తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2020, 7:27 AM IST

Updated : Dec 18, 2020, 12:39 PM IST

ETV Bharat / jagte-raho

ఆన్​లైన్ అప్పులకు సాఫ్ట్​వేర్ ఇంజినీరు బలి

ఆన్​లైన్​లో అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కాగా మృతుడు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

software employee suicide by online debts
సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్యకు దారితీసిన ఆన్​లైన్​ అప్పులు!

ఆన్​లైన్​ యాప్​ల ద్వారా అప్పులు చేసి, తిరిగి వాటిని తీర్చలేక ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్.. హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తూ రాజేంద్రనగర్​లోని కిస్మత్​పూర్​ ఓం నగర్​లో నివాసముంటున్నాడు.

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​తో సునీల్​ ఉద్యోగం కోల్పోయినట్లు రాజేంద్రనగర్​ ఎస్సై సురేశ్​ తెలిపారు. ఈ క్రమంలో ఆన్​లైన్​లో అప్పులు చేశాడని చెప్పారు. ఇన్​స్టంట్​ క్రెడిట్​ యాప్​ ద్వారా రుణం తీసుకున్నాడని, అధిక మొత్తంలో అప్పులు చేయడంతో చివరికి వాటిని తీర్చలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాడని వివరించారు. భార్య ఇంట్లో లేని సమయం చూసి ఫ్యాన్​కు ఉరివేసుకుని సునీల్​ బలవన్మరణానికి పాల్పడ్డాడని వెల్లడించారు.

ఆ యాప్​లకు అనుమతులు ఉండవు

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి యాప్​ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. రుణం తీసుకునేప్పుడు యాప్​ నిబంధనలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రుణ గ్రహీత సెల్​ఫోన్​ కాంటాక్ట్​ జాబితా యాప్​ నిర్వాహకులకు చేరుతుందని, అతను రుణం చెల్లించకపోతే ఆ జాబితాలోని అందరికీ వివరాలు పంపిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి యాప్​లకు అనుమతులు ఉండవని, వీటి ద్వారా వేధింపులకు గురైతే పోలీసులను ఆశ్రయించాలని వెల్లడించారు. సునీల్​ ఆత్మహత్యకు కారణమైన యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని అన్నారు.

ఇదీ చదవండి:కేబుల్​ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం... ఆలస్యంగా వెలుగులోకి...

Last Updated : Dec 18, 2020, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details