సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను సైతం మోసగాళ్లు వదలడం లేదు. ఎంపీ కే కేశవరావుకు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్గా మోసగాడు పరిచయం చేసుకున్నాడు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీంను కేంద్రం ప్రవేశపెట్టిందని, 25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల చొప్పున రుణం ఇస్తోందని వివరించాడు. ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. ఎంతోమంది ఎంపీలు పోటీపడుతున్నా... మంత్రి కేటీఆర్ సిఫారసుతో మీకే మంజూరు చేయించాలని భావిస్తున్నామని నమ్మబలికాడు. నిరుద్యోగుల పేర్లు పంపితే రుణాలిస్తామన్నాడు.
ఈ విషయాన్ని కేకే.. తన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి తెలిపారు. ఆమె.. మహేశ్కు ఫోన్ చేయగా దరఖాస్తుకు ఈ రోజు చివరితేదీ అని, ఒక్కొక్కరికీ రూ.1.25 లక్షల దాకా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని... డీడీ కడితే చాలు దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానన్నాడు. విజయలక్ష్మి తన డివిజన్లో కొంతమంది నిరుద్యోగులకు పథకం గురించి వివరించారు.