తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2020, 8:06 AM IST

ETV Bharat / jagte-raho

చివరికి గ్రేహౌండ్స్‌ భూములనూ వదల్లేదు!

భూ కబ్జాదారులు ఏ భూమిని కూడా వదలడం లేదు. చివరికి పోలీస్​ శాఖ భూములపై కన్నేశారు. ఈ వ్యవహారం వెనుక ఓ మాజీ పోలీసు అధికారి ఉన్నట్టు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు తెలుసుకున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Greyhounds‌ Land grabbers' attempt to encroach on land
గ్రేహౌండ్స్‌ భూములపై కన్నేసిన అక్రమార్కులు

రాష్ట్రంలో రూ.2,847 కోట్ల విలువైన గ్రేహౌండ్స్‌ దళం భూములపై కొందరు కన్నేశారు. కోర్టు వివాదంలో ఉన్న వీటిపై ఒప్పందాలు జరిగిన విషయం బయటకు పొక్కడం.. కేసులు నమోదవడం ఇంతక్రితం దాకా సాగిన ప్రక్రియ కాగా తాజాగా నిందితులకు పోలీసులు తాఖీదులిచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం వెనుక ఓ మాజీ పోలీసు అధికారి ఉన్నట్టు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు తెలుసుకున్నారు. ‘తనకేమీ తెలియదని మాజీ పోలీసు అధికారే ఇదంతా చేయించారు’ అని తాఖీదులు అందుకున్న వారిలో ఒకరు వాంగ్మూలం ఇవ్వడంతో అతడి పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇలా కన్నేశారు

గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1993లో గ్రేహౌండ్స్‌కు సర్వే నంబరు 393/1 నుంచి 393/20 వరకు ఉన్న 142 ఎకరాల 39గుంటల భూములను కేటాయించింది. ప్రస్తుతం ఎకరా భూమి రూ.20 కోట్లు పలుకుతోంది. ఈ స్థలం తమకు ప్రభుత్వం కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గ్రేహౌండ్స్‌కే భూమి చెందుతుందని సుప్రీంకోర్టు 2007లో తీర్పు ఇవ్వగా గ్రేహౌండ్స్‌ స్వాధీనం చేసుకుంది. హైకోర్టులో వేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందంటూ అసైనీలు మళ్లీ 2009లో పిటిషన్‌ వేయగా... 2010లో అసైనీలకు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం వాదనలు వినిపించగా స్టేటస్‌కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ న్యాయవివాదం ఇలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉమాదేవి, ఆరోగ్యరెడ్డిలు అసైనీల వారసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు ఒక కంపెనీలో డైరెక్టర్లు.

ఎకరాకు రూ.4 కోట్లు... బయానా రూ.8 లక్షలు

స్టేటస్‌కో ఉన్నా సరే.. తర్వాతైనా సొంతం అవుతుందన్న ధీమాతో ఆరోగ్యరెడ్డి, ఉమాదేవిలు 16 మంది అసైనీల వారసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున ఇస్తామని ప్రతిపాదించారు. కొద్దినెలల క్రితం బయానాగా ఒక్కొక్కరికి రూ.8 లక్షల చొప్పున ఇచ్చారు. అనంతరం ఆ భూములు తమవేనంటూ జీపీఏ(జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని) చేయించుకున్నారు.

ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం

ఒప్పంద విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్‌ ఉన్నతాధికారి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ విచారణ చేపట్టి ఆరోగ్యరెడ్డి.. అసైనీల వారసులకు ఇచ్చిన చెక్కులు, ఇతర ఆధారాలతో 2020 జూన్‌ 24న హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేరోజు ఐపీసీ 406, 420, 120బీ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు చూడగా అప్పట్లో వారు దుబాయ్‌కి వెళ్లడంతో సాధ్యం కాలేదు. వారికోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ రాగా వీరిద్దరికి 41(ఎ) సీర్‌పీసీ కింద తాఖీదులు జారీ చేశారు. అనంతరం ఉమాదేవిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి:వర్గల్​లో విషాదం... ఆర్థిక ఇబ్బందులతో కార్పెంటర్​ బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details