తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 7:40 AM IST

ETV Bharat / jagte-raho

ఐఎంఎస్​ డైరెక్టర్​పై అచ్చెన్నాయుడు ఒత్తిడి: అనిశా

టెలీ హెల్త్‌ సర్వీసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు పనులు అప్పగించేలా అప్పటి ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.... ఐఎంఎస్​ అప్పటి డైరెక్టర్ రమేశ్‌కుమార్‌ను ఒత్తిడి చేసినట్లు తమ విచారణలో తేలినట్లు అనిశా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. ప్రభుత్వం నుంచి మంజూరు ఉత్తర్వులు లేకపోయినా... టెండర్లు పిలవకుండా ఈ సంస్థకు... పీసీఎంఎస్​ సేవలను అప్పగించారని స్పష్టం చేసింది.

atchannaidu
atchannaidu

ఈఎస్​ఐలో అవకతవకల ఆరోపణలపై అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడి రిమాండ్‌ రిపోర్ట్‌ను అనిశా అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్‌కు చెందిన టెలీ హెల్త్​ సర్వీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థకు కాల్‌సెంటర్‌, ఈసీజీ, పేషెంట్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం పనులు అప్పగించాలని ఐఎంఎస్​ అప్పటి డైరక్టర్‌ రమేశ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అనిశా పేర్కొంది. ఆ ఆదేశాలు అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని రమేశ్‌కుమార్‌... అచ్చెన్నాయుడికి చెప్పినట్లు తెలిపింది. 2016 అక్టోబర్‌, నవంబర్‌లో సదరు సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలంటూ అచ్చెన్నాయుడు 3 లేఖలు రాసినట్టు అనిశా పేర్కొంది.

సంస్థతో రమేశ్​ కుమార్​ కుమ్మక్కు

అనిశా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ముందు అచ్చెన్నాయుడిని హాజరుపర్చినప్పుడు అనిశా దాఖలు చేసిన రిమాండ్‌ రిపోర్టులో పలు వివరాలు వెల్లడించింది. 2016 డిసెంబర్‌ 2 నాటి మంత్రి లేఖ ఆధారంగా ఐఎంఎస్​ డైరెక్టర్‌... ప్రతి ఇన్స్యూర్​డ్​ పర్సన్‌కు నెలకు ఒక రూపాయీ 80 పైసలు చెల్లించేలా టెలీ హెల్త్​ సర్వీస్​కు పనులు అప్పగించినట్టు పేర్కొంది. వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేందుకు ఆర్థికశాఖ సమ్మతి, బడ్జెట్‌ విడుదల ఉత్తర్వుల్లేనట్లు తెలిపింది. 2017 జనవరి నుంచి 2018 మే వరకూ ఈ సంస్థకు రూ.4.15 కోట్లు చెల్లించినట్టు అనిశా గుర్తించింది. తిరుపతి విజిలెన్స్ అధికారులు కొన్ని ఈఎస్​ఐ ఆసుపత్రుల వైద్యాధికారుల్ని ప్రశ్నిస్తే... టోల్‌ ఫ్రీ సేవల విషయం తెలియదన్నారని... ఈ క్రమంలో రమేశ్‌కుమార్‌తో టెలీ హెల్త్​ సర్వీస్​ సంస్థ కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని అనిశా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

ఇన్స్యూర్​డ్​ పర్సన్​ల సంఖ్య పెరిగింది

2018 జనవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో టెలిసంస్థ కాల్‌ లాగ్స్‌ను పరిశీలిస్తే అవి తెలంగాణలో ఉండేవారివని తేలినట్టు అనిశా తెలిపింది. 2017 ఫిబ్రవరికి 5లక్షల 92 వేల ఐపీలకు రూ.10,65,600 చెల్లించాలని సంస్థ కోరినట్టు... మార్చి నెలకు 11,14,621 మందికి రూ.20లక్షలకు పైగా చెల్లించాలన్నట్టు అనిశా వెల్లడించింది. ఈ రెండు నెలల మధ్య ఇన్‌ష్యూర్డ్ పర్సన్‌ల సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్లు అనిశా పేర్కొంది.

ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు

200 రూపాయల ఈసీజీ కోసం టెలీహెల్త్ సంస్థకు 480 చొప్పున రూ.3.80 కోట్లు చెల్లించారని అనిశా తెలిపింది. అర్హులైన వైద్యులు సేవలందిస్తున్నారో లేదో చూడకుండా రమేశ్‌కుమార్‌, ఆ తర్వాత వచ్చిన విజయకుమార్‌ టెలీ హెల్త్​ సర్వీసెస్​ సంస్థకు కోట్లు చెల్లించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని అనిశా పేర్కొంది. అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగా పీసీఎంఎస్​ అనే సాఫ్ట్‌వేర్ పనులకు టెలీసంస్థతో 2017 డిసెంబర్‌ 2న ఒప్పందం కుదుర్చుకున్నా... ఆ సంస్థ ప్రాజెక్టు ప్రారంభించలేదని అధికారులు తెలిపారు. టెలీ సంస్థ డైరెక్టర్‌ ప్రమోద్‌రెడ్డి... రమేశ్‌కుమార్‌తో కుమ్మక్కై కాల్‌ సెంటర్ల ఏర్పాటు, ఈసీజీ తదితర విషయాల్లో రూ.7.96 కోట్ల అనుచిత సొమ్మును అందుకున్నారని తేలినట్టు అనిశా రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది. ఈ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే.... ఐఎంఎస్​ అప్పటి డైరక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌కుమార్, అచ్చెన్నాయుడు, టెలీ సంస్థ డైరెక్టర్‌ ప్రమోద్‌రెడ్డి.... నేరపూర్వక దుష్ప్రవర్తన, ప్రభుత్వ నిధుల నేరపూర్వక దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమికంగా స్పష్టమవుతోందని అనిశా స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details