తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కరోనా కాటు: 20 రోజుల్లో తండ్రి, ఇద్దరు కుమారుల మృతి - కరోనా కాటు: 20 రోజుల్లో తండ్రి, ఇద్దరు కుమారుల మృతి

ఉమ్మడి కుటుంబం. ముగ్గురు కుమారులు, కోడళ్లు.. పిల్లలతో ఒకటే సందడి. మొత్తంగా ఆనందానికి ఆ ఇల్లు చిరునామాగా ఉండేది. కరోనా రూపంలో ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఇంటిల్లిపాదిపై దాడి చేసిన వైరస్‌... మొదట ఇంటి పెద్ద దిక్కును బలితీసుకుంది. రోజుల వ్యవధిలో ఇద్దరి కుమారులనూ పొట్టనబెట్టుకుంది.

three died in one family with corona
three died in one family with corona

By

Published : Sep 11, 2020, 7:53 AM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలానికి చెందిన చకినారపు భూమయ్య(70)కు నలుగురు కుమారులు. మూడో కుమారుడు శరణ్‌కుమార్‌ 20 ఏళ్ల కిందటే చనిపోయారు. మిగిలిన కుమారులతో కలిసి ఆయన జిల్లా కేంద్రంలో నక్షత్ర ఇంజినీరింగ్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. కుమారులందరికీ వివాహాలయ్యాయి. అందరూ జిల్లా కేంద్రంలోనే సొంతింట్లో ఉమ్మడిగా నివసిస్తున్నారు. గత నెలలో భూమయ్యతోపాటు రెండో కుమారుడు కిరణ్‌కుమార్‌(45), అదే కుటుంబానికి చెందిన చిన్నారులకు కరోనా సోకింది. తండ్రీకొడుకులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు.

చిన్నారులు ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండి కోలుకోగా, భూమయ్య చికిత్స పొందుతూ ఆగస్టు 22న చనిపోయారు. తర్వాత మరో కుమారుడు కిషోర్‌కుమార్‌(43)కు కరోనా సోకింది. తొలుత ఇంట్లోనే చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లో తన సోదరుడు చికిత్స పొందుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రిలోనే చేరారు. సెప్టెంబరు 4న ఆసుపత్రిలోనే మరణించాడు. ఆ విషాదం నుంచి తేరుకునే లోపే కిరణ్‌కుమార్‌(45) బుధవారం రాత్రి మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కుప్పకూలారు.

ఇరవై రోజుల వ్యవధిలోనే కుటుంబ పెద్దతోపాటు ఇద్దరు కుమారులు కరోనా కాటుకు బలవడం ఆ కుటుంబంలో తీరని వ్యధను మిగిల్చింది. అందరికీ కలిపి వైద్యానికే రూ.కోటీ ముప్పై లక్షలు ఖర్చుచేశామని... ఒక్కరి ప్రాణమైనా దక్కుతుందని ఆశపడ్డామని, చివరికి నిరాశే మిగిలిందని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.


ఇదీ చూడండి:'పోరాటమే సగం విజయం' అనే సూత్రమే ఆయుధం

ABOUT THE AUTHOR

...view details