తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మానసిక వేదన: పిల్లల కలగడంలేదని మహిళ ఆత్మహత్య - telangana news

పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు కలగపోవడంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. సంతానం కలగలేదని భర్తతో సహా అత్తింటివారు తరుచూ వేధింపులకు గురి చేయడం వల్లే ఉదయశ్రీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఉన్నత చదువులు చదివిన ఉదయశ్రీ ఆత్మహత్యతో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

woman-suicide-at-saroor-nagar-in-hyderabad
మానసిక వేదన: పిల్లల పుట్టడంలేదని మహిళ ఆత్మహత్య

By

Published : Jan 10, 2021, 7:10 PM IST

హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహిత శనివారం ఆత్మహత్యకు ఒడిగట్టింది. పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఎల్బీనగర్‌కు చెందిన సురేశ్‌కు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉదయశ్రీతో వివాహం జరిగి 10 ఏళ్లు అయింది. వారికి సంతానం కలగకపోవడంతో దంపతులకు తరుచూ గొడవలు జరిగేవి. ఉన్నత చదువులు చదివిన ఉదయశ్రీ ప్రైవేటు కళాశాలలో విధులు నిర్వహించగా... సురేశ్ మార్కెటింగ్ చేస్తుండేవారు.

తరుచూ వేధింపులు

సంతానం కలగకపోవడం వల్ల ఉదయశ్రీని తరుచూ భర్త సురేశ్, అత్త మామలు సావిత్రి, తిరుమల్ గౌడ్‌లు అనేక రకాలుగా వేధించేవారని ఆమె బంధువులు తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేకనే ఉదయశ్రీ బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఉదయశ్రీ మృతికి కారకులైన భర్త సురేశ్, అత్త మామలు, ఆడ పడచు, ఆడపడుచు భర్తలని కఠినంగా శిక్షించాలని సరూర్ నగర్ పోలీసులకు ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు.

ఏం జరిగింది?

మార్కెటింగ్ కోసం బయటకు వెళ్లిన భర్త... ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూసినట్లు స్థానికులు తెలిపారు. తలుపులు తెరవకపోవడం వల్ల పోలీసులకు సమాచారం ఇవ్వగా... వారు తలుపులు పగలగొట్టారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త సురేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

చైతన్యపురిలో వారికి సొంత ఇల్లు ఉండగా, అకస్మాత్తుగా సరూర్‌నగర్‌లో అద్దె ఇల్లు ఎందుకు తీసుకోవాల్సిన వచ్చిందని మృతురాలి తమ్ముడు రంజిత్ గౌడ్ ప్రశ్నించారు. అద్దె ఇల్లు తీసుకున్న కొన్ని రోజులకే తమ అక్క ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కావాలనే తమ అక్కను వేధించారని ఆరోపించారు. నిందితులందరిని కఠినంగా శిక్షించి... తమకు న్యాయం చేయాలని కోరారు. ఉదయశ్రీ ఆత్మహత్యతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:దొంగ నోట్ల చెలామణి.. ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details