తెలంగాణ

telangana

చరవాణితో జాగారం..ఒంటికి హానికరం

ప్రస్తుత కాలంలో చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేని వారు కనిపించడం చాలా అరుదు. అదే మొబైల్‌ ఇప్పుడు ఎంతోమందిని నిద్రకు దూరం చేస్తోందంటే నమ్ముతారా? అవును.. ఇది నిజం. ‘స్లీప్‌ అండ్‌ హోం సొల్యూషన్స్‌’ ఉపకరణాలను రూపొందించే అంకుర సంస్థ ‘వేక్‌ఫిట్‌.కో’ తన నాలుగో వార్షిక అధ్యయనం ‘గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌కార్డ్‌- 2021(జీఐఎస్‌ఎస్‌)’ హైదరాబాదీల నిద్ర అలవాట్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఏటా 18 ఏళ్ల వయసు దాటిన వారిపై ఈ అధ్యయనం జరుపుతోంది.

By

Published : Apr 16, 2021, 6:57 AM IST

Published : Apr 16, 2021, 6:57 AM IST

sleeping-less-is-injurious-to-health
చరవాణితో జాగారం..ఒంటికి హానికరం

హైదరాబాదీలు పడుకునే ముందు వరకూ 94 శాతం మంది మొబైల్‌ ఫోన్లతోనే గడుపుతున్నట్లు వేక్‌ఫిట్‌.కో తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య 91 శాతంగా ఉంది. ఈ అధ్యయనం ప్రకారం.. సుమారు 80 శాతం మంది వారానికి ఒకటి నుంచి మూడు రోజులు నిద్రమబ్బుతోనే పని చేస్తున్నట్లు తేలింది. 26 శాతం మంది అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్‌, లాప్‌టాప్‌లలో సినిమాలు చూశామని చెప్పారు. 16 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌, లాప్‌టాప్‌లతో బెడ్‌పైనే ఉండి పని చేసినట్లు వెల్లడించారు. 40 శాతం మంది వెన్నునొప్పితో బాధ పడుతున్నారని, 90 శాతం మంది కంటే ఎక్కువ మంది రాత్రి సమయాల్లో ఒకటి లేదా రెండు సార్లు మేల్కొంటారని అధ్యయనంలో తేలింది. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది.

నాణ్యతపై తీవ్ర ప్రభావం..

2020 నుంచి నిద్ర సంబంధిత నాణ్యత క్షీణిస్తున్నట్లు జీఐఎస్‌ఎస్‌ అధ్యయనం సూచిస్తోంది. నాణ్యమైన నిద్రకు మూడు అంశాలు తోడ్పడతాయని నగరవాసులు భావిస్తున్నట్లు ఈ అధ్యయనం వివరించింది. మెరుగైన పరుపులతో సుఖ నిద్రకు అవకాశం ఉందని 38 శాతం మంది, నిద్రించే ముందు లాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ వాడకపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని 32 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. క్రమబద్ధమైన నిద్ర అలవాట్లను మెరుగుపరుచుకోవడం సత్ఫలితాలనిస్తుందని మరో 28 శాతం మంది భావిస్తున్నారు.

దీర్ఘకాలిక రుగ్మతలకు అవకాశం ఎక్కువ: చైతన్య రామలింగె గౌడ, వేక్‌ఫిట్‌.కో సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్‌

‘‘నిద్ర పోయే ముందు వరకు యువత స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడం వల్ల అర్ధరాత్రి వరకు పనిచేసే వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. నిద్ర అలవాట్లు క్రమపద్ధతిలో లేకపోతే దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.’’

ఇదీ చూడండి:ఒక్కరోజు నిద్ర లోపిస్తే...అది పక్కా వచ్చేస్తుంది..!

ABOUT THE AUTHOR

...view details