తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 7:01 AM IST

ETV Bharat / lifestyle

కొత్త లక్షణాలతో కరోనా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కరోనా కమ్ముకుంటోంది. రెండో విడతలో విరుచుకుపడుతోంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది దీని బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా వారికీ సులభంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో జనంలో ఎన్నో భయాలు నెలకొంటున్నాయి. కొందరైతే పాజిటివ్‌ వచ్చిన వెంటనే లక్షణాలతో పని లేకుండా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. చాలామందిలో వ్యాధి కంటే భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారంతో కరోనాపై రకరకాల అపోహలు నెలకొంటున్నాయి. ఎలాంటి మాస్క్‌ ధరించాలి? టీకా తీసుకున్నా పాజిటివ్‌ వస్తుందా? కొవిడ్‌ రోగులు వ్యాయామం చేయవచ్చా? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? తదితర అంశాలపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు. ఈ నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు.. వారు అందించిన విలువైన సూచనలు మీ కోసం..

corona-new-symptoms-and-safety-precautions
కొత్త లక్షణాలతో కరోనా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సెకండ్‌ వేవ్‌లో కొత్తకొత్త లక్షణాలు కన్పిస్తున్నాయి. వేటినీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రధాన లక్షణాలుంటే మాత్రం వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

* తీవ్ర జ్వరం
* పొడి దగ్గు

* గొంతు నొప్పి
* ముక్కు దిబ్బడ

* రుచి కోల్పోవడం
* వాసన గ్రహించలేక పోవడం
* ఆకలి లేకపోవడం
* తలనొప్పి, పట్టేసినట్లు ఉండటం
* ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* తీవ్రమైన నీరసం

* కాళ్లు, చేతులు, నడుము గుంజటం
* కళ్లు ఎర్రబడటం, కలక
* నాలుక గులాబీ రంగులోకి మారటం
* కడుపు నొప్పి

* వాంతులు
* విరేచనాలు

* కడుపు, కాళ్లు ఉబ్బటం
* జీర్ణకోశ సమస్యలు

* మతి మరుపు
* నిద్ర పట్టకపోవడం
* రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం
* కఫంలో రక్త చారికలు
* ప్లేట్‌లెట్లు తగ్గడం

ఇంట్లో ఒకరికి వస్తే..

ఇంట్లో ఒకరికి కరోనా వస్తే మిగిలిన అందరికీ కరోనా పరీక్షలు చేయాల్సిందే. అందరికీ పాజిటివ్‌ వస్తే కలిసే ఉండొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికే లక్షణాలు కనిపిస్తే ఆ ఒక్కరిని ఐసొలేషన్‌లో ఉంచి.. మిగతా వారు దూరం పాటించాలి. ఒకే గది ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఐసొలేషన్‌ కేంద్రంలో ఉంచాలి. లేదంటే ఇంట్లోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్‌ సోకిన వ్యక్తి మాస్క్‌ పెట్టుకొని బాత్‌రూం వినియోగించాలి. దానిని తర్వాత పూర్తిగా డెటాల్‌, శానిటైజర్లు, బాత్‌రూం క్లీనర్లతో శుభ్రంగా కడగాలి. పనిమీద బయటకు వెళ్లి ఇంటికి లోపలకు వచ్చే వారు సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే శానిటైజర్లు వినియోగించాలి. ఆఫీసులు, కార్యాలయాలు ఇతర పని ప్రదేశాల నుంచి వచ్చేవారు ఇంట్లోకి రాగానే నేరుగా బాత్‌ రూంలోకి వెళ్లి దుస్తులు తీసి వేరేగా ఉంచి స్నానం చేయాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులను ప్రత్యేకంగా ఉంచాలి. హాల్‌లో కూడా అందరూ దూరం పాటించాలి. ఒకరికి వైరస్‌ ఉన్నా ఇంట్లో మిగిలిన వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.

అన్నీ వేరుగా వెలుతురు ధారగా

కరోనా సోకిన వ్యక్తి వాడే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలి. డిస్పోజబుల్‌ పేట్లు, గ్లాసులు ఉపయోగించాలి. దుస్తులు ప్రత్యేకంగా వాడాలి. లక్షణాలు లేకపోయినా రెండు, మూడు వారాల వరకు వైరస్‌ ఉంటుంది. కాబట్టి కరోనా సోకిన వ్యక్తి బయట తిరగకూడదు. ఐసోలేషన్‌ రూంను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బట్టలు సబ్బు పెట్టి ఉతుక్కోవాలి. చేతులు తరచూ శానిటైజ్‌ చేసుకోవాలి. కొవిడ్‌ రోగులకు భోజనం అందించే వారు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. గదిలో కిటికీలు, తలుపులు తెరిచి ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కొవిడ్‌ రోగి వాడిన పదార్థాల అవశేషాలను డిస్పోజబుల్‌ బ్యాగ్‌లో ఉంచి జాగ్రత్తగా మూటగట్టి చెత్త బుట్టలో వేయాలి.

రివర్స్‌ ఐసొలేషన్‌లో

ఇంట్లో వృద్ధులు, తీవ్ర జబ్బులు ఉన్నవారు ఉంటే రివర్స్‌ ఐసొలేషన్‌లో ఉంచాలి. అంటే వారికి మిగతా వారే ఎడం పాటించాలి. ఒకవేళ వారు మన వద్దకు వచ్చినా.. మనం కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. అదికూడా 15 నిమిషాలకు మించి వారికి ఎదురుగా ఉండకూడదు.

వెంట ఉండాల్సినవి..

మాస్క్‌లు, శానిటైజరు, జింకు, విటమిన్‌ సి, డి3, పారాసిట్మాల్‌, పల్స్‌ఆక్సిమీటర్‌, డిజిటల్‌ థర్మామీటర్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి. వైద్యుల సూచనలతోనే విటమిన్లు వాడాలి. సొంతంగా వేసుకుంటే ఇతర రకాల సమస్యలకు దారి తీస్తాయి. హ్యాండ్‌ శానిటైజర్లు వాడేటప్పుడు గ్లౌజు అవసరం లేదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట ఎవరికి కరోనా ఉందో తెలియదు. కొన్ని రోజుల వరకు పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోకుండా కట్టడి చేయాలి.

అందరికీ ఆసుపత్రి అవసరం లేదు

90 శాతం మంది రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. వందలో ఒకరో, ఇద్దరికో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరం ఉంటుంది. అదేమీ సంజీవిని కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కూడా కొవిడ్‌ చికిత్సల ప్రొటోకాల్‌ నుంచి దీనిని తొలగించింది. అనవసర ప్రచారం వల్ల చాలామంది బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. అవసరం లేకుండా బయట తిరగకూడదు. ఒకవేళ సీరియస్‌ అయితే తరువాత బెడ్‌ దొరకదనే ఉద్దేశంతో చాలామంది ముందే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇది సరికాదు. రక్తంలో ఆక్సిజన్‌ 93, 92, 90 శాతానికి తగ్గి ఆయాసం ఉంటే... విపరీతమైన దగ్గు, తీవ్ర జ్వరం (102, 103 డిగ్రీలు) వారం కంటే ఎక్కువ ఉంటే ఆసుపత్రిలో చేరాలి. చేరితే ఏమైనా అవుతుందేమోనన్న భయం ఉంటే వైద్యులను సంప్రదించి ఓపీలోనే చికిత్స తీసుకోవచ్చు. లేదంటే ఇంటి నుంచే ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ తీసుకోవాలి. అన్ని ఆసుపత్రులు హోం ఐసోలేషన్‌ ప్యాకేజీలు అందిస్తున్నాయి.

-డాక్టర్‌ శివరాజ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌

ధైర్యమే రక్ష..

కొవిడ్‌ రోగులు చాలామంది వ్యాయామం చేస్తుంటారు. వాకింగ్‌ ఇతర శారీరక శ్రమ చేయడం సరికాదు. కొవిడ్‌ రోగులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఎలాంటి శారీరక శ్రమ వద్దు. వ్యాయామం వల్ల ఆయాసం ఇతర సమస్యలు పెరిగి కోలుకోవటానికి సమయం పడుతుంది. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు విశ్రాంతిలో ఉండాలి. అయితే రోజూ 30 నిమిషాలు మెడిటేషన్‌, ఇతర బ్రీతింగ్‌ వ్యాయామాలు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, శారీరక శ్రమ చేయడం లాంటివి వద్దు.

- డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు, ప్రముఖ వైద్యులు, నిమ్స్‌

మానసిక ప్రశాంతత కోసం

కొవిడ్‌ రోగుల్లో మానసిక ప్రశాంతత ముఖ్యం. ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యం కోల్పోకూడదు. భయం, ఆందోళన, కుంగుబాటు వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. దీంతో మానవ శరీరంపై వైరస్‌ మరింత దాడి చేస్తుంది. కరోనా పాజిటివ్‌ వచ్చినా.. మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి.

ఆ మాస్కులతో రక్షణ తక్కువే

మూడు లేయర్లు ఉన్న సర్జికల్‌ మాస్క్‌ పెట్టుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. చాలామంది ఇంట్లో వస్త్రాలతో మాస్క్‌లు కుట్టుకొని వాటినే వాడుతున్నారు. దీంతో పూర్తి స్థాయి రక్షణ ఉండదు. కానీ కొంతలో కొంత నయం. ఈ మాస్క్‌ పెట్టుకున్న వారిలో 35-45 శాతం మందిలో కరోనా సోకే ప్రమాదం ఉంది. అందరూ ఎన్‌-95 మాస్క్‌ పెట్టుకోవాల్సి అవసరం కూడా లేదు. ఐసీయూలు, కొవిడ్‌ వార్డులో తిరిగే వైద్యులు, వైద్య సిబ్బందికే వీటి అవసరం ఉంటుంది. సర్జికల్‌ మాస్క్‌ పెట్టుకొని దానిపై వస్త్రంతో తయారైన మాస్క్‌ పెట్టుకుంటే ఇంకా పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది.

-డాక్టర్ రమణప్రసాద్, శ్వాసకోశ వ్యాధి నిపుణులు

నిస్సత్తువ తగ్గాలంటే

వ్యాధి నిరోధక శక్తి పెంచే సమతుల్య ఆహారం అవసరం. ముఖ్యంగా విటమిన్‌ సి, బి12, డి కీలకం. నిమ్మ, దానిమ్మ, కమలాలు తదితర పండ్ల ద్వారా సి విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. మాంసకృత్తుల కోసం వారంలో రెండుసార్లు చికెన్‌, నిత్యం ఒక గుడ్డు తీసుకోవాలి. సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, చిరు ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. కరోనా సోకిన వారిలో మొదటి వారం రోజులపాటు నిస్సత్తువ ఉంటుంది. జ్వరం ఉంటే మాంసకృత్తులు జీర్ణం కావు. కాబట్టి ఆకలి వేసే వరకు రాగి, జొన్న, బియ్యంతో చేసిన జావలు, సలాడ్లు, సూప్‌లు, డ్రైఫూట్స్‌ ఇతర తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వీటివల్ల నిస్సత్తువ తగ్గుతుంది. డీహైడ్రేషన్‌ ప్రమాదం కూడా తప్పుతుంది. ఆకలి పెరిగిన తర్వాత అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవచ్చు. ఫలితంగా తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

విచ్చలవిడిగా విటమిన్లు వద్దు..

కరోనా రాకుండా విటమిన్లు, ఇతర పోషకాల కోసం చాలామంది మాత్రలు మింగుతుంటారు. వైద్యుల సూచనల మేరకు వాటిని తీసుకోవాలి. అవసరం లేకుండా విచ్చలవిడిగా విటమిన్‌ మాత్రలు వాడితే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

* గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతులో సమస్య ఉంటే పోతుంది. తల బరువుతోపాటు జలుబు లాంటివి ఉంటే రోజుకు కనీసం రెండుసార్లు 10-15 నిమిషాల చొప్పున ఆవిరి పట్టుకోవాలి. వారం రోజులపాటు చేయాలి.

అలా నెగెటివ్‌ వచ్చినా..

* ర్యాపిడ్‌ యాంటిజన్‌లో పాజిటివ్‌ వచ్చి... ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చినా తప్పనిసరిగా ఏడు రోజులపాటు హోంఐసొలేషన్‌లో ఉండాలి. అప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోతే మరోసారి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకొని వైద్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలి.

* వైరస్‌ సోకిందన్న అనుమానం వచ్చిన వెంటనే ఇల్లు, కార్యాలయాల్లో ఇతరులకు దూరంగా ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉంటూ మాస్క్‌ ధరించాలి. తొలుత ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్ష.. అందులో అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. చిన్న లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దు.

* రక్తంలో ఆక్సిజన్‌ 95 శాతం ఉండాలి. అంతకంటే తగ్గిందంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంతమాత్రాన వెంటిలేటర్‌పైకి వెళ్లినట్లు కాదు. వైద్యుల సూచనలతో ముందుకు వెళ్లాలి. ఆక్సిజన్‌తో పాటు ఇతర మందులు అందిస్తే తిరిగి కోలుకుంటారు. ఆక్సిజన్‌ 80 శాతానికి వచ్చినా.. చికిత్స తీసుకొని ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు.

వ్యాక్సిన్‌ వేయించుకున్నా వస్తుందా?

టీకాతో వంద శాతం రక్షణ లభించదు. వ్యాక్సిన్‌ తీసుకున్నా చాలామందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉస్మానియాలో పది మంది వైద్యులు రెండు డోసుల టీకా తీసుకున్నా కరోనా బారిన పడ్డారు. అయితే టీకా తీసుకున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పెద్దగా ఇబ్బందులు పడలేదు. స్వల్ప లక్షణాలతో కరోనా తగ్గిపోయింది. వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే మాస్క్‌లు విధిగా ధరించాలి. ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యువత నిర్లక్ష్యంగా ఉంటోంది. ప్రస్తుతం వారికి ఎక్కువగా కరోనా సోకుతోంది. ముఖ్యంగా 22-45 సంవత్సరాల మధ్య వయస్కులు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు వెంటిలేటర్‌ వరకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. పెద్దలే కాదు... ఇప్పుడు యువతా జాగ్రత్తగా ఉండాలి.

-డాక్టర్‌ నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా ఆసుపత్రి

టీకా ఇచ్చాక పెయిన్‌ కిల్లర్‌ వద్దు

టీకా తీసుకున్న వారిలో కొద్ది రోజుల పాటు వ్యాక్సిన్‌ వల్ల కరోనా పాజిటివ్‌ వస్తుందన్నది అపోహ మాత్రమే. టీకా తీసుకునే ముందే కొందరిలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చు. అయితే లక్షణాలు కనిపించడానికి అయిదు రోజుల నుంచి 14 రోజులు పడుతుంది. అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ ఉంటే వ్యాధి బయట పడుతుంది. వ్యాక్సిన్‌తో దీనికి సంబంధం లేదు. టీకా తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించక పోవడం, మాస్క్‌లు ధరించక పోవడం వల్ల వైరస్‌ సోకి పాజిటివ్‌ రావొచ్చు. టీకా వల్ల పాజిటివ్‌ వస్తుందనే భావనలో శాస్త్రీయత లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. అయితే ఎక్కువ సీరియస్‌ కాదు. మరణం వరకు వెళ్లడమన్నది చాలా తక్కువ. వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత వచ్చే ఒళ్లునొప్పులకు పారాసిట్మాల్‌ వాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ పెయిన్‌ కిల్లర్స్‌ వాడకూడదు. మధురైలో ఓ డాక్టర్‌ ఇలా వాడి రెండు గంటల్లో మృతి చెందారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చు. జూన్‌, జులై నాటికి వైరస్‌ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పటికి కనీసం 30-40 శాతం మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగితే మూడో విడత ప్రభావం ఉండకపోవచ్చు.

-డాక్టర్‌ శుభాకర్‌, మాజీ సూపరింటెండెంట్‌, ఛాతి వైద్యశాల

వీటికి దూరంగా ఉండండి

ధూమపానం, ఆల్కహాల్‌ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తాయి. అందువల్ల టీకా తీసుకునే వారు సహజంగానే వీటికి దూరంగా ఉండాలి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి వారు టీకా తీసుకున్నప్పటికీ శరీరంలో రక్షణ కొంత తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి టీకా వేసుకునేందుకు మూడు రోజుల ముందు, టీకా వేసుకున్న తరువాత వారం వరకు మద్యం తీసుకోవద్దు. అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. మధుమేహం, బీపీ ఉన్నవాళ్లు మందులు ఆపాల్సిన అవసరం లేదు. అయితే వాల్వ్‌ రీప్లేస్‌మెంటు అయిన వారిలో వాడే బ్లడ్‌ థిన్నర్ల విషయంలో మాత్రం సంబంధిత కార్డియాలజిస్టును సంప్రదించాలి.


హెల్ప్‌లైన్‌ నంబర్లు

జీహెచ్‌ఎంసీ 040-21111111
అత్యవసర సేవల కోసం 108
సలహాలు, కౌన్సెలింగ్‌ కోసం 104
పోలీసు సేవల కోసం 100

నిర్ధారణ తర్వాత టీకా ఎప్పుడంటే..

వైరస్‌ తగ్గిన తర్వాత మూడు నెలలకు టీకా తీసుకోవాలి. కరోనా సోకి తగ్గిన రోగుల్లో యాంటీబాడీలు పెరిగి ఉంటాయి. ఇవి వ్యక్తుల శరీరతత్వాన్ని బట్టి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉండొచ్చు. ఆ తరువాత టీకా తీసుకోవచ్చు.

చేయాల్సినవి కూడనివి

* మాస్క్‌ వేసుకోవడం తప్పనిసరి. అయితే దానిని ఎలాపడితే అలా చేతితో తాకడం, మాట్లాడే సమయంలో తీసేయడం... ఒకే మాస్క్‌ ఎక్కువ రోజులు ధరించడం లాంటివి చేయకూదు. సర్జికల్‌ మాస్క్‌ 8 గంటల కంటే ఎక్కువ పెట్టుకోకూడదు.

-డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ ఫిజీషియన్‌

* ఏసీలో గది తలుపులన్నీ వేసుకోవద్దు. దీనివల్ల ఎవరిలోనైనా వైరస్‌ ఉంటే మిగతా వారికి త్వరగా సోకుతుంది. ఏసీ వేసిన తలుపులు తెరిచి ఉంచడం మంచిది. కరెంటు ఖర్చయినా ఇబ్బంది లేదు.
* ప్రస్తుతం ఏ లక్షణం ఉన్నా తనకు కొవిడ్‌ ఉండదనే నిర్లక్ష్యం సరికాదు. స్వల్ప జ్వరమొచ్చినా సరే కొవిడ్‌గానే అనుమానించి పరీక్షలు చేసుకోవాలి. కొందరిలో లక్షణాలు కన్పించిన 3-4 నాలుగు రోజులకే ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి.
* పాజిటివ్‌ రాగానే చెస్టు సీటీ స్కాన్‌ చేయిస్తుంటారు. ఒక స్కాన్‌ 500 ఎక్సరేలతో సమానం. అనసరంగా సీటీ స్కాన్‌లు వద్దు. ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.
* ఆర్టీపీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ ఉండి ఆక్సిజన్‌ శాతం తగ్గుతూ ఏడు రోజులైనా జ్వరం తగ్గకుంటే... అప్పుడు ఛాతి సీటీ స్కాన్‌ అవసరం అవుతుంది. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌గా ఉన్నప్పటికీ జ్వరం తగ్గకుండా పెరుగుతూ వస్తున్నా... ఆక్సిజన్‌ తగ్గుతున్నా సీటీ స్కాన్‌ అవసరం పడొచ్చు. ఎందుకంటే ఆర్టీపీసీఆర్‌లో పరీక్ష నమూనా స్రావాలను సరిగా తీయటం చాలా ముఖ్యం. లేదంటే వైరస్‌ ఉన్నాసరే నెగెటివ్‌ వస్తుంది.

* కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తిని పాజిటివ్‌గానే అనుమానించాలి. కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. చేతులు కడుక్కోవటం, శానిటైజ్‌ చేసుకోవడం, టీకా తీసుకోవడం అత్యవసరం.
* ఆక్సిజన్‌ స్థాయిలు సక్రమంగా ఉన్నప్పుడే స్టెరాయిడ్స్‌, రక్తం పలుచన చేసే మందులు వాడటం సరికాదు. అంతేకాక 85-90 శాతం మందికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరమే ఉండదు. వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా మందులు వాడొద్దు.
* ఇంట్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా మిగతా వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తిని పూర్తిగా ఐసోలేషన్‌ చేయాలి. మిగతా వ్యక్తులు మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలి.
* యువతలో 30 శాతం మందికి పైగానే వైరస్‌ బారిన పడుతున్నారు. చాలామంది వెంటిలేటర్ల వరకు వెళుతున్నారు. వైరస్‌లో వస్తున్న ఉత్పరివర్తనాలు ఈసారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే లక్షణాలు కన్పించిన వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలి. దీంతో ఇంటి వద్దే ఉంటూ కోలుకోవచ్చు.
* తక్కువ, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఇంట్లో పది రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. తర్వాత బయటకు రావొచ్చు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారు వైద్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలి.

బొడ్డూడని వారికీ..

* అప్పుడే పుట్టిన శిశువులకు తల్లి ద్వారా వారికి సోకుతోంది. అయినా శిశువులకు పాలు ఇవ్వొచ్చు. తల్లి పాలలో కరోనా వైరస్‌ ఉండదు. అవి శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే తల్లి పాలిచ్చేముందు చేతులు శుభ్రం చేసుకొని గ్లౌజులు, మూడు పొరల మాస్క్‌ పెట్టుకొని పాలు అందించవచ్చు. ఇంకా భయంగా ఉంటే బ్రెస్ట్‌ పంపుల ద్వారా తల్లిపాలు సేకరించి పిల్లలకు పట్టాలి.
* కరోనా సోకిన పిల్లల్లో పెద్దగా ఇబ్బంది ఉండటం లేదు. సాధారణ చికిత్సలతో తగ్గిపోతుంది. పిల్లల్లో 102, 103 జ్వరం, విరేచనాలు లాంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంటివద్దే చికిత్స అందించాలి.
* పిల్లల్లో జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి, ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోలేక పోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలుంటే ఆసుపత్రిలో చేర్పించాలి.

* కొందరు పిల్లల్లో వ్యాధి తగ్గిన 3-4 వారాల తర్వాత ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) డీసీజ్‌ కన్పిస్తోంది.
* ఇలాంటి పిల్లల్లో తీవ్రమైన కడుపు నొప్పి, కాళ్లు, పొట్ట ఉబ్బుతుంది. ఆహారం తీసుకోలేరు. విరోచనాలు, వాంతులు అవుతుంటాయి. కొంతమంది పిల్లల్లో వేళ్ల సందుల్లో, చేతి కింద నుంచి పొట్టులా రాలుతుంది. జ్వరం ఎనిమిది రోజులకంటే ఎక్కువే ఉంటుంది. నాలుక గులాబీ రంగులోకి మారుతుంది.
* ముందే లక్షణాలు గుర్తించి ఆసుపత్రిలో చేర్పిస్తే తగ్గిపోతుంది. ఆలస్యం చేస్తే కొందరు పిల్లల్లో ప్రమాదకరంగా మారుతుంది. కొన్నిసార్లు కరోనా లక్షణాలు లేని పిల్లల్లోనూ ఇలాంటి లక్షణాలు కన్పించవచ్చు. అప్పటికే వారికి వైరస్‌ సోకి తగ్గిందని గుర్తించాలి.

ఇదీ చూడండి:హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details