నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లనాయక్ తండాలో వినోద్(21) అనే యువకుడు పొలం పనులు చేస్తుండగా.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు. నెలరోజుల క్రితం తండ్రి గుండెపోటుతో మృతి చెందగా.. వినోద్ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు.
నెలరోజుల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి.. దుఃఖసాగరంలో కుటుంబం - man dead in nizamabad
వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లనాయక్ తండాలో చోటు చేసుకుంది. నెలరోజుల క్రితమే యువకుని తండ్రి మృతి చెందగా.. ఇద్దరు మగ దిక్కులను కోల్పోవడం వల్ల ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది.

తండాకు చెందిన బాదావత్ హరిదాస్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు(21) ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేసిన హరిదాస్ నెలరోజుల క్రితం గుండె జబ్బుతో మృతి చెందాడు. తండ్రి మరణంతో వినోద్పై కుటుంబ భారం పడింది. అలవాటు లేకున్నా వినోద్ వ్యవసాయ పనులు చూసుకునేవాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి వెళ్లిన వినోద్ బోరు వద్ద అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు.
చాలా రోజులుగా బోరుకు విద్యుత్ సరఫరా అవుతోందని, మరమ్మతులు చేయించడంలో జాప్యం అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు మగ దిక్కులను కోల్పోయిన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.