ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన పాలబూత్, హోటల్ నిర్వహకుడు భాష్యం బ్రహ్మయ్య హత్యోదంతం చిక్కుముడి వీడినట్లేనని తెలుస్తోంది. మచిలీపట్నంకు చెందిన ఓ ముఠా సుపారీ తీసుకుని.. బ్రహ్మయ్యను సైనైడ్ చల్లి చంపేసినట్లు ఆనుమానిస్తున్నారు. ఆయనను హతమార్చిన వారిలో కీలక వ్యక్తిని పెదకూరపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వ్యర్థాలను పడేయడానికి వెళ్తుండగా..
ఈనెల 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో.. హోటల్ మూసివేసి వ్యర్థాలను గ్రామ శివారులో పడేయటానికి బ్రహ్మయ్య వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. ఆయన వెనుకే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ముఖంపై రసాయనాలు చల్లి దాడికి ప్రయత్నించగా.. బ్రహ్మయ్య వారి నుంచి తప్పించుకుని సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అతడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతి చెందాడు.