కూలీ పనికెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న తొమ్మిది మంది కూలీల జీవితాలు చీకటైపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండల రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడం వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్కు తరలించనున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడం వల్ల ఇవాళ ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోల్లో వెళ్లే వీరంతా లాక్డౌన్ కారణంగా వాటికి అనుమతి లేనందున ట్రాక్టర్లో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది.
మృతులు: