తెలంగాణ

telangana

By

Published : Oct 12, 2020, 6:45 PM IST

Updated : Oct 12, 2020, 7:00 PM IST

ETV Bharat / jagte-raho

పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికులు.. కానీ ఇంతలోనే..

ఏడడుగులు నడిచి... నూరేళ్ల జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కన్నారు. ఒక్కటయ్యేందుకు దైవ సన్నిధికి బయలుదేరారు. కాసేపట్లో కలలు నిజమవుతాయనుకున్న ఊహలు... అంతలోనే ఆవిరయ్యాయి. కారు రూపంలో వచ్చిన మృత్యువు... ప్రేమికుడిని బలి తీసుకుంది. వాహనాదారుడి నిర్లక్ష్యంతో... కాబోయే వరుడు విగతజీవిగా మిగిలాడు.

lovers died in brutal accident at choutuppal
పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికులు.. కానీ ఇంతలోనే..

పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ప్రేమికులు.. కానీ ఇంతలోనే..

హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన నాగరాజు, శ్రీలత ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని భావించారు. ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు దేవాలయానికి బయలుదేరారు. మూడుముళ్ల బంధంతో కాసేపట్లో ఒక్కటవ్వాలనుకున్న వారిని... ప్రమాదం వెంటాడింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతో దూసుకొచ్చిన కారు... ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. మరికొన్ని వాహనాలనూ తోసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో నాగరాజుతోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా... నాగరాజు మృతి చెందాడు. శ్రీలతతోపాటు మిగతవారు చికిత్స పొందుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై సిగ్నల్‌ పడింది. కొన్ని క్షణాల్లో గ్రీన్‌ లైట్‌ వెలిగేందుకు సమయం సమీపిస్తోంది. వాహనదారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. కొందరు యూ టర్న్‌ తీసుకుంటున్నారు. ప్రేమజంట ద్విచక్రవాహనం ముందున్న లారీ, కార్లు నెమ్మదిగా కదిలాయి. మిగతా వాహనాలూ ముందుకు వెళ్తున్నాయి. మెళ్లగా వేగం పెంచేందుకు ఒక్కొక్కరూ గేర్లు మారుస్తున్నారు. అంతలోనే అనుకోని ప్రమాదం కారు రూపంలో వచ్చి పడింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనదారుడు వెనకాల నుంచి అతివేగంతో దూసుకొచ్చాడు. ముందున్న వాహనాలను బలంగా ఢీ కొట్టాడు. ఆ వేగానికి ప్రమాదంలోనూ కారు ఆగలేదు.

ఈ ఘటనలో నాగరాజు, శ్రీలత ఉన్న ద్విచక్రవాహనానికి మంటలు అంటుకున్నాయి. పెట్రోల్‌ లీక్‌ కావడం వల్ల మంటలు చెలరేగి... వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంతో జాతీయ రహదారిపైనున్న వాహనదారులతోపాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బ్రేకులు ఫెయిల్‌ అవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తుండగా... సీసీటీవీ దృశ్యాలు చూస్తే వాహనదారుడి నిర్లక్ష్యంగా కారణంగానే దుర్ఘటన చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డ్రైవర్‌ ఎక్కడా కారును నియంత్రించే ప్రయత్నం చేయలేదు. అతివేగంగా ఢీ కొట్టిన తర్వాత... కొంచెం వేగం నెమ్మదించినట్టు స్పష్టమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు

Last Updated : Oct 12, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details