దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి - మహబూబ్నగర్ జిల్లా వార్తలు

09:43 September 04
దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి
ఆడపిల్ల అంటే ఆదిశక్తి.. పరాశక్తి అంటారు. కానీ కడుపులో నుంచి బయటపడేవరకు కూడా రక్షణ లేకుండాపోయింది. ఆడపిల్లలు పుట్టారని కన్న తండ్రే ఇద్దరు శిశువులకు విషమిచ్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన కేశవులు, క్రిష్ణవేణి దంపతులకు తొలికాన్పులో ఆడపిల్ల జన్మించింది.
ఈ నెల 1న కేశవులు భార్య మళ్లీ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. రెండో కాన్పులోనూ ఆడశిశువులే పుట్టారని ఆగ్రహించిన కేశవులు... మద్యం మత్తులో కన్నపిల్లల్నే చంపేందుకు యత్నించాడు. ఇద్దరు శిశువులకు పురుగులమందు తాగించాడు. పిల్లల నోట్లోంచి నురగలు రావడంతో వైద్యులకు చూపించగా... విషప్రయోగం జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా....కేశవులు పురుగుల మందు కొనుగోలు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన దృశ్యాలు బయటపడ్డాయి.