తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లి చేసుకుంటానన్నాడు.. నదిలో తోసేశాడు - Medak District Latest News

అమ్మాయితో పరిచయం పెంచుకొని.. రోజూ ఆటోలో పాఠశాలకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. హైదరాబాద్‌కు తీసుకెళ్లి సహజీవనం చేశాడు. రోజులు గడుస్తుండటంతో పెళ్లి చేసుకోమని యువతి అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. మంజీర నది చూద్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్లి అందులో తోసేశాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో చివరికి కటకటాల పాలయ్యాడు.

The mystery of the murder case of a young girl from Somla Tanda in Medak district has been solved four months later
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

By

Published : Feb 9, 2021, 2:59 PM IST

గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత హత్య చేసిన ఘటనకు సంబంధించిన మిస్టరీ నాలుగు నెలల తర్వాత వీడింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం అంబ్రియా తండా అనుబంధ గ్రామం సోమ్లా తండాకు చెందిన యువతి ఖోలా శిరీష (18) టేక్మాల్‌ మండలం ఎల్లుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవరు కుమ్మరి వీరేశం ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆటోలో పాఠశాలకు రోజూ తీసుకొచ్చి తిరిగి ఇంటికి చేర్చేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి గతేడాది సెప్టెంబరు 13న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. గచ్చిబౌలిలో ఓ గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. సదరు యువతి పెళ్లి చేసుకోమని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది.

నది చూద్దామని నమ్మబలికి..

వీరేశం మొదటి భార్య అప్పటికే గుండెపోటుతో ఐదేళ్ల క్రితం చనిపోవడంతో న్యాల్‌కల్‌ మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. శిరీషను ఎలాగైనా వదిలించుకోవాలనే దురుద్దేశంతో మీ అమ్మానాన్నలతో మాట్లాడిన తర్వాత వివాహం చేసుకుందామని చెప్పి ఆమెతో కలిసి ఆటోలో అక్టోబరు 18న ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఎన్కెపల్లి గ్రామ శివారులోని మంజీర వంతెనపై ఆటో ఆపి నీటిని చూద్దామని నమ్మబలికాడు. ఆతర్వాత కిందికి దించి నది దగ్గరికి తీసుకెళ్లి అందులో తోసేశాడు.

అనంతరం గ్రామానికి వచ్చి ఏమీ తెలియనట్లు వ్యవహరించాడు. శిరీషను తోసేసిన సమయంలో నది వరద అధికంగా ఉండటంతో ఆమె ప్రాణాలు కోల్పోగా గాజులగూడెం శివారులో 2020 అక్టోబరు 31న గుర్తుపట్టలేని స్థితిలో శవమై కనిపించింది. దీనిపై పాపన్నపేట అప్పటి ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేశారు.

అతడిపైనే అనుమానం..

తమ కూతురు కనిపించడం లేదని నవంబరు 29న పాపన్నపేట ఠాణాలో ఎస్సై సురేష్‌కు యువతి తండ్రి ఖోలా అంబ్రియా ఫిర్యాదు చేశాడు. ఆటో డ్రైవరుపై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు విచారణలో భాగంగా డ్రైవరు ఫోన్‌ కాల్స్ జాబితా పరిశీలించారు. కొత్త నంబరు నుంచి ఫోన్‌ వచ్చిందని తెలియగా.. వెంటనే ఆరా తీశారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి వచ్చినట్లు తేలడంతో అక్కడికెళ్లి విచారించారు. తమ ఇంట్లో శిరీషను వీరేశమే అద్దెకు ఉంచినట్లు వారున్న ఇంటి యజమాని చెప్పాడు. నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వివరించారు.

ఇదీ చూడండి:బొల్లారం హత్య కేసు: ఆర్థిక లావాదేవీలే కారణమా?

ABOUT THE AUTHOR

...view details