ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. తాతయ్యతో సరదాగా ఎడ్లబండిపై కూర్చుని ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు నాలుగేళ్ల మనవడు బండిచక్రం కింద పడి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ సుజాత దంపతుల ఏకైక కుమారుడు చాకటి బ్రహ్మథ్ ప్రాణాలు కోల్పోయాడు.
సెలవిక: ఎడ్లబండి చక్రాలకింద పడి పసివాడు మృతి - adilabad latest crimes
తాతంటే ఆ పసివాడికెంతో ప్రేమ. ఆ మనవడంటే ఆ తాతకు అమితమైన ఇష్టం. ఎటెళ్లినా తాతతో వెళతానని మారాం చేస్తాడు. గారాల బుల్లోడు కాబట్టి.. ఎవరూ కాదనలేరు. అలాగే.. తాతతో బయటికెళ్లాడు. అది అతడి చివరి ప్రయాణమని గ్రహించలేకపోయాడు. ఎడ్లబండి చక్రం కింద పడి కళ్లెదుటే చనిపోయిన మనవడిని చూసి తాత విలపిస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా కనిపించడం చూసిన ఆ తల్లిదండ్రులను రోదన చూపరులను సైతం కలచివేసింది.
![సెలవిక: ఎడ్లబండి చక్రాలకింద పడి పసివాడు మృతి Four year old boy dies after falling from bull cart in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9785970-502-9785970-1607261135741.jpg)
ఎడ్లబండిపై సిమెంటు ఇటుకలు తీసుకొస్తున్న తాతయ్య స్వామి.. మనవడి సరదా కోసం తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అలా బండి తోలుతున్న సమయంలో జారి పడ్డ బాలుడు చక్రం కిందకి దొర్లాడు. తలపై నుంచి చక్రం పోవడంతో మృతి చెందాడు. హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సరదాగా గడిపిన మనవడు కళ్లెదుటే విగత జీవిలా మారడంతో తాతయ్య బోరున విలపించాడు. బాలుడి తల్లి దండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఇదీ చూడండి: కల్వర్టును ఢీకొన్న టాటామ్యాజిక్... ముగ్గురు మృతి