చెమటోడ్చి పంట పండించడమే వారికి తెలుసు.. కానీ ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కోవడం తెలియలేదు.. ఈసారి మంచిగా వర్షాలు పడుతున్నాయని అప్పుచేసి మరీ నేలతల్లిని నమ్మి పంటలు వేశారు. తీరా ఇలా జరుగుతుందని ఊహించలేక పోయారు. ప్రకృతి కోపాగ్నినికి అతిభారీ వర్షాలు కురిశాయి. దానితో చేతికందిన పంట నీటిపాలయ్యింది. ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏం చేయాలో పాలుపోక మరణమే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు యువరైతులు ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్(28) అదే గ్రామంలో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. పెట్టుబడితో పాటు ఇంటి అవసరాల కోసం వేర్వేరు చోట్ల సుమారు రూ.2.50 లక్షల అప్పు చేశారు. పంట చేతికి వస్తే అప్పులు తీర్చుదామనుకున్నారు. భారీ వర్షాలతో పెట్టుబడి సైతం తిరిగివచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.