తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాగితాలపైనే వ్యాపారాలు.. అక్రమార్కుల జేబుల్లోకి కోట్ల రూపాయలు

బోగస్‌ సంస్థలు ఏర్పాటు, నకిలీ ఇన్​వాయిస్‌లు సృష్టించడమే వాటి పెట్టుబడి. వస్తువుల క్రయవిక్రయాలు లేకుండానే కొన్నట్లుగా, అమ్మినట్లుగా బిల్లులు సృష్టించడంలో వారిది అందెవేసిన చేయి. కాగితాలపై కోట్లాది రూపాయల టర్నోవర్‌ చూపించి.. భారీ మొత్తంలో రుణాలు పొందడం.. కోట్ల రూపాయిల ఇన్‌పుట్​ ట్యాక్స్‌ క్రెడిట్​ను దోచేయడంలో వారిది ప్రత్యేక శైలి.. అధికారుల నిఘాకు చిక్కకుండా.. అక్రమదందా సాగిస్తున్న బాగోతాలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు.

By

Published : Jan 12, 2021, 7:28 PM IST

gst
కాగితాలపైనే వ్యాపారాలు.. అక్రమార్కుల జేబుల్లోకి కోట్ల రూపాయలు

ఒకే దేశం, ఒకే పన్ను అన్న నినాదంతో వచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో రెండోసారి చెల్లించిన పన్నును వ్యాపారికి తిరిగిస్తోంది జీఎస్టీ కౌన్సిల్​. దీన్నే ఇన్​ఫుట్​ ట్యాక్స్‌ క్రెడిట్‌ విధానం అంటారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు.. కొనుగోలు చేసిన వస్తువుల విలువపై రెండోసారి జీఎస్టీ చెల్లించినట్లయితే.. ఆ మొత్తాన్ని సంబంధిత వ్యాపారి, కంపెనీ, వాణిజ్య సంస్థల ఖాతాల్లో నేరుగా జమయ్యే విధానం అమలువుతోంది. ఉత్పత్తిదారుడు లక్ష రూపాయలకు ఒక వస్తువును విక్రయించినప్పుడు.. దాని ఖరీదుపై విధించాల్సిన 18 శాతం జీఎస్టీని కొనుగోలుదారుడి నుంచి వసూలు చేస్తారు.

కామధేనువులా..

లక్షకు కొనుగోలు చేసిన వస్తువును వ్యాపారి.. లక్ష ఇరవై వేలకు అమ్మినట్లయితే.. కొనుగోలుదారుడు ఆ మొత్తానికి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికే లక్ష రూపాయలపై ఈ వ్యాపారి.. 18 శాతం జీఎస్టీ చెల్లించినందున లాభంపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ రెండోసారి చెల్లించిన మొత్తంలో లాభంపై జీఎస్టీ మినహాయించుకొని మిగిలిన సొమ్మును ఆ వ్యాపారి ఖాతాకు జమ అయ్యేట్లు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తోంది జీఎస్టీ కౌన్సిల్‌. ఈ ఇన్​పుట్​ ట్యాక్స్‌ క్రెడిట్‌ విధానమే అక్రమార్కులకు కాసులు కురిపించే కామధేనువులా మారింది.

నోటికి వచ్చిన సంఖ్యలు..

ఛార్టడ్​ అకౌంటెంట్ల సహకారంతో.. మూడో కంటికి తెలియకుండా కొందరు కుట్రపూరితంగా బోగస్‌ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అనామకుల ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగిస్తూ అనుమతులు పొందుతున్నారు. ప్రధానంగా ఇనుము, ఐరెన్‌ స్క్రాప్‌, టైల్స్‌, మార్బుల్స్‌, గ్రానైట్‌ లాంటివి క్రయవిక్రయాలు చేసినట్లు కాగితాలపై లెక్కలు చూపిస్తారు. అనంతరం ఆ వస్తువులు ఒక దగ్గర నుంచి మరో చోటుకు వెళ్లకుండానే.. వెళ్లినట్లు ఈ వే బిల్లులు సృష్టిస్తారు. ఈ బిల్లులపై సరకు రవాణా అయినట్లు వాహనాల నంబర్లు వేయాల్సి ఉన్నా.. నోటికి వచ్చిన సంఖ్యలు వేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారం చేసినట్లు టర్నోవర్‌ చూపిస్తున్నారు.

కాగితాలపైనే వ్యాపారాలు..

వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి.. ఆయా నకిలీ బిల్లులను జీఎస్టీ పోర్టల్​లో అప్​లోడ్​ చేస్తున్నారు.. తద్వారా వచ్చే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కాజేస్తున్నారు. మరోవైపు బోగస్‌ సంస్థలు కోట్లాది రూపాయలు వ్యాపారం చేసినట్లు కాగితాలపై చూపి.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. వారినీ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్​ పెట్టేందుకు దేశవ్యాప్తంగా.. డేటా అనలిటిక్స్‌, జీఎస్టీ ఎకో సిస్టమ్‌, జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ బృందాలు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి.

అరెస్టుల పర్వం..

మేడ్చల్‌ కమిషన్‌రేట్‌ పరిధిలో 11 బోగస్‌ సంస్థలను గుర్తించారు అధికారులు. నకిలీ ఇన్​వాయిస్‌లు సృష్టించి 200 కంపెనీలకు ఇచ్చినట్లు తేల్చారు. తద్వారా ఏకంగా రూ.67.76 కోట్లు జీఎస్టీ రాయితీని పొందినట్లు నిర్ధారించారు. ఛార్టడ్​ చార్టెడ్ అకౌంటెంట్ వికాస్ శరాఫ్‌ సహా కిరణ్‌చౌదరీ, అర్జున్‌ చౌదరీలను అరెస్టు చేశారు. కీలకమైన మరో నిందితుడు గోర్డన్‌ సింగ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ ముగ్గురిని నాంపల్లి ఆర్థిక వ్యవహారాల న్యాయస్థానంలో హాజరుపరచగా.. ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

ఆర్థిక వ్యవహారాల కోర్టుకు..

రంగారెడ్డి సీజీఎస్టీ కమిషన్‌రేట్‌ పరిధిలో బోగస్ సంస్థలకు నకిలీ ఇన్​వాయిస్‌లను సృష్టించిన ముగ్గురు అక్రమార్కులను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో మూడు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు తీసుకొని.. వ్యాపారం చేయకుండానే రూ.19.1 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్నట్లు తేల్చారు. మరో రూ.32.54 కోట్లు ఇన్​పుట్​ టాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని గుర్తించిన జీఎస్టీ అధికారులు.. బిహార్‌కు చెందిన ముఖేష్ కుమార్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్​ను అరెస్ట్​ చేశారు. వీరికి ఈనెల 21 వరకు రిమాండ్​ విధించింది.. నాంపల్లి ఆర్థిక వ్యవహారాల న్యాస్థానం.

6600 బోగస్​ సంస్థలు..

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 6,600 బోగస్‌ సంస్థలపై 2,200 కేసులను నమోదు చేశారు. 215 మంది అక్రమార్కులను అరెస్టు చేశారు. రూ.700 కోట్లు రికవరీ చేశారు. కేవలం వారం రోజుల్లో తెలంగాణలో ఆరుగురిని అరెస్టు చేసిన కేంద్ర జీఎస్టీ అధికారులు.. రెండు వందలకుపై బోగస్‌ సంస్థలకు నకిలీ ఇన్​వాయిస్‌లను ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని నిర్ణయించిన సీజీఎస్టీ అధికారులు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు.

అనుమానం ఉన్న సంస్థలకు చెందిన ఈ వే బిల్లులను పరిశీలిస్తున్నారు. అందులో ఉన్న వాహనాల నంబర్లు, ఆయా సంస్థలు పేర్కొన్న సామగ్రిని పరిశీలించడం ద్వారా బోగస్‌ సంస్థల అక్రమాలకు చెక్‌ పెడుతున్నట్లు జీఎస్టీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేక డ్రైవ్​ చేపడుతున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:ఫేస్​బుక్​తో డేటా షేరింగ్​పై వాట్సాప్​ స్పష్టత

ABOUT THE AUTHOR

...view details