తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వెలగపూడిలో రణరంగం... ఇరు వర్గాల ఘర్షణలో మహిళ మృతి

ఏపీలోని గుంటూరు జిల్లా వెలగపూడిలో చిన్న విషయంలో నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకున్నారు.

By

Published : Dec 28, 2020, 9:33 AM IST

a-woman-was-killed-in-a-clash-between-the-two-groups
వెలగపూడిలో రణరంగం

ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఎస్సీ కాలనీలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఎస్సీ కాలనీలో ప్రభుత్వం సిమెంట్ రోడ్లు నిర్మిస్తోంది. రెండు వర్గాల మధ్యలో ఉన్న రోడ్డుపై ఆర్చ్ నిర్మించి దానికి ఓ జాతీయ నేత పేరు పెట్టాలని ఓ వర్గం ప్రతిపాదించింది. దీనికి మరో వర్గం వ్యతిరేకించటంతో వివాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మళ్లీ వేడెక్కింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఓ మహిళ పరిస్థితి విషమంగా మారటంతో గుంటూరుకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని వెలగపూడికి తరలించారు. గ్రామంలో మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

వెలగపూడిలో రణరంగం

ABOUT THE AUTHOR

...view details