'నామినేటేడ్ పదవులు ఇప్పిస్తామని మోసం చేశారు' కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని ప్రవర్ణారెడ్డి దంపతుల నుంచి నగదు వసూలు చేశారనే ఫిర్యాదుపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, మరో 8 మందిపై కేసు నమోదైంది. బాధితురాలు ప్రవర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సరూర్నగర్ పోలీస్స్టేషన్లో 9మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఔషధ రంగంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని నాలుగేళ్ల క్రితం ఈశ్వర్ రెడ్డి, కృష్ణకుమార్, రాంచంద్రారెడ్డి తమ వద్ద నుంచి రూ. 2కోట్ల 17 లక్షలు తీసుకున్నారని బాధితురాలు తెలిపారు. విషయాన్ని గమనించి 2016లో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయగా భాజపా నేత మురళీధర్రావుతో పాటు మరికొంత మంది కలిసి బెదిరింపులకు దిగినట్లు వెల్లడించారు. రూ. 2కోట్ల 5లక్షలు తిరిగి చెల్లించడానికి అంగీకరించి... తరువాత ఇవ్వకుండా మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 సెప్టెంబర్లో డబ్బుల విషయమై దిల్లీలో కేసు నమోదైనప్పటికి ఫలితం లేదన్నారు.