ఓ వివాహితను ఆమె ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొత్తవెలగాడలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మర్రోతు భవాని.. భర్త నుంచి విడిపోయి కొంత కాలంగా తన కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన చౌడువాడ ఎర్రిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కుమారుడు పెద్దవాడు అయ్యాడని... తనతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని భవాని ఇటీవల చెప్పింది.
ఈ మాటలను తట్టుకోలేక ఎర్రిబాబు ఆమెపై కక్షగట్టాడు. సోమవారం అర్ధరాత్రి భవాని ఇంటికొచ్చి నిద్రలో ఉన్న ఆమె తలపై బలంగా మోదాడు. ఫలితంగా భవాని అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇంటి తలుపులు మూసేసి ఎర్రిబాబు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు.