అణ్వస్త్ర సృష్టికర్త రాబర్ట్‌ ఒపెన్‌ హీమర్‌ భగవద్గీత శ్లోకాన్ని పఠించడం దీనికి నిదర్శనం. 'కాలోస్మి లోక క్షయకృత్‌ ప్రవృద్ధో లోకాఁ సమహర్తం ఇహ ప్రవృత్తః' అంటూ సాగే ఆ శ్లోకం అర్థం- 'నేను కాలుడిని, లోక క్షయా కారకుడిని'. అగ్రరాజ్య స్థితిని చాటుకోవడానికి అమెరికా సృష్టించిన అణు బాంబు నెల తిరక్కుండానే లయాన్ని సృష్టించి రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికింది. 1945 ఆగస్టు ఆరున జపాన్‌లోని హిరోషిమా నగరంపైన, ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపైన అమెరికా ప్రయోగించిన అణ్వస్త్రాల విలయ నర్తనంలో లక్షలమంది స్త్రీ, పురుష, బాల, వృద్ధులు హతమారిపోయారు. అసలు అప్పటికే చిత్తుగా ఓడిపోయిన జపాన్‌పై అణ్వస్త్ర ప్రయోగం అనవసరమని, అవేమీ లేకుండానే ఆ దేశం లొంగివచ్చేదని చరిత్రకారులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.

అగ్రరాజ్య హోదా కోసం అర్రులు

యుద్ధానంతరం ప్రపంచంలో ఏ దేశమూ అమెరికాను తేరిపారచూడటానికి సాహసించలేని స్థితిని సృష్టించాలనే లక్ష్యంతో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ లయకారుడి అవతారమెత్తారు. అమెరికాను అజేయ అగ్రరాజ్యంగా నిలపాలన్న ట్రూమన్‌ తపన మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. సోవియట్‌ యూనియన్‌ తానేమీ తక్కువ తినలేదని అణ్వస్త్ర పరీక్షలు, ఆపైన హైడ్రోజన్‌ బాంబు పరీక్షలూ జరిపింది. అణు పాటవంలో తామే మిన్న అనిపించుకోవడానికి రెండు అగ్రరాజ్యాలు దశాబ్దాల తరబడి పోటాపోటీగా అణ్వస్త్రాలు సమకూర్చుకున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఈ రెండు అగ్ర రాజ్యాల వద్ద 68,000 అణ్వస్త్రాలు పోగుపడ్డాయి. అగ్రరాజ్యాల తరవాత బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఉత్తర కొరియాలు అణ్వస్త్ర రాజ్యాలుగా అవతరించాయి. వ్యూహపరమైన అస్త్రాల తగ్గింపునకు 2010లో కుదిరిన నూతన 'స్టార్ట్' ఒప్పందం కింద 2019నాటికి అమెరికా, రష్యాలు తమ అణ్వస్త్ర నిల్వలను భారీగా తగ్గించుకొన్నాయి. అయినా నేడు ప్రపంచంలోని తొమ్మిది అణ్వస్త్ర దేశాల వద్ద కలిపి మొత్తం 13,400 అణ్వస్త్రాలు ఉంటే, వాటిలో 90 శాతం పైగా (12,170) అమెరికా, రష్యాల అణు తూణీరాల్లోనే ఉన్నాయని స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి శోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు తమ దగ్గరున్న అణ్వస్త్రాల్లో 1,800 అస్త్రాలను క్షణాల్లో ప్రయోగించడానికి తయారుగా ఉంచాయి. శత్రువు దెబ్బతీసేవరకు ఆగకుండా తామే తొలివేటు వేసే అవకాశాన్ని అమెరికా, రష్యాలు అట్టిపెట్టుకున్నాయి. 2010నాటి నూతన 'స్టార్ట్‌' ఒప్పందం 2021 ఫిబ్రవరిలో ముగియనున్నా దాన్ని పొడిగించడానికి ఎవరూ చొరవ తీసుకోవడం లేదు.

అసలు ఇప్పుడున్న అణ్వస్త్రాలకే భూమండలాన్ని ఎన్నోసార్లు భస్మీపటలం చేసే శక్తి ఉన్నా.. రష్యా, అమెరికాలు పాత అణ్వస్త్రాల స్థానంలో సరికొత్త మహా విధ్వంసకర అణ్వాయుధాల తయారీకి వందల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాయి. క్షిపణులు, విమానాలు, జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర ప్రయోగానికి సై అంటున్నాయి. రేపు అంతరిక్షమూ అస్త్ర ప్రయోగ వేదికగా మారుతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఈ పోటీలో చైనా సైతం తక్కువ తినలేదు. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో అణు ప్రయోగ సత్తాను సాధించింది. భారత్‌, పాకిస్థాన్‌లు ఇదే సామర్థ్యాన్ని సంతరించుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ భయానక పరిస్థితిలో విజ్ఞులు, శాస్త్రజ్ఞులు, సామాన్య ప్రజలు అణ్వస్త్ర నిషేధానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు. అణు ప్రళయం ఈ రోజు అర్ధరాత్రి సంభవిస్తుందనుకుంటే, ఆ విలయానికి ప్రపంచం కేవలం 100 సెకనుల దూరంలో ఉందని ఈ ఏడాది ప్రచురితమైన ప్రపంచ అణు శాస్త్రజ్ఞుల బులెటిన్‌ హెచ్చరించింది. దీనికన్నా 1991 సంవత్సరంలో పరిస్థితే నయం. అప్పట్లో అమెరికా, రష్యాలు తమ అణ్వస్త్ర బలగాలను తగ్గించుకోవడానికి చర్చలు జరిపేవి కాబట్టి అణు విలయానికి 17 నిమిషాల వ్యవధి ఉండేదని ఇదే బులెటిన్‌ తెలిపింది.

అణు ప్రళయాన్ని నివారించాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెంచడం ఎంతో ఆవశ్యకం. ఇలాంటి ఒత్తిడి వల్లనే 1970లో అణ్వస్త్ర నిషేధ ఒప్పందం (ఎన్‌పీటీ) కుదిరింది. అన్ని అణ్వస్త్ర దేశాలూ త్వరగా అణు నిరాయుధీకరణను సాధించాలన్నది ఆ ఒప్పంద సారాంశం. కానీ, అది చిత్తశుద్ధిగా అమలయింది లేదు. 1995లో ఎన్‌పీటీని నిరవధికంగా పొడిగించారు. 1996లో కుదిరిన సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందంపై 184 దేశాలు సంతకాలు చేసినా, అది ఇంకా అమలులోకి రాలేదు. పైగా చైనా, రష్యాలు రహస్యంగా అణు పరీక్షలు జరిపాయంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు తానూ అదే బాట పడతానని హెచ్చరిస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత ప్రపంచీకరణ తగ్గుముఖం పడుతూ, ప్రధాన దేశాల్లో ఉదారవాద ప్రజాస్వామ్యాలు బలహీనపడుతూ వచ్చాయి. ప్రస్తుతం అనేక దేశాల్లో మితవాదులు అధికారంలోకి వచ్చి దుందుడుకు పంథా అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రానున్న 30 ఏళ్లలో అణ్వస్త్ర ఆధునికీకరణ కార్యక్రమంపై లక్షన్నర కోట్ల డాలర్లు ఖర్చు చేస్తానంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనున్న 2010నాటి కొత్త 'స్టార్ట్‌' ఒప్పందాన్ని పొడిగించడానికి ససేమిరా అంటున్నారు. ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని నిలువరించడానికి 2015లో ప్రధాన రాజ్యాలతో కలిసి కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలగారు. ఐరోపా ఖండంలో మధ్యశ్రేణి అణ్వస్త్ర బలగాల నియంత్రణ ఒప్పందా (ఐఎన్‌ఎఫ్‌)న్ని రష్యా అతిక్రమిస్తోందంటూ దాన్నీ తుంగలో తొక్కారు. తనకు పూర్వ అధ్యక్షులందరూ అణ్వస్త్ర నిరాయుధీకరణకు ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుంటూ రాగా, ట్రంప్‌ వాటన్నింటికీ నీళ్లొదులుతున్నారు. అలాగని అన్నింటికీ అమెరికానే నిందించడమూ సమంజసం కాదు.

అందరూ బాధ్యులే

చైనా వద్ద ఉన్న 320 అణ్వస్త్రాలను నియంత్రించడానికి చర్చలు జరుపుదామని అమెరికా పలుమార్లు ప్రతిపాదించినా.. బీజింగ్‌ ససేమిరా అన్నది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌లదీ అదే పంథా. భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాలు కూడా తమ అణ్వస్త్రాలపై బయటివారి పర్యవేక్షణను అనుమతించేది లేదన్నాయి. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర సహిత దేశాలు రెండేళ్లకు ఒకసారి సమావేశమై, తాము ఫలానా సంఖ్యలో అణ్వస్త్రాలు తగ్గించుకుంటామని స్వచ్ఛందంగా ప్రకటించి, దానికి బద్ధులై ఉంటే క్రమంగా అణు నిరాయుధీకరణ సాధించవచ్ఛు అలాగే అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫాన్స్‌లూ తమ అణు బలగాలను ఇక పెంచేది లేదని అంగీకారానికి రావాలి. అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని అందరితోపాటు అమెరికన్‌ ప్రజలూ కోరుకుంటున్నారు. కరోనా వైరస్‌, ఉగ్రవాదాల తరవాత అణుయుద్ధ ప్రమాదాన్ని తీవ్రమైనదిగా అమెరికన్‌ ప్రజానీకం భావిస్తున్నట్లు 2020 మార్చిలో ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ సర్వేలో తేలింది. ఈ ఏడాది నవంబరు అధ్యక్ష ఎన్నికల తరవాత అమెరికన్‌ ప్రజాభీష్టాన్ని కొత్త ప్రభుత్వం, పార్లమెంటు ఏ మేరకు నెరవేర్చగలవో చూడాలి. ప్రపంచంలో తొలి అణ్వస్త్ర పరీక్ష జరిగి 75 ఏళ్లయింది. మరో 75 ఏళ్లపాటు మన నెత్తి మీద అణ్వస్త్ర కత్తి వేలాడుతూ బతకాల్సిందేనా లేక ఈ సమస్యకు చరమ గీతం పాడగలమా అన్నది కీలక ప్రశ్న!

- కైజర్‌ అడపా

ABOUT THE AUTHOR

...view details