తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము..!

ఏడు రాష్ట్రాల డిపాజిట్‌దారులకు కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్​ యాజమాన్యం మనీలాండరింగ్​కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. సంస్థ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేసి బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

agrigold scam
కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము

By

Published : Dec 24, 2020, 6:33 AM IST

భారీగా విదేశాల్లో దాచిన అగ్రిగోల్డ్‌ సొమ్ము జాడ ఎట్టకేలకు బహిర్గతమైంది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్‌ సముద్రంలోని కేమన్‌ దీవుల్లో దాచినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది. కేమన్‌ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది.

ఆకర్షణీయ పథకాలతో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు రూ.6,380 కోట్లను సేకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దర్యాప్తు చేయగా మనీలాండరింగ్‌ కోణం బహిర్గతం కావడంతో ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. సంస్థ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేసి బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటీషన్‌ దాఖలు చేసింది.

ఆరో వంతు మందికే ప్లాట్లు

ఈడీ దర్యాప్తుతో యాజమాన్యం నిర్వాకాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఏడు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట ఏజెంట్లను చేర్చుకున్న సంస్థ.. వారి ద్వారా పెద్దఎత్తున డిపాజిట్లను సేకరించింది. డిపాజిటర్ల పేరిట కేటాయించినట్లు చెప్పిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్‌ చెప్పకుండా, వాస్తవ మార్కెట్‌ విలువ ప్రస్తావించకుండా, సర్వే నంబర్లు వెల్లడించకుండా మాయ చేసింది. పేరుకే స్థిరాస్తి వ్యాపారమని చెప్పినా.. ఆర్‌బీఐ నుంచి అనుమతులు లేకుండానే డిపాజిట్లు సేకరించింది. ఈ నిర్వాకాన్ని గుర్తించిన సెబీ వెంటనే వ్యాపార కార్యకలాపాల్ని అపేసి డిపాజిట్‌దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దాన్ని పట్టించుకోని ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు.. కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించారు. ప్రక్రియ కాస్తా పొంజి స్కామ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్లాట్లు ఇస్తామంటూ 32లక్షల మంది నుంచి తీసుకున్న సొమ్ముకు చివరకు దాదాపు 5.3లక్షల ప్లాట్లు మాత్రమే వెంచర్లలో ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము

ఏయే రంగాలకు ఎంత మళ్లించారంటే..

స్థిరాస్తి వ్యాపారం పేరిట డిపాజిట్లు సేకరించిన యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఇతర రంగాలకు రూ.942.96 కోట్ల నిధుల్ని మళ్లించింది.

  • విద్యుత్‌ రూ.180,64,82,770
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.180,21,26,000
  • వినోదం రూ.171,92,25,000
  • ఆహార పరిశ్రమ రూ.176,98,30,600
  • ట్రావెల్‌ ఏజెన్సీస్‌ రూ.54,99,50,000
  • ఉపరితల రవాణా రూ.30,61,54,000
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్స్‌ రూ.29,86,62,839
  • రబ్బర్‌ తయారీ రూ.26,75,20,000
  • వ్యవసాయం రూ.19,19,47,000
  • హోటల్‌ వ్యాపారం రూ.16,58,67,726
  • రసాయనాలు రూ.13,33,75,000
  • జనరల్‌ ట్రేడింగ్‌ అండ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ రూ.13,04,03,000
  • బీమా రూ.7,91,00,000
  • డేటా ప్రాసెసింగ్‌ రూ.7,51,00,000
  • కలప పరిశ్రమ రూ.7,17,08,000
  • గనుల తవ్వకం రూ.5,54,45,000
  • సాఫ్ట్‌వేర్‌ పబ్లిషింగ్‌ రూ.67,07,000
    కేమన్‌ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్‌ సొమ్ము

ఇవీచూడండి: అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్​.. చంచల్​గూడకు నిందితులు

ABOUT THE AUTHOR

...view details