తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 6:26 AM IST

ETV Bharat / jagte-raho

విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ అగ్నికీలలు

విశాఖ సమీపంలోని పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ సాల్వెంట్స్ సంస్థలో రియాక్టర్‌ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీ పేలుళ్లు సంభవించడంతో సిబ్బంది, స్థానికులు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంలో ఒకరు గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

visakha solvents plant
visakha solvents plant

విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్‌’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంట్‌ రికవరీ కాలమ్‌లో ప్రమాదం సంభవించడంతో మంటలు భారీఎత్తున ఎగసిపడ్డాయి. సంస్థ ప్రాంగణంలో ఉన్న రసాయనాల డ్రమ్ములకు కూడా మంటలు అంటుకోవడంతో అవి భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ శబ్దాల ధాటికి స్థానికులు తీవ్రంగా భీతిల్లారు. శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించడం వాటి తీవ్రతకు నిదర్శనం. మంటలు 30 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడడంతో ప్రమాద తీవ్రతను చూసి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

భయంతో పరుగులు

ఫార్మాసిటీకి సమీపంలోని హెచ్‌టీ విద్యుత్తు లైన్లు కూడా వేడి తీవ్రతకు తెగి కిందపడ్డాయి. ప్రమాదాన్ని చూసిన సమీపంలోని పలు ఫార్మా సంస్థల్లో రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నికీలల తీవ్రత క్షణక్షణానికీ పెరుగుతుండడంతో ఫార్మాసిటీ పరిసర గ్రామాల్లోని వారు ఇళ్లు ఖాళీ చేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. నల్లని పొగలు కూడా దట్టంగా కమ్ముకోవడంతో సంస్థలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అగ్ని ప్రమాదంలో ఒకరు గాయపడడం మినహా ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మిగిలిన పరిశ్రమలు సురక్షితమే

ఫార్మాసిటీలో ఒకేచోట ఏకంగా 85 ఫార్మా సంస్థలు ఉన్నాయి. మంటలు మరింత విస్తరించి ఇతర సంస్థలకు వ్యాపిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే అలాంటి అవకాశం లేదని ఫార్మాసిటీ సీఈవో లాల్‌కృష్ణ ‘ఈనాడు’కు చెప్పారు. మరోవైపు ఫార్మాసిటీ పరిసరాల్లోని తానాం, పరవాడ, తాడి, లంకెలపాలెం, ఈబోనంగి, గొర్లువానిపాలెం తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

12 అగ్నిమాపక వాహనాలు సిద్ధం

పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికారులు నగరంతో పాటు, అనకాపల్లి పరిధి నుంచి సుమారు 12 భారీ అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి తరలించారు. సంఘటన స్థలం నుంచి సుమారు 200 మీటర్ల వరకు వేడి తీవ్రత విస్తరించటంతో సమీపంలోకి వెళ్లడానికి కూడా కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఒకటి, రెండు ఫోమ్‌ యంత్రాలతో మంటలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గిన తర్వాత అగ్నిమాపక వాహనాలను వినియోగించే వీలుంటుంది.

విధుల్లో ఉన్నది నలుగురే..

రాంకీ సీఈటీపీ సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్‌ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో మల్లేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను రాత్రి 12 గంటల సమయంలో గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంస్థ రసాయనాల్ని శుద్ధి చేసి పలు ఫార్మా కంపెనీలకు విక్రయిస్తుంటుంది. సుమారు 15 రకాల రసాయనాలు ఇక్కడ నిల్వ ఉంటాయి. భారీఎత్తున రసాయనాల నిల్వ ఉండడమే ప్రమాద తీవ్రతకు కారణమని భావిస్తున్నారు.

మంటల్ని అదుపు చేసేందుకు చర్యలు: కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విశాఖ సాల్వెంట్స్‌ పరిశ్రమలో ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు సత్వర చర్యలను చేపట్టామని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. పరిశ్రమ ఆవరణలో అయిదు రియాక్టర్లు ఉన్నాయని, వీటిలో ఒకదాని నుంచి పేలుడు సంభవించినట్లు సమాచారం వచ్చిందన్నారు. యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైందని, సాధ్యమైనంత త్వరగా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

ABOUT THE AUTHOR

...view details