మ్యాంగో చుండా (లేక) ఆమ్ చుండా !
గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉండే 'సైడ్ డిష్' ఇది. కొంచెం తీపి, పులుపు, ఇంకా కారం కలగలిసిన ఈ వంటకం నోరూరించే రుచినిస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం !
కావాల్సినవి :
పచ్చి మామిడి తరుగు : రెండు కప్పులు (అసలు పండకూడదు)
పసుపు : అర టీ స్పూన్
ఉప్పు : రెండు టీ స్పూన్లు
చక్కెర : రెండున్నర నుండి మూడు కప్పులు
కారం : రెండు టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్
ముందుగా :
* మామిడి కాయని శుభ్రంగా కడిగి తొక్కు తీయాలి.
* తరుగు చిన్నగా కాకుండా పెద్దగా వచ్చేలా తురుముకోవాలి.
* తర్వాత అంచనా కోసం ఈ తరుగుని రెండు కప్పులకు వచ్చే విధంగా ఒత్తి పెట్టుకోవాలి.
తయారు చేసే విధానం !
* తురిమిన మామిడిని వండే గిన్నెలోకి తీసుకుని పసుపు, ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని పావుగంట నుండి ఇరవై నిమిషాల పాటు మూతపెట్టి ఉంచుకోవాలి.
* ఇరవై నిమిషాల తర్వాత తురుము మెత్తబడుతుంది. అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల చక్కెర కలుపుకుని గరిటతో చక్కెర కరిగేలా బాగా తిప్పాలి. తర్వాత మళ్లీ రెండు స్పూన్ల చక్కెర కలిపి మొత్తం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి.
* ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట మీద గిన్నెని ఉంచి, మిగిలిన చక్కెర ఏమైనా ఉంటే కరిగే వరకు తిప్పాలి. ఈ సమయంలో నోరూరించే పాకం గిన్నెలో కనిపిస్తుంది.
* కొంత సమయానికి పాకం ముదిరి బుడగలు రావడం మొదలవుతుంది. అప్పుడు స్టవ్ కట్టేసి గిన్నె దించుకోవాలి.
* మిశ్రమం మొత్తం చల్లబడ్డాక కారం, జీలకర్ర పొడి చల్లుకుని బాగా కలపాలి. ఇప్పుడు మీకు కావల్సిన మ్యాంగో చుండా సిద్ధంగా ఉన్నట్లే. దీనిని పొడి గ్లాస్ జార్లో పెట్టుకుంటే పరోటా, కిచిడీ వంటి ఏ వంటకంలోనైనా చట్నీలా నంచుకుని తినొచ్చు.
మంగై రసం !
దక్షిణాది రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం ఈ మంగై రసం. దీనినే 'రా మ్యాంగో రసం' అంటారు. మంచి రుచి, సువాసన కలిగిన ఈ రసాన్ని తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.
తయారీ : ఇద్దరి కోసం
కావాల్సినవి :
టమాటాలు : 20 గ్రాములు
కందిపప్పు : 5 గ్రా
పచ్చి మామిడి : 50 గ్రా.
ఉప్పు : 2 గ్రా.
కరివేపాకు : 15 గ్రా.
ఎండుమిర్చి : 1
నల్ల మిరియాలు : 1 గ్రా.
ధనియాలు : 1 గ్రా.
జీలకర్ర : 1 గ్రా.
అల్లం : 2 గ్రా.
వెల్లుల్లి : 2 గ్రా.
ఆవాలు : 1 గ్రా.
పసుపు : 1 టేబుల్ స్పూన్.
నూనె : 1 టేబుల్ స్పూన్.
తయారీ విధానం :
* ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్రని వేయించుకుని పొడి చేసుకోవాలి. ఇదే రసం పౌడర్.
* తర్వాత పచ్చిమామిడిని నీటిలో బాగా ఉడికించి గుజ్జుని పిండుకోవాలి.
* మరోవైపు కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
* ఈలోపు టమాటా ముక్కలకి అల్లం, వెల్లుల్లి ఇంకా రసం పౌడర్ కలుపుకుని బాగా ఉడికించాలి. తర్వాత దాన్ని వడకట్టి మామిడి గుజ్జుని, ఉడికించిన కందిపప్పుని కలుపుకోవాలి.
* ఇప్పుడు మూకుట్లో నూనె పోసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. దీనిని టమాటా, మామిడి గుజ్జు రసంలో వేసి సరిపోయినంత ఉప్పు కలుపుకుంటే మంగై రసం సిద్ధం.
కార్న్ అండ్ రా మ్యాంగో సలాడ్ !
ఇప్పటి వరకు ఎన్నో సలాడ్స్ చూసుంటారు. అయితే వాటిలో దీని ప్రత్యేకతే వేరు. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటూ కరకరమనే ఈ సలాడ్ ఎలా ఉంటుందో చెప్పేకంటే తిని చూడాల్సిందే. మరింకెందుకు ఆలస్యం... ఎలా చేయాలో చూద్దాం రండి !
తయారీ : ఇద్దరికి
కావాల్సినవి :
మొక్కజొన్న గింజలు : 1 కప్పు
ఉల్లిపాయలు : 1 టేబుల్ స్పూన్
ఉల్లి ఆకుల తురుము : 3 టేబుల్ స్పూన్లు
ఎర్ర క్యాప్సికం : సగం
పచ్చి మామిడి (తరిగిన) : 1 టేబుల్ స్పూన్
ఆకు కూర కొమ్మ (ఏదైనా) : అర టేబుల్ స్పూన్
చెర్రీలు : ఆరు
పైనాపిల్ ముక్కలు : ఒక టేబుల్స్పూన్
కొత్తిమీర : 1 టేబుల్ స్పూన్
తులసి ఆకులు : 4
నల్లటి ఆలివ్ పండ్లు : 7-8
నిమ్మరసం : 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ : 1 టేబుల్ స్పూన్
తెల్ల మిరియాల పొడి : అర టేబుల్ స్పూన్
టాకో షెల్స్ (మెక్సికన్ చిప్స్) : 3-4
తయారీ విధానం :
* ముందుగా మొక్కజొన్న గింజలను ఉప్పు నీటిలో లేత రంగు వచ్చేలా ఉడకబెట్టాలి (మరీ ఎక్కువగా ఉడకబెట్టకూడదు)
* తర్వాత వాటిని వేరే గిన్నెలో వేసి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
* ఇప్పుడు ఉల్లిపాయల్ని, ఉల్లి ఆకులని, ఎరుపు క్యాప్సికంని, పచ్చి మామిడిని, పైనాపిల్ని, ఆకుకూరని ఒకే సైజ్లో కట్ చేసి పెట్టుకోవాలి.
* తర్వాత చెర్రీ ఫ్రూట్స్ని సగానికి కట్ చేసుకుని కొత్తిమీర, తులసి ఆకులని జతచేసుకోవాలి.
* రుచి కోసం కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని చల్లుకోవాలి.
* చివరగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకుంటే కార్న్ అండ్ రా మ్యాంగో సలాడ్ తయారైనట్లే
* దీనిని టాకో షెల్స్తో జత కలుపుకుని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది.
మ్యాంగో అండ్ మింట్ ఖీర్ !
పండగలకి, ప్రత్యేక రోజులకి ఇంట్లో ఎక్కువగా చేసే పాయసం రెండే రకాలు. ఒకటి చక్కెర పొంగలైతే రెండోది సేమియా పాయసం. ఈ వేసవికి ఈ రెండూ మానేసి చక్కగా ఈ మ్యాంగో అండ్ మింట్ ఖీర్తో డిఫరెంట్ టేస్ట్ని పొందండి ! మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం రండి !
ఎంతమందికి : 6
కావాల్సినవి :
పాలు : రెండున్నర కప్పులు
బాస్మతి రైస్ : 1 కప్పు
చక్కెర : 3 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు : చిటికెడు
మామిడి గుజ్జు : 1 కప్పు
బాదం పప్పు : 7-8 (తరిగినవి)
ఎండు ద్రాక్ష : 10-15
పుదీనా ఆకులు : 6-7
యాలకులు : 3-4
లవంగాలు : 2-3
తయారు చేసే విధానం :
* మూకుట్లో పాలు, బాస్మతి రైస్, చక్కెర వేసుకుని కలుపుకోవాలి.
* కొన్ని నిమిషాలకి కుంకుమ పువ్వు పొడిని కలుపుకుని బాగా తిప్పాలి.
* మొత్తం ఉడికిన తర్వాత మామిడి గుజ్జుని కలుపుకుని బాదం తరుగు, ఎండు ద్రాక్ష, ఇంకా పుదీనా అకులను చల్లుకోవాలి.
* చివరిసారిగా మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టుకోవాలి.
* బాస్మతి రైస్ బాగా ఉడికి, ముదురు పాకం వచ్చే వరకు మంటని చిన్నగా పెట్టుకోవాలి.
* చివరగా యాలకులను కలిపి ఒక బౌల్లో వేసుకుని బాదం పప్పుని పైన చల్లుకోవాలి.
* ఇక దీనిని కాసేపు ఫ్రిజ్లో పెట్టుకుంటే మ్యాంగో అండ్ మింట్ ఖీర్ రడీ!