ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగు అని ఆమె నమ్మింది. క్షణం తీరిక లేకుండా పనులతో గడిపే గృహిణులు తమ కోసం కాస్త సమయం కేటాయించుకుని చదువుకోవాలని భావించింది. పడతి ప్రగతి దేశానికి ముఖ్యమని గట్టిగా అనుకుంది. వారి కోసం ఇంటింటికి తిరుగుతూ పుస్తకాలు, నవలలూ అందిస్తోంది. ఆమే వయనాడ్కు చెందిన రాధామణి.
కేరళ కొట్టాయంకు చెందిన రాధామణి 1979లో వాయనాడ్కి వచ్చారు. 2012 నుంచి ఆమె ఈ పనిని చేస్తూనే ఉన్నారు. మహిళల్లో చదివే అలవాటును అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ‘వనితా వయన పద్ధతి’ క్యాంపెయిన్ కింద కేరళ రాష్ట్ర విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా స్థానిక గ్రంథాలయంలో ఏడాదికి 25 రూపాయలు లేదా నెలకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా తీసుకోలేని వారి కోసం తనే పుస్తకాలను సేకరించి వారి ఇంటికే వెళ్లి ఇస్తోందామె. ‘రోజూ నా సంచిలో 20 నుంచి 25 మలయాళ పుస్తకాలను తీసుకువెళతా. ఇందులో చాలామటుకు నవలలు, పోటీపరీక్షల మెటీరియల్, చిన్నారులకిష్టమైన కథల పుస్తకాలు ఉంటాయి’ అని చెబుతారామె.